అరుణాచల్ సరిహద్దుకు సమీపంలో చైనా రోడ్డు నిర్మాణం... భారత్ను మళ్లీ కలవరపెడుతున్న డ్రాగన్...
అరుణాచల్ ప్రదేశ్కు సమీపంలో టిబెట్ భూభాగంలోని బ్రహ్మపుత్ర లోయ మీదుగా చైనా వ్యూహాత్మక రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసింది. 310 మిలియన్ డాలర్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. ఈ రహదారితో చైనీస్ బోర్డర్ కౌంటీకి, సమీప నగరమైన నియింగ్చికి మధ్య ప్రయాణ దూరం 8 గంటల మేర తగ్గనుంది. యర్లుంగ్ జంగ్బో(చైనా బ్రహ్మపుత్ర పేరు) లోయ,గ్రాండ్ లోయల మీదుగా అరుణాచల్ ప్రదేశ్కు సమీపంలోని బైబంగ్ కౌంటీ(టిబెట్లో ద్రెపంగ్ పేరు) వరకు ఈ రహదారిని నిర్మించారు. అరుణాచల్ ప్రదేశ్లోని ఎగువ సియాంగ్ జిల్లాలోని బిషింగ్ గ్రామానికి ఈ రహదారికి సమీప దూరంలోనే ఉంది.
Recommended Video
భారత్పై చైనా వాటర్ బాంబ్... అదే జరిగితే తీరని నష్టం.. డ్రాగన్తో మరో డేంజర్...
అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమేనని చెప్పుకునే చైనా.. అక్కడి సరిహద్దులకు అత్యంత సమీపంలో రహదారి నిర్మాణాన్ని చేపట్టడం భారత్ను కలవరపెట్టే అంశం. నిజానికి వాస్తవాధీన రేఖ వెంబడి చైనా చాలా కాలంగా నిర్మాణాలు చేపడుతూనే ఉంది. గతంలో దీనికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలు కూడా వెలుగుచూశాయి. అప్పట్లో అరుణాచల్ ప్రదేశ్ భూభాగంలోకి 4.5కి.మీ మేర చొచ్చుకొచ్చి ఏకంగా ఒక గ్రామాన్ని నిర్మించినట్లు సంచలన కథనాలు వచ్చాయి. అయితే ఆ తర్వాత భారత ప్రభుత్వం అందులో నిజం లేదని వెల్లడించింది.
యర్లుంగ్ జంగ్బో నదిపై ప్రపంచంలోనే అతి పెద్దదైన మెగా హైడ్రో పవర్ ప్రాజెక్టును నిర్మించాలని చైనా భావిస్తోంది. తాజాగా చైనా నిర్మించిన రహదారి ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది. భారత్ గుండా ప్రవహించే ఈ నది ఇక్కడి అరుణాచల్ ప్రదేశ్,అసోంల మీదుగా బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది. అయితే ఎగువన చైనా నిర్మించే ప్రాజెక్టు ద్వారా భవిష్యత్తులో ఆ నది నుంచి భారత్కు రావాల్సిన నీళ్లను అడ్డుకునే ప్రయత్నాలు జరగవచ్చు. అదే జరిగితే బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతాల్లో కరువుతో అల్లాడుతాయి. లేదా భారీ వరదల సమయంలో నీటిని ఒక్కసారిగా కిందకి వదిలితే ఆ ప్రాంతాలు ముంపుకు గురయ్యే ప్రమాదం తలెత్తుతుంది.
ఈ నేపథ్యంలో బ్రహ్మపుత్ర నది ప్రవహించే భారత్,బంగ్లాదేశ్,భూటాన్ ఈ ప్రాజెక్టుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సరిహద్దు దేశాలతో చర్చించకుండా ఈ ప్రాజెక్టును నిర్మించడాన్ని ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు చైనా మాత్రం పొరుగు దేశాల ఆందోళనను,అభిప్రాయాలను లెక్కలోకి తీసుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నది. భవిష్యత్తులో ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయోనన్న ఆందోళన నెలకొంది.