తవ్వకాల్లో 800మంది చిన్నారుల అస్థిపంజరాలు
లండన్: పురావస్తుశాఖ జరిపిన తవ్వకాల్లో భారీ ఎత్తున బయటపడిన మృతదేహాలు విస్మయానికి గురిచేశాయి. తవ్వకాల్లో ఒకటి కాదు...రెండు కాదు.. ఏకంగా 1,967 మృతదేహాలు బయటపడగా, అందులో 800 మంది చిన్నారుల మృత దేహాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇంగ్లాండ్లోని బ్లాక్ బర్న్ పట్టణంలో వెలుగు చూసిన అస్థిపంజరాలను పరిశీలించి అక్కడి ప్రజల జీవన పరిమాణాలపై అధ్యయనాలు చేపట్టిన ఆ శాఖ ఎన్నో విషయాలను వెల్లడించింది.
ఒకప్పుడు ఆ ప్రాంతం పారిశ్రామిక వాడగా ఉండేదని, అక్కడి ప్రజలు... ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా ఊపిరితుత్తుల సమస్యలతో మరణించినట్లు సర్వే చెప్తోంది. లండన్ లాంక్షైర్ లోని బ్లాక్ బర్న్ పట్టణంలో రహదారి నిర్మాణం కోసం పురావస్తు శాఖ చేపట్టిన తవ్వకాల్లో 800 మంది చిన్నారుల మృత దేహాలు బయట పడటం ఇప్పుడు అందరికీ విస్మయం గురిచేస్తోంది.
1821లో సెయింట్ పీటర్స్ శ్మశాన వాటికగా ఉండే ఈ ప్రాంతంలో మొత్తం 1,967 మృత దేహాలను వెలికితీశారు. వీరిలో ఎక్కువ శాతం చిన్నారుల మృత దేహాలు ఉండటమే కాదు.. వీరంతా ఆరేళ్ళ లోపు వయసువారే అయి ఉండటం గమనార్హం. పారిశుద్ధ్య లోపం, మందులు లేకపోవడంతోనే కాక, అధికశాతం ఇన్ఫెక్షన్లతో కూడ వీరంతా చనిపోయినట్లు శాస్త్రవేత్తలు ఓ అంచనాకు వచ్చారు.
860 నాటికి ఈ స్మశాన వాటిక అత్యధిక వినియోగంతో 30 శాతం శరీరాలను అప్పట్లోనే సమాధులనుంచి బయటకు తీసినట్లు బ్లాక్బర్న్ ప్రతినిధి దార్వెన్... బోరో కౌన్సిల్కు తెలిపారు. అస్థిపంజరాలపై పూర్తి విశ్లేషణ ప్రారంభించామని, బయటకు తీసిన పిల్లల మరణాలు ఎక్కువ శాతం ఊపిరితిత్తుల సమస్యలతోనే సంభవించినట్లు తెలుస్తోందని హెడ్ల్యాండ్ ఆర్కియాలజీ కి చెందిన ఎముకల అధ్యయన నిపుణుడు డేవ్ హెండర్సన్ చెప్పారు.
అయితే, వారంతా చిన్నవయసులోనే మరణించడం వల్ల అస్థిపంజరాల ద్వారా ఎక్కువ వివరాలు తెలియడం లేదన్నారు. పారిశ్రామిక మిల్లులకు కేంద్రమైన ఆ పట్టణంలో జనాభా అతి వేగంగా అభివృద్ధి చెందడంతోనే అప్పట్లో ఆ ప్రాంతం ఎంతో రద్దీగా ఉండేదని, దీంతో అక్కడివారికి కాలుష్యం కారణంగా ఇన్ఫెక్షన్ల సమస్య వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు.
1945 వరకూ కూడా ఈ శ్మశాన వాటికలో కొందరు కుటుంబాలకోసం ముందే స్థలాన్ని కొనుగోలు చేసినట్లు వివరాలను బట్టి తెలుస్తోంది. 1500 మంది కూర్చునేందుకు వీలుగా ఉండే ఇక్కడి సెయింట్ పీటర్స్ చర్చ్ 20వ శతాబ్ద కాలంలో శిథిలావస్థకు చేరింది. దీంతో 1976 ప్రాంతంలో దీన్నినేలమట్టం చేశారు.
కాగా, ఈ వేసవి నాటికి స్మారక సేవను తిరిగి ప్రారంభిస్తామని, అప్పటివరకూ శవ ఖననాలు శ్మశానవాటికలోని మరోభాగంలో జరుగుతాయని బ్లాక్బర్న్ బిషప్ చెప్పారు. ప్రస్తుతం ఫ్రెక్లెటన్ స్ట్రీట్ లింక్ రోడ్ నిర్మాణం కోసం కౌన్సిల్ అధికారి ఆధ్వర్యంలో పురావస్తు తవ్వకాల్లో భాగంగా ఈ పరిశోధనలు నిర్వహిస్తున్నారు.