Naegleria Fowleri : మెదడు తినేసే అమీబా- కొరియాలో తొలి మరణం- భారత్ లోనూ..
1937లో అమెరికాలో వెలుగుచూసిన మెదడు తినేసే అమీబా మళ్లీ కలకలం రేపింది. దక్షిణ కొరియాలో తాజాగా నమోదైన ఓ మెదడు తినేసే అమీబా కేసులో థాయిలాండ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఈ మెదడు తినేసే అమీబాపై ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి.
నెగ్లేరియా ఫౌలెరీగా పేర్కొనే ఈ మెదడు తినే అమీబా కారణంగా దక్షిణ కొరియాలో తొలి ఇన్ఫెక్షన్ కేసు నమోదైందని అక్కడి ఆరోగ్య అధికారులు ప్రకటించారు. ఈ అమీబా మెదడులోకి వెళ్లి తినేయడంతో ఓ 50 ఏళ్ల వ్యక్తి మరణించినట్లు నిర్దారించారు. ఇలాంటి అరుదైన కేసును దక్షిణ కొరియాలో తొలిసారిగా గుర్తించడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. ఇలాంటి మరిన్ని కేసులు ఎక్కడైనా నమోదయ్యాయా అనే దానిపై దర్యాప్తు చేపట్టారు. దక్షిణ కొరియాలో నేగ్లేరియా ఫౌలెరీ లేదా "మెదడు తినే అమీబా" తొలి ఇన్ఫెక్షన్ నమోదైందని ఆరోగ్య అధికారులు ప్రకటించారు. కొరియా డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఏజెన్సీ (కెడిసిఎ) థాయిలాండ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత మరణించిన కొరియన్ జాతీయుడికి మానవ మెదడులను నాశనం చేసే నేగ్లేరియా ఫౌలెరీ సోకినట్లు ధృవీకరించారు.
1937లో అమెరికాలోని టెక్సాస్ లో ఓ పదేళ్ల బాలిక స్విమ్మింగ్ కు వెళ్లినప్పుడు ఆమెకు ఈ మెదడు తినే అమీబా ఇన్ఫెక్షన్ సోకింది.ఆమె మెదడులోకి ప్రవేశించిన ఈ నెగ్లేరియా ఫౌలెరీ ఆ తర్వాత ఆమె మరణానికి కారణమైంది. దీంతో ఈ వైరస్ పై పలు అధ్యయనాలు చేశారు. వీటిలో ఇది వెచ్చటి నీరు ఉండే సరస్సులు, నదులు, కాలువలు, స్విమ్మింగ్ పూల్స్ లో ఎక్కువగా ఉండే అవకాశముందని గుర్తించారు. ఇది నీటిలో ఉంటూ మనుషులకు ముక్కు ద్వారా మెదడు లోకి ప్రవేశిస్తుందని గుర్తించారు. అయితే ఓ వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సోకే అంటు వ్యాధి మాత్రం కాదని తేలింది. భారత్, యూఎస్, థాయిలాండ్ తో పాటు పలు ప్రపంచ దేశాల్లో 2018 వరకూ 381 ఇలాంటి కేసులు నమోదయ్యాయి.