పెగాసస్ పై అమెరికా కీలక నిర్ణయం-బ్లాక్ లిస్ట్ లోకి రూపకర్త ఎన్.ఎస్.వో గ్రూప్
ఇజ్రాయెల్ కు చెందిన స్పైవేర్ పెగాసస్ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సృష్టిస్తున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. పెగాసస్ స్పైవేర్ వాడకం ద్వారా తమకు గిట్టని వారితో పాటు తమ వారిపైనా నిఘా పెట్టేందుకు, విదేశాల్లో ఉంటున్న వారిపై సైతం నిఘా పెట్టేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో దీనిపై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది.
ఇజ్రాయెల్ లో రక్షణ అవసరాల కోసం తాను ఈ స్పైవేర్ తయారు చేసినట్లు పెగాసస్ రూపకర్త ఎన్.ఎస్.వో గ్రూప్ చెప్తుండగా.. పలు దేశాలు మాత్రం తమ దేశాల్లోని వారికి దాన్ని అమ్మడం ద్వారా తమపైనే నిఘా పెట్టించినట్లు అనుమానిస్తున్నారు. భారత్ లోనూ దీనిపై పెను దుమారం రేగుతోంది. అధికారులు, జర్నలిస్టులపై సైతం పెగాసస్ తో నిఘా పెట్టినట్లు వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం పెగాసస్ రూపకర్త అయిన ఎన్.ఎస్.వో గ్రూప్ ను బ్లాక్ లిస్ట్ లో పెడుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో రాజకీయ నేతలు, స్వచ్చంద సంస్ధలు, హక్కుల కార్యకర్తలు, ప్రత్యర్ధులు, అధికారులు, జర్నలిస్టులపై పెగాసస్ తో నిఘా పెట్టినట్లు తేలడంతో అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు తమ సరిహద్దుల్ని దాటి విదేశాల్లోని అసమ్మతివాదుల్ని, జర్నలిస్టుల్ని, ఉధ్యమకారుల్ని టార్గెట్ చేసేందుకు ఈ స్పైవేర్ ను వాడుతున్నట్లు తేలడంతో దీని తయారీదారుల్ని బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నట్లు అమెరికా వాణిజ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇలా బ్లాక్ లిస్ట్ లో పెట్టడం వల్ల ఇకపై ఎన్.ఎస్వో గ్రూప్ నుంచి అమెరికాలో ఎవరూ ఎలాంటి క్రయవిక్రయాలు జరిపేందుకు వీలుండదు.
భారత్ లో ఇప్పటికే పెగాసస్ కలకలం రేపుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు దీనిపై నిపుణుల కమిటీతో విచారణ చేయిస్తోంది. దీన్ని వాడిందో లేదో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా సుప్రీంకోర్టుకు చెప్పకపోవడంతో అనుమానాలు తలెత్తాయి. దీంతో సుప్రీంకోర్టు ధర్మాసనం అనుమానాల నివృత్తి కోసం పారదర్శక దర్యాప్తు చేయించేందుకు సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రన్ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల నిపుణుల కమిటీని నియమించింది. ఈ నివేదిక రాగానే కేంద్ర ప్రభుత్వ పాత్ర తేల్చబోతోంది.












Click it and Unblock the Notifications