చైనా సంచలనం: 'ఒక జంట-ఒక బిడ్డ' పాలసీ రద్దు
న్యూఢిల్లీ: కుటుంబ నియంత్రణ విధానంపై విధించిన ఆంక్షలను చైనా ఎత్తివేసింది. దశాబ్దాలుగా అమలు చేస్తున్న ఒక జంటకు ఒకే బిడ్డ విధానాన్ని పూర్తిగా రద్దుచేసింది. ఇకపై దంపతులందరూ ఇద్దరు పిల్లలను కనేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా గురువారం తెలిపింది.
పంచవర్ష ప్రణాళికను చర్చించేందుకు నాలుగురోజులపాటు సమావేశమైన అధికార కమ్యూనిస్టుపార్టీ ఈ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నదని జిన్హువా ట్విట్టర్లో పేర్కొంది. 35 ఏళ్లకు పైగా అమలులో ఉన్న ఒకే బిడ్డ విధానాన్ని చైనా ఎత్తేయడం ఇదే తొలిసారి. వివాదాస్పదమైన ఈ విధానం వల్ల చైనాలో బలవంతపు గర్భస్రావాలు సర్వసాధారణమయ్యాయి.
గతేడాది విడుదల చేసిన అధికారిక నివేదిక ప్రకారం చైనాలో 60 ఏళ్లకు పైబడిన వృద్ధుల సంఖ్య 18.5 కోట్లు. జనాభాలో 13.7 శాతం వరకు వృద్ధులే. ఈ ఏడాది వీరిసంఖ్య 22 కోట్లు దాటింది. ఇందులో 5 కోట్లమంది వృద్ధులు పిల్లలకు దూరంగా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. ఇదేతీరు కొనసాగితే వృద్ధుల జనాభా 2050 నాటికి 44 కోట్లకు చేరుకుంటుంది.
దీంతో వారి ఆలనాపాలనా చూసేవారెవరనేది పెద్ద సమస్యగా మారడంతో ఈ ఒకే బిడ్డ విధానాన్ని పూర్తిగా రద్దుచేసింది. అయితే వృద్ధుల జనాభా పెరుగుతుండటం, శ్రమచేయగలిగే వయోజనుల సంఖ్య తగ్గిపోవడం ఈ విధానపరమైన మార్పులకు కారణమని భావిస్తున్నారు. దీంతో పాటు మహిళా జనాభా గణనీయంగా పడిపోవడం కూడా మరో ముఖ్యకారణం.
1970 దశకంలో ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన చైనా 130 కోట్ల జనాభాతో అగ్రస్థానంలో నిలిచింది. మూడు దశాబ్దాలుగా కఠినంగా అమలు చేస్తున్న ఒకేబిడ్డ విధానం కారణంగా చైనాలో యువజనుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఇది జాతీయ స్థూల ఉత్పత్తిపై ప్రభావం చూపే స్థాయికి వెళ్లింది.
14 ఏళ్లలోపు పిల్లల జనాభా ప్రపంచ సగటు 27 శాతం ఉండగా చైనాలో అది 16.5 శాతానికి పడిపోయింది. 16 నుంచి 59 సంవత్సరాల వయోవర్గానికి చెందిన పనిచేసేవారి సంఖ్య 2014లో 37 లక్షలు తగ్గిపోయింది. చైనా జనాభాలో అధికసంఖ్యలో ఉన్న హాన్ జాతీయులకే కుటుంబ నియంత్రణ నిబంధనలు వర్తించనున్నాయి.
చైనాలో 95 శాతం పైగా వీరే ఉంటారు. వీరి జనాభా పెరుగుదల హద్దులు దాటిపోయినందునే 70లలో కఠినమైన నిబంధనలు ప్రవేశపెట్టారు. మిగిలిన మైనారిటీ జాతుల వారికి మాత్రం జనాభా నియంత్రణ నిబంధనలు వర్తించవని ఒక ప్రకటనలో చైనా ప్రభుత్వం పేర్కొంది.