చైనాకు ఊహించిన ఎదురుదెబ్బ: కూలనున్న స్పేస్ స్టేషన్
బీజింగ్: ఐదు సంవత్సరాల కిందట చైనా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తొలి స్పేస్ స్టేషన్ తియాంగాంగ్-1 వచ్చే ఏడాది నేల కూలనుంది. ఈ విషయాన్ని చైనా అధికారికంగా స్పష్టం చేసింది. చైనాకు చెందిన స్పేస్ ప్రోగ్రామ్ సీనియర్ అధికారి ఈ విషయాన్ని వెల్లడించారు.
8.5 టన్నులు బరువున్న ఈ మాడ్యూల్పై చైనా నియంత్రణం కోల్పోయిందని 2017లో అది నేలకూలనుందని పేర్కొన్నారు. అయితే ఈ మాడ్యూల్ నేల కూలే సమయంలో అందులోని చాలా భాగాలు మధ్యలోనే బూడిదైపోతాయని చైనా అంతరిక్ష అధికారులు వెల్లడించారు.
2011, సెప్టెంబర్ 29న చైనా తియాంగాంగ్-1ను అంతరిక్షంలోకి పంపించారు. చైనా ఈ తొలి స్పేస్ స్టేషన్ను లాంచ్ చేయడంతో అంతరిక్ష రంగంలో సూపర్ పవర్గా నిలిచిందని యావత్ ప్రపంచం భావించింది. కానీ ఐదేళ్లలోనే వారు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
అయితే తమ స్పేస్ స్టేషన్ తన పనిని పూర్తి చేసిందని, 2017 రెండో అర్ధభాగంలో భూవాతావరణంలోకి తిరిగి ప్రవేశించబోతోందని చైనా శాస్త్రవేత్తలు గత వారంలో వెల్లడించడం గమనార్హం. కాగా, సాంకేతిక లోపం కారణంగా స్పేస్ స్టేషన్పై చైనా తన నియంత్రణ కోల్పోయిందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
సహజంగానే మాడ్యూల్ భూవాతావరణంలోకి అడుగుపెడుతుందని చెప్పడాన్ని బట్టి చైనా దానిపై నియంత్రణ కోల్పోయిందన్నది స్పష్టమైందని హార్వర్డ్ శాస్త్రవేత్త జోనాథన్ మెక్డోవెల్ అన్నారు. ఇదే నిజమైతే స్పేస్ స్టేషన్ తాలూకు శకలాలు భూమిపై ఎప్పుడు, ఎక్కడ పడతాయో ఊహించడం సాధ్యం కాదని ఆయన తెలిపారు.
అది భూవాతావరణంలోకి ప్రవేశించబోయే ఆరు, ఏడు గంటల ముందు మాత్రమే పసిగట్టగలమని, దీంతో అది ఎక్కడ పడుతుందో చెప్పడం కూడా కష్టమవుతుందని మెక్డోవెల్ అన్నారు. వాతావరణంలో స్వల్ప మార్పులు జరిగినా వాటి శకలాలు పడే అవకాశం ఒక ఖండం నుంచి మరో ఖండానికి మారుతుందని ఆయన తెలిపారు.