ఐఎస్ఐఎస్ ఆత్మాహుతి దాడులు: 26 మంది బలి
డెమాస్కస్: సిరియాలో ఉగ్రవాదులు పరోక్షంగా యుద్ధం చేస్తూ అక్కడి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. రోజు రోజుకు ఉగ్రవాదులు రెచ్చిపోవడంతో స్థానిక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు సోమవారం ఆత్మాహుతి దాడులు జరపడంతో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. 70 మందికి తీవ్రగాయాలై ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. సిరియాలోని ఖాష్మాన్ అనే ప్రాంతంలో ఒక ఉగ్రవాది కారు నిండా బాంబులు వేసుకుని వెళ్లాడు.
తరువాత ఒక స్కూల్ సమీపంలో తనను తాను పేల్చేసుకున్నాడు. అర్దగంట తరువాత వాటర్ ట్యాంకులో బాంబులు వేసుకుని వచ్చిన ఉగ్రవాది మొదట తుపాకి తీసుకుని ఇష్టం వచ్చినట్లు కాల్పులు జరిపాడు.

సైనికులు అతనిని పట్టుకోవడానికి ప్రయత్నించిన సమయంలో తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ రెండు ఆత్మాహుతి దాడులలో 26 మంది మరణించారు. స్కూల్ సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో విద్యార్థులతో పాటు మహిళలు మరణించారని అధికారులు తెలిపారు.
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారని సైనిక బలగాలు అంటున్నాయి. గత జనవరి నెల నుంచి ఇప్పటి వరకు సిరియాలో ఆరు సార్లు ఆత్మాహుతి దాడులు జరిగాయి. అనేక మంది సామాన్య ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.












Click it and Unblock the Notifications