చైనాలో కుప్పకూలిన రెస్టారెంట్ - 29 మంది మృతి - రీఓపెనింగ్ తర్వాత భారీ ప్రమాదం!
ఉత్తర చైనాలోని షాంగ్జీ రాష్ట్రంలో రెస్టారెంట్ కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 29కి పెరిగింది. గాయపడ్డ మరో 28 మందిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. షాంగ్జీ రాష్ట్రంలోని జియాంగ్ ఫెన్ కౌంటీలోని రెండంతస్తుల రెస్టారెంట్ భవనం శనివారం ఉదయం కుప్పకూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడో బర్త్ డే పార్టీ జరుగుతుండటంతో పదుల సంఖ్యలో జనం శిథిలాల్లో చిక్కుపోయారు.
భవంతి కూలిందన్న సమాచారం తెలిసిన వెంటనే, 700 మంది సిబ్బందిని రంగంలోకి దింపామని, ఆదివారం ఉదయం నాటికి రెస్క్యూ చర్యలు పూర్తయ్యాయని, శిథిలాల కింద చిక్కుకున్న అందరినీ వెలికి తీశామని, ప్రమాదంలో మొత్తం 29 మంది చనిపోగా, గాయపడ్డ 28 మందిని స్థానిక ఆస్పత్రుల్లో చేర్పించామని అధికారులు చెప్పినట్లుగా 'చైనా గ్లోబల్ టెలివిజన్ నెట్ వర్క్(సీజీటీఎన్)' తెలిపింది. ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై స్థానిక అధికారులు దర్యాప్తు ప్రారంభించారని పేర్కొంది.
మిగతా దేశాలన్నీ ఇప్పటికీ కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతుండగా, వైరస్ పుట్టినిల్లు చైనాలో మాత్రం భిన్నవాతావరణం నెలకొంది. చాలా రోజుల కిందట అక్కడి మెజార్టీ ప్రాంతాల్లో లాక్ డౌన్ ఎత్తేశారు. వూహాన్ సహా అన్ని నగరాల్లో రెస్టారెంట్లు, హోటళ్లు, పబ్లిక్ ప్లేసులు మళ్లీ కిటకిటలాడుతున్నాయి. శనివారం నాటి షాంగ్జీ ఘటనలోనూ రెస్టారెంట్ కిక్కిరిసిపోయి ఉండటం వల్లే మృతుల సంఖ్య భారీగా నమోదైంది. రీ ఓపెనింగ్ తర్వాత సంభవించిన అతి పెద్ద ప్రమాదం ఇదేనని స్థానిక మీడియా పేర్కొంది. అదీగాక..
Recommended Video
అభివృద్ధి పనులు జెట్ స్పీడులో సాగాలన్న అక్కడి ప్రభుత్వ విధానాలు కూడా ప్రమాదాలకు కారణంగా మారుతున్నాయి. చైనాలో భవంతులు కూలుతోన్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. మార్చిలో కరోనా బాధితులను ఉంచిన ఓ భవనం కుప్పకూలిన ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్యూజిన్ ఫ్రావిన్స్ లోని క్వాన్జౌ సిటీలో 80 గదులున్న ఓ రెండంతస్తుల హోటల్ ను కొవిడ్ సెంటర్ గా మార్చి ట్రీట్మెంట్ అందిస్తోన్న క్రమంలో భవంతి కుప్పకూలింది. నాటి ఘటనలో మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు.