మియన్మార్లో నిరసనకారులపై సైన్యం కాల్పులు.. 90 మంది వరకు చనిపోయారంటున్న స్థానిక మీడియా
మియన్మార్లో నిరసనకారులపై సైన్యం మరోసారి కాల్పులు జరిపింది.
ఈ కాల్పుల్లో 90 మంది వరకు చనిపోయారని స్థానిక మీడియా చెబుతోంది.
సైనిక తిరుగుబాటు నేతలు ఇవాళ సాయుధ దళాల దినోత్సవం నిర్వహిస్తున్నారు.
ఇదే సమయంలో సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా ప్రజలు అనేక నగరాల్లో రోడ్ల మీదికి వచ్చారు.
యాంగూన్ సహా ఇతర నగరాల్లో ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చారు.
వారిపై కాల్పులు జరపడంతో 90 మంది వరకూ చనిపోయినట్లు రిపోర్టులు వస్తున్నాయి.
"ప్రజాస్వామ్యాన్ని కాపాడతానని, ఎన్నికలు జరిపిస్తానని" సైనిక తిరుగుబాటు నేత మిన్ ఆంగ్ హ్లయింగ్ జాతీయ టీవీలో ప్రసంగంలో చెప్పారు.
అయితే, అది ఎప్పుడనేది మాత్రం చెప్పలేదు.
ఫిబ్రవరిలో సైన్యం తిరుగుబాటు చేసి మియన్మార్లో అధికారం చేజిక్కించుకున్నప్పటి నుంచి జరిగిన నిరసనల్లో 320 మందికి పైగా ఆందోళనకారులు చనిపోయారు.
"గతంలో జరిగిన విషాద మరణాల నుంచి ప్రజలు నేర్చుకోవాలి. మీ తలపై, వీపులో కాల్పులు జరిపే ప్రమాదం ఉంది" అని జాతీయ టీవీలో హెచ్చరికలు ప్రసారం చేశారు.
వీధుల్లో ఏం జరుగుతోంది?
నిరసనలను అణచివేసేందుకు భద్రతా దళాలను భారీగా ఉపయోగించే ప్రమాదం ఉన్నప్పటికీ, నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనలకు పిలుపునిచ్చారు.
దేశంలో ముఖ్యంగా రాజధాని యాంగూన్లో నిరసనలను అడ్డుకోడానికి భద్రతాదళాలను మరింతగా మోహరించారు.
ఈ కాల్పుల్లో మృతుల సంఖ్యను ధ్రువీకరించడం కష్టంగా ఉంది.
ది ఇర్రావాడ్డీ అనే న్యూస్ వెబ్సైట్ మొత్తం 28 ప్రాంతాల్లో కాల్పులు జరిగాయని, ముగ్గురు పిల్లలు సహా 59మంది చనిపోయారని చెప్పింది.
దేశంలోని రెండో అతిపెద్ద నగరం మండలైలో కూడా నిరసనకారులు ఆంగ్ సాన్ సూచీకి చెందిన ఎన్ఎల్డీ పార్టీ జెండాతో రోడ్లపైకి వచ్చారు.
సైనిక పాలనకు వ్యతిరేకంగా మూడు వేళ్లతో సెల్యూట్ చేస్తూ నిరసనలు చేపట్టారు.
లాషివో నగరంలో నిరసనకారులపై పోలీసులు లైవ్ బుల్లెట్లు కాల్చారని ఒక జర్నలిస్ట్ ఏఎఫ్పీతో చెప్పారు.
"ఈరోజు సాయుధ దళాలు సిగ్గు పడాల్సిన రోజు. 300 మందికి పైగా అమాయక పౌరులను చంపిన మిలిటరీ జనరళ్లు.. సాయుధ దళాల దినోత్సవం జరుపుకుంటున్నారు" అని తిరుగుబాటు వ్యతిరేక గ్రూప్ సీఆర్పీహెచ్ ప్రతినిధి డాక్టర్ సాసా అన్నారు.
తిరుగుబాటు నేతలు ఏమంటున్నారు?
ప్రజాస్వామ్యాన్ని కాపాడ్డానికి సైన్యం మొత్తం దేశంతో చేతుల కలపాలనుకుంటోందని జనరల్ ఆంగ్ హ్లయింగ్ అన్నారు.
"మీ డిమాండ్ల కోసం స్థిరత్వం, భద్రతపై ప్రభావం పడేలా హింసాత్మక చర్యలకు పాల్పడడం తగదు. ప్రజాస్వామ్యబద్ధంగాఎన్నికైన సూచీ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడడం వల్లే, సైన్యం అధికారాన్ని స్వాధీనం చేసుకోవాల్సి వచ్చింది" అని అన్నారు.
1945లో జపాన్ ఆక్రమణకు వ్యతిరేకంగా మియన్మార్ సైనిక ప్రతిఘటన ప్రారంభానికి గుర్తుగా ఆ దేశంలో సాయుధ దళాల దినోత్సవం జరుపుకుంటారు.
ఇవి కూడా చదవండి:
- రూ. 2000 నోట్ల ముద్రణను రిజర్వు బ్యాంక్ ఆపేసింది... పెద్ద నోటు మళ్లీ రద్దవుతుందా?
- బ్యాంకుల సమ్మె ఎందుకు? మోదీ ప్రభుత్వం.. ప్రభుత్వ బ్యాంకులను ఎందుకు ప్రైవేటీకరిస్తోంది?
- IPO అంటే ఏమిటి... దరఖాస్తు చేసిన వారందరికీ షేర్లు కేటాయిస్తారా? కేటాయించకపోతే ఏం చేయాలి?
- మ్యూచువల్ ఫండ్స్: మహిళలు పెట్టుబడి పెట్టేందుకు అద్భుతమైన మార్గం ఇదేనా?
- విశాఖపట్నం: సాగర తీరంలో టీయూ-142 యుద్ధ విమానం... దీని చూస్తే ఎందుకు ఉద్వేగం ఉరకలేస్తుంది?
- మియన్మార్లో 'సరోంగ్ విప్లవం': మహిళలు నడుముకు కట్టుకునే 'సరోంగ్' వస్త్రం.. నిరసనకారుల ఆయుధంగా మారిన వైనం
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- చంద్రబాబు నాయుడుకు ఏపీ సీఐడీ నోటీసులు... అమరావతి భూముల సేకరణపై విచారణకు రావాలని ఆదేశం
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- బిర్యానీ పక్కాగా వండాలంటే కచ్చితమైన లెక్కలు ఉంటాయా? దీనికో ఆల్గారిథమ్ ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)