ఉక్రెయిన్ కెమికల్ ప్లాంట్ ధ్వంసం: విషవాయువు లీక్: కిలోమీటర్ల కొద్దీ..ఉక్కిరిబిక్కిరి
కీవ్: రోజులు గడుస్తున్న కొద్దీ- రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న మరింత తీవ్రం అవుతోంది. ఇవ్వాళ్టికి 26వ రోజుకు చేరుకుంది. కిందటి నెల 24వ తేదీన ఆరంభమైన యుద్ధం ఇప్పటికే విధ్వంసాన్ని మిగిల్చింది. రోజురోజుకూ మరింత ఉధృతం అవుతోంది. ఏ దేశం కూడా వెనక్కి తగ్గట్లేదు. రష్యా సాగిస్తోన్న భీకరదాడులను ఉక్రెయిన్ సమర్థవంతంగా తిప్పి కొడుతోంది. అనూహ్యంగా ప్రతిఘటిస్తోంది. రష్యా సైతం ఈ ప్రతిదాడిని ఊహించి ఉండకపోవచ్చు.
సుదీర్ఘ పోరాటానికి సై..
అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా సహా యూరోపియన్ యూనియన్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ సభ్య దేశాలన్నీ ఉక్రెయిన్కు అండగా నిలిచాయి. యుద్ధ సామాగ్రిని సరఫరా చేస్తోన్నాయి. ప్రపంచబ్యాంక్ సహా ఆయా దేశాలన్నీ ఆర్థికంగానూ ఉక్రెయిన్కు అండదండలను అందిస్తోన్నాయి. దీనితో రష్యాను నిలువరించగలుగుతోంది. యుద్ధాన్ని సుదీర్ఘకాలం పాటు కొనసాగించే సామర్థ్యాన్ని అందిపుచ్చుకున్నట్టయింది.
నష్టపోతున్న రష్యా..
మరోవంక- రష్యా ఈ యుద్ధంలో తీవ్రంగా నష్టపోతోంది. ఇప్పటిదాకా 14,700 మంది రష్యన్ సైనికులు ఈ యుద్ధం మరణించారు. 96 యుద్ధ విమానాలు, 118 హెలికాప్టర్లను ఉక్రెయిన్ సైన్యం కూల్చివేసింది. 1,487 సాయుధ వాహనాలు, 947 సైనిక వాహనాలు, 476 ట్యాంకులు, 74 ఎంఎల్ఆర్లు, 60 ట్రక్కులు, 44 యాంటీ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్స్, 21 యూఈవీలు, 12 ప్రత్యేక పరికరాలను రష్యా నష్టపోయినట్లు ఉక్రెయిన్ ఆర్మీ వెల్లడించింది.
కొలిక్కి రాని శాంతి చర్చలు..
యుద్ధాన్ని నిలిపివేయడానికి రెండు దేశాల ప్రతినిధులు శాంతి చర్చల్లో పాల్గొంటోన్నప్పటికీ.. అవి కొలిక్కి రావట్లేదు. డిమాండ్లను అంగీకరించే విషయంలో ప్రతిష్ఠంభన నెలకొంటోంది. ఉక్రెయిన్పై రష్యా ఎప్పట్లాగే విరుచుకుపడుతోంది.
దాదాపు అన్ని రీజియన్లపైనా పట్టు బిగించింది. తమ దేశ సరిహద్దులకు సమీపంలో ఉన్న అన్ని నగరాలనూ ఆధీనంలోకి తెచ్చుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ముఖాముఖి చర్చలకు తాను సిద్ధంగా ఉన్నానని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు.
కెమికల్ ప్లాంట్పై రాకెట్ల దాడి..
ఈ పరిణామాల మధ్య రష్యా తన దాడిని మరింత ఉధృతం చేసింది. తమ దేశ సరిహద్దుకు ఆనుకుని ఉన్న సుమీపై విరుచుకుపడింది. నగర శివార్లలో ఉన్న సుమిఖిమ్ప్రోమ్ కెమికల్ ప్లాంట్పై రాకెట్లతో దాడి చేసింది. ఈ దాడిలో ఈ ప్లాంట్ మొత్తం ధ్వంసమైంది. దీనితో ప్రమాదకరమైన అమ్మోనియా విషవాయువు వెలువడింది. ఉక్రెయిన్ కాలమానం ప్రకారం.. ఈ తెల్లవారు జామున 4:30 గంటలకు ఈ ప్లాంట్ నుంచి విషవాయువు వెలువడింది.
నిర్ధారించిన రీజినల్ మిలటరీ చీఫ్
దీని ప్రభావం సుమారు అయిదు చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించినట్లు సుమీ రీజినల్ మిలటరీ అడ్మినిస్ట్రేషన్ అధిపతి దిమిత్రో ఝివిట్స్కీ తెలిపారు. ఆక్సిజన్ కంటే తేలిక కావడం వల్ల త్వరగా వ్యాప్తి చెందుతుందని వివరించారు. దీని నుంచి రక్షణ పొందడానికి స్థానికులు అపార్ట్మెంట్ బేస్మెంట్లల్లో తలదాచుకోవాలని సూచించారు. ముందు జాగ్రత్తలతో ఈ విషవాయువు ప్రమాదం నుంచి బయటపడొచ్చని పేర్కొన్నారు.
Recommended Video
ఉలిక్కిపడ్డ సుమీ..
కెమికల్ ప్లాంట్ నుంచి అమ్మోనియా వెలువడిన సమాచారంతో సుమీ ప్రజలు ఉలిక్కిపడ్డారు. 2,65,000 జనాభా ఉన్న ఈ నగరం ఇది. ఇప్పటికే సగం మంది వరకు శరణార్థులుగా సరిహద్దులను దాటుకుని వెళ్లిపోయారు. పోలాండ్, రొమేనియా, మోల్డోవా, స్లొవేకియా, హంగేరిలకు తరలి వెళ్లారు. వేలాదిమంది అక్కడే చిక్కుకుని ఉన్నారు. వారి కోసం హ్యూమనైటేరియన్ కారిడార్ను ఏర్పాటు చేసింది రష్యా. సామాన్య పౌరులను తరలించడానికి వీలుగా ఇదివరకు కాల్పులను విరమించింది. తాజాగా అమ్మోనియా వెలువడంతో భయాందోళనలకు గురవుతున్నారు. ఘాటు వాసనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.