భారత్ కు ట్రంప్ బిగ్ రిలీఫ్..! పుతిన్ తో భేటీ తర్వాత కీలక పరిణామం..!
రష్యా-ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘకాలంగా సాగుతున్న యుద్దంపై చర్చించేందుకు అలస్కాలో వ్లాదిమీర్ పుతిన్ తో భేటీ అయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రూటు మార్చారు. ముఖ్యంగా రష్యా చమురు కొంటున్నాయన్న కారణంతో ఆ దేశానికి మిత్రదేశాలైన భారత్, చైనా, బ్రెజిల్ పై అదనపు సుంకాలతో ఉరుముతున్న ట్రంప్ కాస్త శాంతించారు. ఈ మేరకు భారత్ కు ఊరట కల్పించేలా ఇవాళ కీలక ప్రకటన విడుదల చేశారు.
అలస్కాలో పుతిన్ తో భేటీ అయి శాంతియుత వాతావరణంలో చర్చలు జరిపిన డొనాల్డ్ ట్రంప్.. గతంలో రష్యా చమురు కొంటున్నాయన్న కారణంతో భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై విధించిన అదనపు సుంకాల విషయంలో వెనక్కి తగ్గారు. భారత్ సహా రష్యా చమురు కొంటున్న దేశాలపై ద్వితీయ సుంకాలు విధించబోనని ట్రంప్ ప్రకటించారు. తద్వారా తాజాగా భారత్ పై విధించిన 25 శాతం సుంకాల నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వాస్తవానికి పుతిన్ ను కలిసేందుకు ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో వెళ్తూ ఇంటర్వ్యూ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంపై సంకేతం ఇచ్చేశారు. భారత్ కు చమురు అమ్ముతున్న పుతిన్.. ఇప్పుడు తన సుంకాల కారణంగా ఓ క్లయింట్ ను కోల్పోయాడని ట్రంప్ చెప్పుకొచ్చారు. భారతదేశం చమురులో దాదాపు 40 శాతం వాటాను రష్యా కలిగి ఉందన్నారు. అలాగే చైనా కూడా చాలా వ్యాపారం చేస్తోందన్నారు. అయితే తాను ద్వితీయ ఆంక్షలు లేదా ద్వితీయ సుంకం అనే నిర్ణయం తీసుకుంటే వారికి అది చాలా వినాశనకరమైనదన్నారు. తాను అలా చేయాల్సి వస్తే చేస్తానని, కానీ అలా చేయనవసరం లేదన్నారు.

పుతిన్ తో చర్చలు ముగిశాక మీడియా అదే ప్రశ్న మళ్లీ అడిగింది. దీంతో ట్రంప్ ఇవాళ రిగిన చర్చల వల్ల తాను ఇప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని అనుకుంటున్నట్లు తెలిపారు. రెండు వారాలు లేదా మూడు వారాలు లేదా అలాంటిదేదైనా తాను దాని గురించి ఆలోచించాల్సి రావచ్చని, కానీ మనం ఇప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. ఈ భేటీ చాలా బాగా జరిగిందన్నారు. తద్వారా భారత్ పై అదనపు సుంకాల అవసరం లేదని తేల్చేశారు.












Click it and Unblock the Notifications