జో బైడెన్ కీలక నిర్ణయం... ఇద్దరు భారత సంతతి అధికారులకు ప్రమోషన్... సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్లో కీలక పదవులు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన టీమ్లో భారత సంతతి అమెరికన్లకు పెద్ద పీట వేస్తున్నారు. ఇప్పటికే 20 మందికి పైగా భారత సంతతి వ్యక్తులను తన టీమ్లో నియమించుకున్నారు. తాజాగా ఇద్దరు భారత సంతతి మహిళలను కీలక పదవులకు నామినేట్ చేయనున్నట్లు ప్రకటించారు. ఆ ఇద్దరిలో ఒకరు మీరా జోషి కాగా.. మరొకరు రాధికా ఫాక్స్. సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్లో కీలక పదవులకు వీరిని ప్రమోట్ చేయనున్నారు.
ఏ పదవుల్లో నియమించనున్నారు..?
మీరా జోషి,రాధికా ఫాక్స్... ఈ ఇద్దరూ డే-1 నుంచి జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో పనిచేస్తున్నారు. జనవరి 20న బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన రోజే ఆయన టీమ్లో చేరారు. మీరా జోషి డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్లో ఫెడరల్ మోటార్ క్యారియర్ డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తున్నారు. ఇప్పుడదే శాఖలో ఆమెకు అడ్మినిస్ట్రేటర్గా పదోన్నతి కల్పించనున్నారు. ఇక రాధికా ఫాక్స్ వాటర్,ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీలో ప్రిన్సిపల్ డిప్యూటీ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తున్నారు. ఇప్పుడదే శాఖలో ఆమెకు అస్టిటెంట్ అడ్మినిస్ట్రేటర్గా పదోన్నతి కల్పించనున్నారు.
ఇద్దరికీ సుదీర్ఘ అనుభవం...
ప్రస్తుతం ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న ఫైజల్ అమీన్కు కూడా పదోన్నతి కల్పించే యోచనలో ఉన్నట్లు జో బైడెన్ తెలిపారు. ఫైజల్ను చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా నియమించే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. ఆయా శాఖల్లో మొత్తం 12 కీలక పోస్టులకు అభ్యర్థులను నామినేట్ చేసే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగానే ఈ ముగ్గురికి పదోన్నతి కల్పించనున్నారు. మీరా జోషికి అడ్మినిస్ట్రేషన్లో 16 ఏళ్ల అనుభవం ఉంది. రాధిక ఫాక్స్... ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్లో చేరకముందు యూఎస్ వాటర్ అలయన్స్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేశారు. నీటికి సంబంధించిన సమస్యల పరిష్కారంలో ఆమె సమర్థవంతమైన ఆఫీసర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో ఆమె ఫెడరల్ పాలసీ డైరెక్టర్గా కూడా పనిచేశారు.
బైడెన్ టీమ్లో భారత సంతతికి పెద్ద పీట..
అమెరికా జనాభాలో భారత సంతతి వాటా ఒకశాతం కంటే తక్కువే. అయినప్పటికీ అగ్రరాజ్యం అభివృద్ధిలో మనవాళ్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. అందుకే బైడెన్ తన టీమ్లో భారత సంతతి వ్యక్తులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. బైడెన్ స్పీచ్ రైటింగ్ బృందం డైరెక్టర్గా వినయ్ రెడ్డి, అధ్యక్షుడి అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా వేదాంత్ పటేల్, జస్టిస్ డిపార్ట్మెంట్ అసోసియేట్ అటార్నీ జనరల్గా వనితా గుప్తా, స్టేట్ డిపార్ట్మెంట్లో అండర్ సెక్రటరీగా ఉజ్రా జాయే, ప్రథమ మహిళ పాలసీ డైరెక్టర్గా మాలా అడిగా, ప్రథమ మహిళ ఆఫీస్ డిజిటల్ డైరెక్టర్గా గరీమా వర్మ, ప్రథమ మహిళ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా సబ్రీన్ సింగ్, వైట్హౌస్ డిజిటల్ ఆఫీస్ పార్టనర్షిప్ మేనేజర్గా అయిషా, నేషనల్ ఎకనమిక్ కౌన్సిల్ డిప్యూటీ డైరెక్టర్గా సమీరా ఫజిలి, భరత్ రామ్మూర్తి తదితర భారత సంతతి వ్యక్తులు బైడెన్ టీమ్లో పనిచేస్తున్నారు.