రష్యా ఎంత పని చేసింది: ఉక్రెయిన్తో యుద్ధంలో రాత్రికి రాత్రి కీలక పరిణామాలు - నాటో ఎంట్రీ
వార్సా: రష్యా-ఉక్రెయిన్ మధ్య హోరాహోరీగా సాగుతోన్న యుద్ధానికి అంతు ఉండట్లేదు. మరింత తీవ్రతరమౌతూ వస్తోంది. ఫిబ్రవరి 24వ తేదీన ఆరంభమైన నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. రష్యా దాడుల్లో ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు ధ్వంసం అయ్యాయి. పలువురు ప్రాణాలు కోల్పోయారు. అదే స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. అయినప్పటికీ ఏ దేశం కూడా వెనక్కి తగ్గట్లేదు. సై అంటే సై అంటోన్నాయి. రష్యా చేస్తోన్న దాడులను ఉక్రెయిన్ సమర్థవంతంగా అడ్డుకుంటోంది.
ప్రతిఘటన..
ఇన్ని రోజులుగా సాగుతున్న ఈ యుద్ధం వల్ల ఇప్పటికే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు నేలమట్టం అయ్యాయి. వాటిని రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. మరియోపోల్, మెలిటొపోల్, క్రిమియా, డాన్బాస్, డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, సుమి, ఒడెస్సా, చెర్న్హీవ్.. వంటి నగరాలను రష్యా సైనిక బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. రాజధాని కీవ్ను చుట్టుముట్టినప్పటికీ.. అంత తేలిగ్గా లొంగట్లేదు. రాజధానిని కాపాడుకోవడంలో ఉక్రెయిన్ సైన్యం శక్తివంచన లేకుండా శ్రమిస్తోంది.
గురి తప్పిన రాకెట్స్
ఈ పరిణామాల మధ్య కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యా సంధించిన రాకెట్లు గురి తప్పాయి. నేరుగా వెళ్లి ఉక్రెయిన్ పొరుగునే ఉన్న పోలాండ్లో పడ్డాయి. పోలాండ్ తూర్పు ప్రాంతంలోని ప్రెజెవొడోవ్ గ్రామాన్ని కొంత మేర ధ్వంసం చేశాయి. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. పోలాండ్-ఉక్రెయిన్ సరిహద్దులకు ఆనుకుని ఉంటుందీ గ్రామం. సరిహద్దుకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఉక్రెయిన్ సరిహద్దు నగరం ల్వీవ్పై రష్యా సైనికులు రాకెట్లతో దాడి చేస్తోన్న సమయంలో అవి గురి తప్పినట్లు చెబుతున్నారు.
జో బైడెన్ జోక్యం..
రష్యా రాకెట్లు తమ దేశంలో వచ్చి పడటాన్ని పోలాండ్ తీవ్రంగా పరిగణిస్తోంది. పోలాండ్- నాటో సభ్య దేశం కూడా కావడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఈ ఘటనతో నాటో సభ్య దేశాలన్నీ పోలాండ్కు బాసటగా నిలుస్తోన్నాయి. రాకెట్లు తమ దేశంలో పడిన వెంటనే పోలాండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ డుడా.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో మాట్లాడారు. ప్రజెవొడోవ్లో చోటు చేసకున్న పరిణామాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. నాటో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది.
రష్యా రాయబారికి సమన్లు..
అక్కడితో ఆగలేదు పోలాండ్. తమ దేశంలో ఉన్న రష్యా రాయబారికి సమన్లను జారీ చేసింది. దీనిపై సంతృప్తికరమైన వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు పోలాండ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లుకాస్ జసినా ఓ ప్రకటన విడుదల చేశారు. రష్యా దాడుల్లో తమ దేశ పౌరులు మరణించడాన్ని తీవ్రంగా పరిగణిస్తోన్నామని స్పష్టం చేశారు. దీనిపై అత్యవసరంగా సంతృప్తికరమైన వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
ఉక్రెయిన్ దూకుడు..
నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, యూరోపియన్ యూనియన్ సహా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలు అందజేస్తోన్న ఆయుధ సామాగ్రితో రష్యా దూకుడును అడ్డుకుంటోంది ఉక్రెయిన్ సైన్యం. ఈ క్రమంలో రెండు వైపులా పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించింది. ఈ పరిణామాల మధ్య రష్యా మరింత రెచ్చిపోతోంది. జనావాసాలను సైతం లెక్క చేయట్లేదు. పునరావాస భవనాలపైనా దాడులను సాగిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి.