చావును దగ్గరగా చూసిన కరోనా పుట్టినింట్లో ఇక స్వేచ్ఛా వాయువులు..లాక్డౌన్ ఎత్తివేత:
బీజింగ్: ప్రపంచాన్ని మొత్తాన్నీ మృత్యుముఖంలోకి నెట్టేసేంతటి భయానకమైన కరనా వైరస్కు జన్మనిచ్చిన వుహాన్ సిటీలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. కొత్తగా అక్కడ కరోనా వల్ల ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. పాజిటివ్ కేసుల సంఖ్య కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గిపోయాయి. దీనితో చైనా ప్రభుత్వం అక్కడ లాక్డౌన్ను ఎత్తి వేసింది. 76 రోజుల తరువాత వుహాన్ సిటీ జనం స్వేచ్ఛా వాయువులను పీల్చుతున్నారు.
లాక్డౌన్ పొడిగింపు: రాష్ట్రాల ప్రతిపాదనలను ఆమోదించే దిశగా కేంద్రం యోచన.. లీకులు
జీరో పేషెంట్ అక్కడే..
హ్యూబే ప్రావిన్స్ పరిధిలోకి వచ్చే ఈ నగరంలోనే గత ఏడాది డిసెంబర్లో తొలిసారిగా కరోనా వైరస్ వెలుగు చూసింది. హ్యూనన్ ఫిష్ మార్కెట్లో రొయ్యలు విక్రయించే ఓ మహిళా వ్యాపారిలో తొలిసారిగా వైరస్ లక్షణాలు కనిపించాయి. ఆమె ద్వారా ఈ వైరస్ పలువురికి సోకినట్లుగా వుహాన్ అధికారులు ఇదివరకే వెల్లడించారు. ఆ మహిళా వ్యాపారిని జీరో పేషెంట్గా గుర్తించారు. చైనా మొత్తం మీద 3300లకు పైగా కరోనా వైరస్ మరణాలు నమోదు కాగా.. వాటిల్లో సగానికి పైగా వుహాన్, హ్యూబే ప్రావిన్స్లో చోటు చేసుకున్నవే.
ఒకరు చెప్పాల్సిన పని లేకుండా..
సుమారు 11 మిలియన్ల జనాభా ఉన్న వుహాన్లో లాక్డౌన్ ఎత్తేయగానే పెద్ద సంఖ్యలో జనం రోడ్ల మీదికి వచ్చారు. వాహనాల్లో తిరుగాడారు. చావును అతి సమీపం నుంచి చూసిన అనుభవం ఉన్నందున వుహాన్ ప్రజలు స్వచ్ఛందంగా సామాజిక దూరాన్ని పాటించారు. సూపర్ మార్కెట్లు వంటి జనసమ్మర్థం ఉన్న చోట సోషల్ డిస్టెన్సింగ్ను పాటిస్తూ, తమ నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయడం కనిపించింది. ఒకరు చెప్పాల్సిన పని లేకుండా కరోనా వైరస్ సోకకుండా అన్ని జాగ్రత్తలను తీసుకున్నారు.
తొలి రోజే 55 వేల మంది..
వుహాన్లో రవాణా వ్యవస్థ కూడా అందుబాటులోకి వచ్చింది. రైళ్లు, విమాన సర్వీసులు ఆరంభం అయ్యాయి. వందలాది సంఖ్యలో వ్యక్తిగత వాహనాలు రోడ్డెక్కాయి. హ్యూబే ప్రావిన్స్లోని ఇతర నగరాలకు వెళ్లడానికి అవకాశం లభించింది. వాహనాల రాకపోకలు ఆరంభం అయ్యాయి. రైళ్లల్లో సామాజిక దూరాన్ని పాటించడానికి అవసరమైన జాగ్రత్తను అక్కడి అధికారులు తీసుకున్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి కొన్ని రోజుల పాటు దీన్ని పాటించడం తప్పనిసరి అంటూ వెల్లడించారు. తొలిరోజే 55 వేల మంది రైళ్లల్లో ప్రయాణించినట్లు అధికారులు అంచాన వేశారు.
Recommended Video
వైరస్ మళ్లీ వ్యాపించే ప్రమాదం ఉందంటూ..
లాక్డౌన్ను ఎత్తేసిన సమయంలో ప్రజలు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నప్పటికీ.. మళ్లీ కరోనా వైరస్ విజృంభించే అవకాశం ఉందంటూ వుహాన్ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం రెండో దశను దాటుకుని వచ్చామని, ఈ దశలో ఎలాంటి పొరపాటు చేసినా కథ మళ్లీ మొదటికి వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ పూర్తిగా మాయం కాలేదని, అజాగ్రత్తగా ఉంటే ఏ క్షణమైనా మళ్లీ వ్యాపించడానికి అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు.