తాలిబన్లకు సాయం చేయబోయి ఒంటరైన పాక్-సార్క్ దేశాల షాక్-ఏకంగా సార్క్ భేటీ రద్దు
ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని హస్తగతం చేసకున్న తాలిబన్లకు అంతర్జాతీయంగా గుర్తింపు పొందడం మాత్రం అంత సులువు కాదనే వాస్తవం క్రమంగా అర్ధమవుతోంది. తాజాగా పాకిస్తాన్ మద్దతు ఇచ్చినప్పటికీ సార్క్ దేశాల భేటీలో మాత్రం తాలిబన్లకు చుక్కెదురైంది. సార్క్ దేశాల కూటమిలో తాలిబన్లను కూడా చేర్చుకోవాలన్న పాకిస్తాన్ డిమాండ్ పై సభ్య దేశాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో దాయాది దేశానికి తొలి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
ఆప్ఘన్ లో తాలిబన్ల రాజ్యం
ఆఫ్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం స్దానంలో తాజాగా తాలిబన్లు అధికారం చేపట్టారు. 33 మంత్రులతో పాటు ప్రధాని, ఉప ప్రధాని.. ఇలా భారీ కేబినెట్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. కేబినెట్ కూర్పు విషయంలో ఇప్పటికే పలు విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. అయితే వీటి కంటే అంతర్జాతీయంగా తమ ప్రభుత్వానికి గుర్తింపు తెచ్చుకోవడం తాలిబన్లకు సవాల్ గా మారింది. ప్రభుత్వంలో మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదులకు చోటివ్వడం, ఇతరత్రా కారణాలతో తాలిబన్లకు అంతర్జాతీయ గుర్తింపు దక్కించుకునే విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయి.
అంతర్జాతీయ గుర్తింపు కోసం పాట్లు
ఆప్ఘనిస్తాన్ లో కలిసొచ్చిన పరిణామాలతో అధికారం చేజిక్కించుకున్నంత సులువుగా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకోవడం తాలిబన్లకు సాధ్యం కావడం లేదు. తొలుత పాకిస్తాన్, చైనా, రష్యా వంటి దేశాల మద్దతుతో అంతర్జాతీయంగా తమకు గుర్తింపు కావడం పెద్ద సమస్య కాదని భావించిన తాలిబన్లు... ఇప్పుడు అందుకోసం ఎక్కడలేని పాట్లు పడుతున్నారు. తాజాగా ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించేందుకు సైతం తాలిబన్ల రాయబారిగా సొహైల్ షహీన్ కు చోటు దక్కినా ప్రధాని, ఉప ప్రధానికి మాత్రం ఆహ్వనం లేదు. దీంతో అంతర్జాతీయంగా తమ ప్రభుత్వానికి గుర్తింపు కోసం తాలిబన్లు పాట్లు పడక తప్పడం లేదు.
తాలిబన్లకు సార్క్ దేశాల షాక్
ఇప్పటికే అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకునే విషయంలో నానా పాట్లు పడుతున్న తాలిబన్లు ఇప్పుడు భారత ఉపఖండంలోని సార్క్ దేశాల కూటమి సభ్య దేశాలు కూడా షాకిచ్చాయి. తాజాగా జరిగిన సార్క్ విదేశాంగమంత్రుల సమావేశాలంలో తాలిబన్లకు షాకిచ్చాయి. దీంతో ఇప్పుడు తాలిబన్లు అంతర్జాతీయంగా చేసే భవిష్యత్ ప్రయత్నాలపైనా ఈ ప్రభావం పడేలా కనిపిస్తోంది. తాలిబన్లకు ఉన్న బ్యాక్ గ్రౌండ్ తో పాటు ఉగ్రవాద సంస్ధలతో ఉన్న లింకులు, ఇలా చాలా అంశాలు వారికి అంతర్జాతీయ గుర్తింపు విషయంలో అడ్డంకిగా మారుతున్నాయి.
సార్క్ కూటమిలో చోటుకు ప్రయత్నాలు
సార్క్ దేశాల కూటమిలో తాలిబన్లకు చోటిచ్చేందుకు పాకిస్తాన్ ప్రతిపాదన చేసింది. సార్క్ సభ్య దేశంగా పాకిస్తాన్ చేసిన ప్రతిపాదనను మిగతా దేశాలైన భారత్, శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు అంగీకరించాల్సి ఉంది. కానీ విదేశాంగమంత్రుల భేటీలో తాలిబన్లతో కూడిన ఆప్ఘనిస్తాన్ సర్కార్ కు గుర్తింపు లేనందున వారికి చోటివ్వలేమని కొన్ని దేశాలు తేల్చిచెప్పేశాయి. దీంతో భారత ఉపఖండంలోనే తాలిబన్ల సర్కార్ కు గుర్తింపు దక్కలేదు. ఇక అంతర్జాతీయంగా మిగతా దేశాల మద్దతు సంపాదించడం కూడా సులువు కాదని వారికి అర్ధమైంది.
సార్క్ భేటీ రద్దు
తాలిబన్ల సర్కార్ కు గుర్తింపు ఇచ్చేందుకు సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సార్క్ సమావేశం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాలిబన్లకు గుర్తింపు కోసం పాకిస్తాన్ చేసిన ప్రతిపాదనపై సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. వీరిలో కొందరు దీన్ని సమర్ధించగా.. మరికొందరు వ్యతిరేకించారు. దీంతో ఏకాభిప్రాయం లేకుండా సమావేశం నిర్వహిస్తే సమస్యలు తప్పవని సార్క్ దేశాలు భావించినట్లు తెలుస్తోంది.
తాలిబన్లకు మద్దతిచ్చి ఒంటరైన పాకిస్తాన్
తాలిబన్లను ముందునుంచీ మద్దతిస్తున్న పాకిస్తాన్.. ఇప్పుడు వారికి అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిపెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అంతర్జాతీయంగా తనకున్న సంబంధాలను వాడుతూ మిగతా దేశాలకు తాలిబన్లకు గుర్తింపు ఇవ్వాలని ప్రతిపాదిస్తోంది. అదే సమయంలో కీలకమైన సార్క్ దేశాల కూటమిలోనూ తాలిబన్ల తరఫున విదేశాంగమంత్రికి చోటివ్వాలని పాకిస్తాన్ ప్రతిపాదించింది. అయితే తాలిబన్ల సర్కార్ కు అంతర్జాతీయంగా గుర్తింపు లేకపోవడం, ఇప్పుడు వారి విదేశాంగమంత్రికి చోటిస్తే ఎదురయ్యే పరిణామాలపై చర్చించిన సార్క్ దేశాలు పాకిస్తాన్ ప్రతిపాదనపై ఏకాభిప్రాయం సాధించలేకపోయాయి. దీంతో పాకిస్తాన్ ఒంటరిగా మారిపోయింది.