'పిల్లలకా? పెంపుడు జంతువులకా? భోజనం ఎవరికి పెట్టాలి?’ - పెరిగిన ధరల ఎఫెక్ట్తో పెంపుడు జంతువుల్ని వదిలేస్తున్న ఆస్ట్రేలియన్లు
'పిల్లలకా? పెంపుడు జంతువులకా? భోజనం ఎవరికి పెట్టాలనేది తేల్చుకోవడం చాలా కష్టమైన పని. కానీ, చాలామందికి ఇప్పుడు ఇలాంటి బాధాకర పరిస్థితే వచ్చింది'
సుజానె తలెవ్స్కీకి ఇలాంటిది బాగా తెలుసు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఆమె నిర్వహిస్తున్న 'లాస్ట్ డాగ్స్ హోమ్' అనే యానిమల్ షెల్టర్ వందల సంఖ్యలో పెంపుడు జంతువులకు ఆశ్రయం ఇస్తోంది. ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
ఈ షెల్టర్ హోమ్కు తాజాగా వచ్చిన అతిథి 63 కేజీల నియోపోలిటన్ మాస్టిఫ్ జాతి శునకం. చార్కోల్ అని పిలిచే ఈ నాలుగేళ్ల కుక్కను పెంచడం ఇక తమ వల్ల కాదంటూ యజమానులు ఈ షెల్టర్ హోమ్కు అప్పగించారు.
ఇలాంటి కష్టాలు ఈ చార్కోల్ యజమానులు ఒక్కరివే కావు. చాలామందిది ఇదే పరిస్థితి.
ఈ కుక్క ఆహారం ఖర్చు ఏడాదికి రూ.84 వేలు..
కోవిడ్ మహమ్మారి, యుక్రెయిన్ యుద్ధ ప్రభావాలతో ఆహారం, ఇంధనం, నిత్యావసరాల ధరలు పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా జీవనవ్యయం పెరిగింది.
మనం తినే ఆహారమే కాదు.. పెంపుడు జంతువులకు పెట్టే ఆహారం, ఇతర ఉత్పత్తుల ధరలూ బాగా పెరిగాయి.
చార్కోల్ తిండి కోసం వారికి ఏడాదికి 1,600 ఆస్ట్రేలియా డాలర్లు (సుమారు రూ. 84 వేలు) ఖర్చవుతుందని తలెవ్స్కీ అంచనా వేశారు.
'మా షెల్టర్ హోమ్లో 500 జంతువులు ఉన్నాయి. వాటికి తిండి పెట్టడం, కావాల్సిన సామగ్రి కొనడం, వాటి ఆరోగ్యం ఎప్పటికప్పుడు చూసుకోవడంలో ఆనందం పొందుతున్నాం'' అన్నారామె.
పెంపుడు జంతువులకు సంబంధించిన ఉత్పత్తుల ధరలు ఈ ఏడాది ఆస్ట్రేలియాలో 12 శాతం పెరిగినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
కోవిడ్ ప్రారంభమైనప్పుడు 'కాన్బెర్రా పెట్ రెస్క్యూ' సంస్థ పెంపుడు జంతువులకు ఆహారం, ఇతర వస్తువులు అందించడానికి ఇబ్బందిపడుతున్న యజమానులకు సహాయం చేయడం మొదలుపెట్టింది.
రెండేళ్లుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. 'కాన్బెర్రా పెట్ రెస్క్యూ' వ్యవస్థాపకులు అమందా డోయెల్ 'బీబీసీ'తో మాట్లాడుతూ ఇప్పటికీ సహాయం కోరుతున్నవారు ఉన్నారని చెప్పారు.
పెంపుడు జంతువులను వదులుకోవాలనుకుంటున్నవారి నుంచి కూడా తమకు ఇంకా అభ్యర్థనలు వస్తున్నాయని చెప్పారామె.
- ఆవు తేన్పుల మీద పన్ను... ఎక్కడ, ఎందుకు?
- యుక్రెయిన్: పెంపుడు పులి, జాగ్వర్ను వదిలి బ్రతుకు తెరువు కోసం పోలండ్ వెళ్లిన తెలుగు వైద్యుడు
అమందా షెల్టర్ హోమ్కు ఇటీవల వచ్చిన పెంపుడు జంతువు 11 ఏళ్ల పిల్లి లిలు. దాని యజమాని తన ఉద్యోగం, ఇంటిని కోల్పోవడంతో ఈ పిల్లిని పెంచుకోలేక అమందాకు అప్పగించారు.
లిలును వదులుకోవడానికి యజమానికి ఎంతమాత్రం ఇష్టపడలేదు. కానీ, పోషించే స్తోమత కోల్పోవడంతో తప్పనిపరిస్థితుల్లో కన్నీళ్లతో దాన్ని అమందాకు అప్పగించారామె.
మరోవైపు ప్రజలు పెంపుడు జంతువులను తమకు అప్పగిస్తుండడంతో వాటిని పోషించేందుకు నిధులు కావాలని అమందా ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాదు... తమకు అప్పగించడానికి తెచ్చిన కొన్ని జంతువులనూ ఆమె తీసుకోలేదు.
''పెద్ద సంఖ్యలో పెంపుడు జంతువులను తీసుకొస్తున్నారు. వాటన్నిటినీ తీసుకోవడమూ మాకూ సాధ్యం కాదు' అంటున్నారామె.
షెల్టర్ హోమ్స్లో ఆశ్రయం కూడా తగ్గింది..
''జీవన వ్యయం పెరగడం పెద్ద సమస్యే అయినా కోవిడ్ సమయంలో కొందరు దత్తత తీసుకున్న జంతువుల విషయంలో ఇప్పుడు రెండో ఆలోచనకు రావడం కూడా వాటిని వదిలించుకోవడానికి ఒక కారణం'' అని అమందా అభిప్రాయపడ్డారు.
పెంపుడు జంతువులను బయట వదిలేయడమనేది ఆస్ట్రేలియాలో నేరం. కానీ, ఆర్థిక పరిస్థితులు వారిని పెంపుడు జంతువులను వదిలించుకునేలా చేస్తున్నాయి అని 'ఫోర్ పాస్ ఆస్ట్రేలియా' సంస్థకు చెందిన రెబెకా లినిజెన్ అన్నారు.
'పెంపుడు జంతువులను వదిలించుకోవడం పెరగడమే కాదు ఆస్ట్రేలియా వ్యాప్తంగా చూస్తే 2021 నుంచి పెంపుడు జంతువులకు కొన్ని షెల్టర్ హోమ్స్లో ఆశ్రయం ఇవ్వడమూ తగ్గింది' అంటున్నారామె.
మనతో పాటు నివసించే జంతువుల సంక్షేమానికి ఇది తీవ్ర విఘాతమని ఆమె 'బీబీసీ'తో అన్నారు.
పెంపుడు జంతువులకు పెట్టే ఆహారంలో మాంసం, ధాన్యాలు, సూక్ష్మపోషకాలు ఉంటాయి. ఇటీవల కాలంలో వీటన్నిటి ధరలు పెరిగాయి.
- యజమాని ఒత్తిడిలో ఉన్నట్లు పెంపుడు కుక్కలు పసిగట్టేస్తాయట
- మనం ఎందుకు చనిపోతాం? పిల్లల్ని కనే శక్తే వృద్ధాప్యానికీ, మరణానికీ దారితీస్తుందా?
అమెరికా, యూరప్, బ్రిటన్ దేశాల్లో..
ఒక్క ఆస్ట్రేలియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉంది.
పెంపుడు జంతువుల ఆహారం ధరలు అమెరికాలో ఇటీవల కాలంలో 10.3 శాతం పెరిగింది. యూరోపియన్ యూనియన్ దేశాలలో 8.8 శాతం, బ్రిటన్లో 8.4 శాతం పెరిగింది.
ఇతర దేశాల్లోని యామిల్ రెస్క్యూ గ్రూపులు కూడా తమ షెల్టర్ హోమ్స్కు తెస్తున్న జంతువుల సంఖ్య పెరుగుతోందని చెబుతున్నాయి.
ప్రజల ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా మారుతుండడంతో ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని వారు చెబుతున్నారు.
'పెంపుడు జంతువులకు ఆహారం పెట్టడానికి, మందులు ఇవ్వడానికి తాము తినడం మానేస్తున్నామని చాలామంది మా టీమ్లకు చెబుతున్నారు' అని బ్లూక్రాస్కు చెందిన అలిసన్ జోన్స్ చెప్పారు.
బ్రిటన్లో ఈ సంస్థ ఆధ్వర్యంలో పెంపుడు జంతువులకు ఆహార బ్యాంకులు, జంతువులకు ఆసుపత్రులు నడుపుతున్నారు.
థాయిలాండ్, సింగపూర్ దేశాల్లో..
థాయ్లాండ్ సంస్థ రెస్క్యూ పావ్స్కు చెందిన జాకబ్ థామస్ మాట్లాడుతూ.. ఉద్యోగాలు పోగొట్టుకోవడం వల్ల థాయిలాండ్ను వీడుతున్నవారు తమ పెంపుడు జంతువుల సంరక్షణ బాధ్యత తీసుకోవాలంటూ తమను అభ్యర్థిస్తున్నారని చెప్పారు.
కోవిడ్ కాలం నుంచి ఇలాంటి అభ్యర్థనలు పెరిగాయన్నారు జాకబ్.
ఇంధన ధరల పెరుగుదల వల్ల ఆహార పదార్థాల ధరలు పెరుగుతున్నాయని సింగపూర్లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ విలియం చెన్ చెప్పారు.
మనం తినే ఆహారంతో పోల్చితే పెంపుడు జంతువుల ఆహారం ధరలు మళ్లీ తగ్గే అవకాశం ఉండకపోవచ్చన్న భావన వల్లా చాలామంది తమ పెంపుడు జంతువులను వదిలించుకోవాలనుకుంటున్నారని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- 50 ఏళ్లుగా స్నానం చేయని మనిషి - స్నానం చేయించిన కొన్నాళ్లకే జబ్బు పడి మృతి
- రిషి సునక్: బ్రిటన్ కొత్త ప్రధాన మంత్రితో భారత్కు మేలు జరుగుతుందా.. ఇరు దేశాల సంబంధాలు బలపడతాయా?
- రిషి సునక్: భారత్ను ఏలిన బ్రిటన్కు ప్రధాని అయిన రిషి గురించి ప్రజలు ప్రైవేటుగా ఏమనుకుంటున్నారు?
- బ్లాక్ డెత్: 700 ఏళ్ల కిందటి ప్లేగు మహమ్మారి మన ఆరోగ్యంపై ఇంకా ప్రభావం చూపుతోందా?
- వీర్యం శరీరంపై పడితే అలర్జీ వస్తుందా, ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)