అమెరికాలో ఆలయంపై అడ్డమైన రాతలు: భారత్ తో గొడవల వేళ..
కొద్ది రోజులుగా అమెరికా- భారత్ మధ్య టారిఫ్ గొడవలు కొనసాగుతున్నాయి. భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా ఏకంగా 50 శాతం టారిఫ్ విధించడం విఘాతంలా పరిణమించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం తన ఆందోళన సైతం అక్కడి ప్రభుత్వానికి తెలియజేసింది. అదే సమయంలో పాకిస్తాన్ ను ప్రోత్సహిస్తోంది అమెరికా. ఇది ఈ రెండు దేశాల మధ్య అగాథాన్ని మరింత పెంచినట్టయింది.
ఈ పరిణామాల మధ్య అమెరికాలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఇండియానా గ్రీన్వుడ్లో ఉన్న బోచసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ్ సంస్థ (BAPS) ఆలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఖలిస్తాన్ మద్దతుదారులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి.

ఆలయ గోడలపై భారత్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా రాతలు రాశారు. బ్లాక్ కలర్ పెయింట్ తో మోదీ ముర్దాబాద్ అని రాశారు. ఏడాది కాలంలో ఇలాంటి దాడులు చోటు చేసుకోవడం ఇది నాలుగోసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టారిఫ్ గొడవలు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఘటన జరగడం కలకలం రేపుతోంది.
ఈ చర్యను హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఖండించింది. ఆందోళన వ్యక్తం చేసింది. తీవ్రంగా స్పందించింది. దీని వెనుక ఖలిస్తాన్ వేర్పాటువాదుల ప్రమేయం ఉండొచ్చని పేర్కొంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. హిందూ ఆలయాలపై భారత్కు వ్యతిరేక నినాదాలు రాయడం ఖలిస్తాన్ వేర్పాటువాద కార్యకర్తలు తరచుగా ఉపయోగించే ఎత్తుగడగా అభివర్ణించింది.
దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. చికాగోలోని భారత కాన్సులేట్ జనరల్ కూడా ఈ ఘటన పట్ల తీవ్రంగా స్పందించింది. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి, తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది కాన్సులేట్ కోరింది. గ్రీన్వుడ్లోని బీఏపీఎస్ స్వామినారాయణ్ ఆలయ ప్రధాన సైన్బోర్డు ధ్వంసం చేయడం అత్యంత దారుణమని పేర్కొంది.
ఈ అంశంపై కాన్సులేట్ కమ్యూనిటీతో సంప్రదింపులు జరుపుతోందని కాన్సులేట్ జనరల్ ఎక్స్లో పోస్ట్ చేసింది. గ్రీన్వుడ్ మేయర్, ఇతర అధికారులు తక్షణ చర్యలు తీసుకోవలని సూచించింది. దుండగుల చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్థానికంగా నివసించే భారతీయులకు పిలుపునిచ్చింది.
ఈ ఏడాది మార్చిలో దక్షిణ కాలిఫోర్నియాలోని ఓ ప్రముఖ హిందూ ఆలయాన్ని కూడా గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ ఆలయంపైనా హిందూ, కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు రాశారు. ప్రహరీగోడను ధ్వంసం చేశారు. గత ఏడాది సెప్టెంబర్లో న్యూయార్క్లోని మెల్విల్లేలోని స్వామి నారాయణ్ ఆలయంపై భారత్కు వ్యతిరేక నినాదాలతో స్ప్రే పెయింట్ చేశారు.












Click it and Unblock the Notifications