కొత్త యూఎస్ కాన్సులేట్స్- బెంగళూరుతో సహా
వాషింగ్టన్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తలపెట్టిన అమెరికా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి లాన్లో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న ఆయన అక్కడి నుంచి నేరుగా వాషింగ్టన్కు చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్ హౌస్లో ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఏర్పాటు చేసిన విందుకు హాజరయ్యారు.
ప్రస్తుతం మోదీ చేపట్టిన అమెరికా పర్యటన సత్ఫలితాలను అందిస్తోంది. ఆయన అమెరికాలో ఉండగానే.. భారత్పై పలు వరాలను కురిపించింది అగ్రరాజ్యం. భారత్లో కొత్తగా కాన్సులేట్లను ఏర్పాటు చేయబోతోన్నట్లు ప్రకటించింది. తొలిదశలో రెండు నగరాలను ఎంపిక చేసింది. ఇందులో ఒకటి- బెంగళూరు. సిలికాన్ సిటీగా గుర్తింపు పొందిన బెంగళూరులో కొత్తగా కాన్సులేట్ను ఏర్పాటు చేస్తామని వైట్హౌస్ వెల్లడించింది.

రెండో కాన్సులేట్ను ఎక్కడ ఏర్పాటు చేస్తారనేది ఇంకా తెలియరావట్లేదు. ఉత్తరాది రాష్ట్రానికి కేటాయించే అవకాశం ఉన్నట్లు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో నాలుగు నగరాల్లో మాత్రమే యూఎస్ కాన్సులేట్స్.. తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ముంబై, కోల్కత, హైదరాబాద్, చెన్నైల్లో యూఎస్ కాన్సులేట్స్ కార్యాలయాలు అందుబాటులో ఉంటోన్నాయి.
దీనికి అదనంగా మరో రెండింటిని నెలకొల్పుతామని వైట్ హౌస్.. తాజాగా ప్రకటించింది. అందులో ఒకటి బెంగళూరులో ఏర్పాటు చేయబోతోన్నామని స్పష్టం చేసింది. మరో నగరాన్ని ఇంకా ఎంపిక చేయాల్సి ఉందని పేర్కొంది. బెంగళూరులో యూఎస్ కాన్సులేట్ను ఏర్పాటు చేయాలనే డిమాండ్ కొంతకాలంగా వినిపిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే.
ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున ఐటీ నిపుణులు అమెరికాకు రాకపోకలు సాగిస్తోన్న నేపథ్యంలో కాన్సులేట్ను ఏర్పాటు చేయాలంటూ గతంలో ప్రతిపాదించారు. అప్పట్లో అవి కార్యరూపాన్ని దాల్చలేకపోయాయి. తాజాగా దీన్ని అమెరికన్ ప్రభుత్వం ఆమోదించింది. కర్ణాటకతో పాటు కేరళీయులకు ఇది అనుకూలంగా ఉంటుంది. యూఎస్ కాన్సులేట్ అవసరాల కోసం ప్రస్తుతం రాయలసీమ వాసులు చెన్నై లేదా హైదరాబాద్కు వెళ్తోన్నారు. బెంగళూరులో ఏర్పాటు కావడం అటు ఈ ప్రాంతానికి కూడా అనుకూలంగా ఉంటుంది.












Click it and Unblock the Notifications