తెర మీదికి కోవిడ్ 19 వ్యాక్సిన్ పాస్పోర్ట్: తీవ్ర వ్యతిరేకత:
లండన్: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా జోరుగా కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. పాస్పోర్ట్ వ్యవస్థలో కొన్ని మార్పులను తీసుకుని రావడానికి పలు దేశాలు శ్రీకారం చుడుతున్నాయి. కొత్తగా కోవిడ్ 19 వ్యాక్సిన్ పాస్పోర్ట్ను ప్రవేశపెట్టాలని భావిస్తున్నాయి. ఇప్పటిే డెన్మార్క్ ఈ దిశగా ఓ ముందడుగు వేసింది. కోవిడ్ 19 వ్యాక్సిన్ పాస్పోర్ట్ వ్యవస్థను అమలు చేస్తోంది. బ్రిటన్లో దీన్ని ప్రవేశపెట్టాలనే చర్చ సాగుతోంది. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోన్నందున.. వెనకడుగు వేస్తోందక్కడి ప్రభుత్వం.
వ్యాక్సిన్ పాస్పోర్ట్.. తాము కరోనా నిరోధక టీకాను వేసుకున్నామని నిర్ధారించదానికి ఉద్దేశించిన డిజిటల్ రికార్డ్ ఇది. దీన్ని చూపించడం ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించడానికి వీలు ఉంటుంది. ఎయిర్ ట్రావెల్ సమయంలో సాధారణ పాస్పోర్ట్తో పాటు దీన్ని కూడా సిబ్బందికి తనిఖీ కోసం చూపించాల్సి ఉంది. వ్యాక్సిన్ వేసుకున్నామని నిర్ధారిస్తూ.. ఆయా దేశాల నిబంధనలకు అనుగుణంగా ఆర్టీ-పీసీఆర్ టెస్టింగ్ సర్టిఫికేట్ లేదా కరోనా నెగెటివ్ రిపోర్ట్ను కూడా ఇందులోనే పొందుపరిచి ఉంటుంది. దీన్ని అమలు చేయాలని బ్రిటన్ ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై వ్యతిరేకత ఎదురవుతోంది.
దీనివల్ల వివక్షత తలెత్తుతుందనే అభిప్రాయాలు బ్రిటన్లో వ్యక్తమౌతోన్నాయి. కొన్ని కారణాల వల్ల కొందరు వ్యాక్సిన్ వేసుకోకపోవచ్చని, అలాంటి వారి పట్ల చులకనగా చూస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ స్పందించారు. కోవిడ్ వ్యాక్సిన్ పాస్పోర్ట్ ప్రారంభదశలోనే ఉందని చెప్పారు. ఎయిర్ ట్రావెల్ విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పులను చేయబోమని, పాస్పోర్ట్ వ్యవస్థ ఇదివరకట్లా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రారంభదశలో ఉన్న వ్యాక్సిన్ పాస్పోర్ట్ ప్రక్రయిను పూర్తి చేయాలా? వద్దా? అనేది త్వరలో నిర్ణయిస్తామని చెప్పారు.