ఐరాస బస్సుపై బాంబు దాడి: 6గురు మృతి, తమ పనేనన్న ఆల్ షబాబ్
మొగదిషు: ఐక్యరాజ్యసమితికి చెందిన బస్సుపై ఉగ్రవాదులు బాంబు దాడి చేయడంతో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటన సోమాలియాలోని గారోవి పట్టణంలో చోటు చేసుకుంది. కాగా, దాడి చేసింది తామేనని ఉగ్రవాద సంస్థ ఆల్ షబాబ్ పేర్కొంది.
బాంబు దాడిలో బస్సు పూర్తిగా ధ్వంసమైంది. ఈశాన్య సోమాలియాలోని పుట్లాండ్ సమీపంలో చోటు చేసుకుందని సిఎన్ఎన్ వెల్లడించింది. ఆల్ షబాబ్ ఉగ్రవాద సంస్థ బాంబు దాడికి బాధ్యత తీసుకున్నట్లు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ఈ బాంబు దాడి తమ పనేనని ఆల్ షబాబ్ అధికార ప్రతినిధి అబ్దియాజిజ్ అబూ ముసబ్ పేర్కొన్నారు. కాగా, సోమాలియాలో ఐక్యరాజ్యసమితి ప్రతినిధి నిక్ కే ఈ బాంబు దాడిని తీవ్రంగా ఖండించారు. ఘటనలో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు.
ఆల్ఖైదా ఉగ్రవాద సంస్థకు అనుబంధ సంస్థ అయిన ఆల్ షబాబ్.. సోమాలియాలో దాడులకు పాల్పడుతూ భయాందోళనలకు గురిచేస్తోంది. కెన్యాలోని గర్రిసా యూనివర్సిటీ కాలేజీలో ఇటీవల జరిపిన దాడుల్లో సుమారు 150 మంది మృతి చెందారు.