ఏపీ రాజేష్ తర్వాత: అమెరికాలో మరో భారతీయుడి కాల్చివేత
వాషింగ్టన్: అమెరికాలో మరో భారతీయుడు హత్యకు గురయ్యాడు. ఇరవై నాలుగు గంటల్లోనే మరో కాల్చివేత జరగడం గమనార్హం. అక్కడ పని చేస్తున్న మాదాల రాజేష్ (35), సంజయ్ వినూభాయ్ పటేల్ (39) దోపిడీ దొంగల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. రాజేష్ హతమైన విషయం తెలిసిందే. ఇప్పుడు సంజయ్ కూడా దొంగల కాల్పుల్లో హతమయ్యాడు.
తెలుగువాడైన రాజేష్ స్వస్థలం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని దొండపాడు గ్రామం. సంజయ్ పటేల్ గుజరాత్లోని ఆనంద్ జిల్లా బొర్సాద్ పట్టణవాసి. 24 గంటల వ్యవధిలో రెండు ప్రాంతాల్లో ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి.
ఇల్లినాయిస్లోని చిన్న పట్టణమైన పియోరియాలో ఓ ఆటో గ్యాస్ స్టేషన్లో మాదాల పని చేస్తున్నాడు. గ్యాస్ స్టేషన్లోని వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి అతనిపై కాల్పులు జరిపి, నగదు దోచుకెళ్లాడు. కాల్పుల్లో గాయపడిన రాజేష్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ ఘటనలో దుండగుడి కోసం గాలింపు జరుపుతున్న పోలీసులకు లోపాయింట్ పట్టణం వద్ద తారసపడ్డాడు. పోలీసులకు, దుండగుడికి మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో దుండగుడ్ని హతమార్చారు. స్థానికులకు రాజ్గా చిరపరిచితుడైన రాజేష్ అందరితో కలివిడిగా ఉంటాడు.
మరోవైపు, కనెక్టికట్లోని న్యూహావెన్ ప్రాంతంలోని ఓ గ్రాసరీ స్టేషన్లో సంజయ్ పటేల్ పని చేస్తున్నాడు. ముసుగులు ధరించిన ఇద్దరు దొంగలు దోపిడీ యత్నంలో భాగంగా సంజయ్పై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. కాగా, సంజయ్ భార్య గర్భవతి.
దుండగుల కోసం గాలింపు జరుపుతున్నామని, విచారణ కొనసాగుతుందని న్యూహావెన్ పోలీసులు వెల్లడించారు. రెండు వందల డాలర్ల కోసం హత్య చేశారని, ఇది చాలా దురదృష్టకరమని గ్యాస్ స్టేషన్ యజమాని రాజ్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు.
ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు గ్రాసరీ స్టేషన్నుంచి బయటకు రావడం చూశామని స్థానికులు పోలీసులకు చెప్పారు. కాగా, సంజయ్ పటేల్ మృతదేహాన్ని భారత్కు రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.
సంజయ్ పటేల్ సోదరి కల్పన పటేల్ మాట్లాడుతూ.. తన సోదరుడు గ్రాసరీ స్టాల్లో పని చేస్తుంటాడని, అతను రాత్రి పూట పని చేస్తున్న సమయంలో ఇద్దరు దుండగులు వచ్చి కాల్చివేసినట్లుగా సమాచారం వచ్చిందని కన్నీరుమున్నీరు అయ్యారు.