మరో ఈస్టిండియా: చైనాతో ఇరుకునపడ్డ షరీఫ్, సొంతవాళ్ల ఆగ్రహం
కరాచీ: పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇరుకున పడ్డారు. చైనాతో దోస్తీ, పెట్టుబడుల కారణంగా ఆయనను పలువురు పాక్ చట్ట సభ్యులు నిలదీస్తున్నారు. 46 బిలియన్ డాలర్లతో చైనా చేపట్టిన చైనా - పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) వల్ల పాకిస్తాన్కి ముప్పు పొంచి ఉందని పాకిస్తాన్ చట్ట సభ్యులు ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు.
దేశ ప్రయోజనాలను కాపాడకపోతే ఈ కారిడార్ మరో ఈస్టిండియా కంపెనీగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం స్థానిక ప్రజలను కూడా విస్మరిస్తోందని ధ్వజమెత్తుతున్నారు.

దేశ ప్రయోజనాలను రక్షించకపోతే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ మరో ఈస్ట్ ఇండియా కంపెనీ అవుతుందని, రెండు దేశాల మధ్య స్నేహ సంబంధం పైన తమకు గౌరవం ఉందని, అయితే అంతకంటే కూడా దేశ ప్రయోజనాలు ముఖ్యమని ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ సెనేట్ కమిటీ చైర్మన్ సెనేటర్ తాహిర్ మషాది అన్నారు.
ఈ ప్రాజెక్టు కారణంగా ప్రభుత్వం ప్రజల హక్కులు, ప్రయోజనాలను పట్టించుకోవడం లేదన్నారు. వ్యాపారం పేరుతో భారత దేశంలో అడుగు పెట్టిన ఈస్టిండియా కంపెనీ క్రమంగా ఆధిపత్యం చెలాయించి దేశాన్ని వశం చేసుకోవడానికి కారణమైందని, చైనా కారిడార్ వల్ల కూడా ఇలాంటి ప్రమాదమే ఉందని సెక్రటరీ యూసుఫ్ నదీమ్ ఖోకార్ అన్నారు. కాగా, ఈ కారిడార్పై ఆశలు పెట్టుకున్న నవాజ్ షరీఫ్కు చట్ట సభ్యుల నుంచి వ్యతిరేకత వస్తుంది. దీంతో అతను ఇరుకున పడ్డారు.












Click it and Unblock the Notifications