54 ఏళ్ల తర్వాత వీడిన అదృశ్య విమానం మిస్టరీ
శాంటియాగో: అర్ధ శతాబ్దం కిందట కూలిన ఓ విమానం ఆచూకీ లభ్యమైంది. 54ఏళ్ల క్రితం అదృశ్యమైన ఓ విమానం శిథిలాలను కొందరు పర్వతారోహకులు ఆండీస్ పర్వాతాలలో గుర్తించారు. అప్పుడు ఆ విమానంలో ఉన్న 24 మంది ప్రయాణికులు మృతి చెందారని తెలిపారు. వీరిలో 8మంది ఫుట్బాల్ క్రీడాకారులు కూడా ఉన్నారని చెప్పారు.
శాంటియాగోకి 360 కిలోమీటర్ల దూరంలోని 3200 మీటర్ల ఎత్తులో పర్వతాలపైన విమానం శిథిలాలను కనుగొన్నట్లు పర్వతారోహకులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఏప్రిల్ 3, 1961న చిలీ ఫుట్బాల్ జట్టు సభ్యులు ప్రయాణిస్తున్న విమానం అదృశ్యమైంది.
ఈ ఘటన దక్షిణ అమెరికాలోనే కాకుండా క్రీడా ప్రపంచానికి ఒక జవాబులేని ప్రశ్నలా మిగిలిపోయింది. ఫుట్బాల్ జట్టు విదేశాల్లో ఫుట్బాల్ ఆడి శాంటియాగో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గ్రీన్ క్రాస్ జట్టు సభ్యులు రెండు బృందాలుగా రెండు విమానాల్లో బయలుదేరారు.
ఒక గ్రూప్లోని వారు సురక్షితంగా చేరగా, మరో గ్రూప్ సభ్యులు ప్రయాణిస్తున్న విమానం అదృశ్యమైంది. అప్పట్లో వీరి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ లాభం లేకపోయింది. దీంతో అదృశ్యమైన విమానం మిస్టరీగానే మిగిలిపోయింది. కాగా, ఐదు దశాబ్దాల తర్వాత అదృశ్యమైన ఆ విమానం మిస్టరీ పర్వతారోహకుల కంటపడటంతో వీడిపోయింది.