25 వేల ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అంతం
లండన్: బ్రిటన్, దాని మిత్రదేశాల వైమానిక దాడుల్లో 25,000 మంది ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు మరణించారని బ్రిటన్ ఎయిరో ఫోర్స్ (ఆర్ఏఎఫ్) కల్నల్ వారెన్ స్థానిక మీడియాకు చెప్పారు. ఐఎస్ఐఎస్ ను అంతం చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
వరుస వైమానిక దాడులతో ఐఎస్ఐఎస్ కు కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలిందని ఆయన అన్నారు. ఇరాక్, సిరియా లోని ఐఎస్ఐఎస్ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో జీహాదీల సంఖ్య సగానికి తగ్గిందని వారెన్ స్పష్టం చేశారు. గత మూడు వారాల్లో అనేక సార్లు వైమానిక దాడులు చేశామని అన్నారు.
మూడు వారల్లో 600 మంది ఉగ్రవాదులు అంతం అయ్యారని వివరించారు. ఉత్తర ఇరాక్ లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కేవలం 30,000 మంది మాత్రమే ఉన్నారని, వారిని వీలైనంత త్వరలో అంతం చేస్తామని వారెన్ అన్నారు. తాము ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులతో పాటు వారి ఆర్థిక లావాదేవీలు దెబ్బ తీస్తున్నామని చెప్పారు.
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు చెందిన చమురు కేంద్రాల మీద తాము వైమానిక దాడులు చేశామని అన్నారు. చమురు క్షేత్రాలు దాదాపు ద్వంసం చేశామని వివరించారు. గత కొన్ని నెలలుగా అమెరికా, సంకీర్ణ సేనలు జరుపుతున్న దాడుల్లో ఐఎస్ఐఎస్ పూర్తిగా బలహీనపడిందని చెప్పారు. జీహాది జాన్, ఒమర్ అల్ షిషానీతో సహ 100 మందికి పైగా ఉగ్రవాద నాయకులు అంతం అయ్యారని వారెన్ వివరించారు.