స్వేచ్ఛా వాణిజ్యంతోనే ప్రగతి: బీఆర్ఎఫ్ సదస్సులో జీ జిన్ పింగ్.. భారత్ డుమ్మా
ప్రపంచ శాంతికి, ప్రగతి సాధించేందుకు పాక్ - చైనా మధ్య నిర్మిస్తున్న ఎకనమిక్ కారిడార్ వేదిక కానున్నదని చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ చెప్పారు. స్వేచ్ఛా వాణిజ్యంతోనే ఆర్థిక ప్రగతికి మూలమని తెలిపారు. ఆదివ
బీజింగ్: ప్రపంచ శాంతికి, ప్రగతి సాధించేందుకు పాక్ - చైనా మధ్య నిర్మిస్తున్న ఎకనమిక్ కారిడార్ వేదిక కానున్నదని చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ చెప్పారు. స్వేచ్ఛా వాణిజ్యంతోనే ఆర్థిక ప్రగతికి మూలమని తెలిపారు. ఆదివారం నుంచి రెండు రోజుల పాటు జరిగే బీఆర్ఎఫ్ సదస్సును ఆయన ప్రారంభిస్తూ నూతన సిల్క్ రోడ్డు నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సంయుక్తంగా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి అవసరమైన సహయ సహకారాలు అందిస్తామన్నారు. చైనా ఆతిథ్యం ఇస్తున్న ఈ సదస్సుకు 29 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఇప్పటిదాక ఈ ప్రాజెక్టు పట్ల అంటీముట్టనట్లు వ్యవహరించిన అమెరికా సదస్సుకు హాజరయ్యేందుకు సిద్ధమైంది. వైట్ హౌస్ సలహాదారు మ్యాట్ పాటింగర్ సారథ్యంలోని ఒక ప్రతినిధి బ్రుందం చైనా రాజధాని బీజింగ్కు చేరుకున్నది.
ఈ సదస్సులో పాల్గొనేందుకు అమెరికాకు ఒప్పించడం చైనా సాధించిన అతిపెద్ద దౌత్య విజయం అని విశ్లేషకులు చెప్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, కాంబోడియా ప్రధాని హున్ సెన్, కజకిస్థాన్ అధ్యక్షుడు నూర్ సుల్తాన్ నజర్ బయేవ్, శ్రీలంక ప్రధాని విక్రమ సింఘేలతోపాటు బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, వియత్నాం, ఇండోనేషియా, నేపాల్ దేశాల ప్రతినిధులు పాల్గొంటుండటంతో భారతదేశంపైనా ఒత్తిడి పెరుగుతున్నది.
సిల్క్ రోడ్డు పునరుద్ధరణపై చైనా వ్యూహం
కానీ భారత్, పాకిస్థాన్ మధ్య గల పాత సిల్క్ రోడ్డు పునరుద్ధరణకు చైనా అనుసరిస్తున్న విధానం సరిగ్గా లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బెల్ట్ అండ్ రోడ్ ఫోరం (బీఆర్ఎఫ్) సదస్సుకు భారతదేశం హాజరు కావడం లేదు. ఈ ప్రాజెక్టులో భాగంగా పాకిస్థాన్తో ఒప్పందం కుదుర్చుకొని చైనా నిర్మిస్తున్న చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ) పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) లో భాగమైన గిల్గిట్- బాల్టిస్థాన్ మీదుగా వెళ్తున్నది. జమ్మూ కశ్మీర్లో భాగమైన ఈ ప్రాంతం నుంచి కారిడార్ నిర్మిస్తున్న చైనా తన అభ్యంతరాలను పట్టించుకోవటం లేదని భారతదేశం భావిస్తోంది.

అంతేగాక ఓబీఓఆర్ ప్రాజెక్టు విషయంలో చైనా వైఖరి పారదర్శకంగా లేదని కూడా భారత్ అభిప్రాయపడుతున్నది. ఇది తమ సార్వభౌమత్వానికి ముప్పుగా భారత్ భావిస్తున్నది. అందుకే అధికారికంగా భారత్ ప్రతినిధులు హాజరు కాకున్నా.. కొంతమంది స్కాలర్లు మాత్రం సదస్సులోపాల్గొంటున్నారు. ప్రబలమైన ఆర్థికశక్తిగా అవతరించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్న చైనా మరో అడుగు ముందుకేస్తోంది. పాత సిల్క్ రోడ్డు పునరుద్ధరణకు చేపట్టిన వన్ బెల్ట్- వన్ రోడ్ (ఓబీఓఆర్) ప్రాజెక్టు విషయమై భారత్పై ఒత్తిడి పెంచేస్తున్నది. ఒకరకంగా దౌత్య యుద్ధం చేస్తుందని అనుకోవచ్చు.
ఓబీఓఆర్కు అమెరికా, జపాన్ దూరం
ఓబీఓఆర్ ప్రాజెక్టుపై ఇప్పటివరకు అమెరికా సానుకూలంగా లేదు. జపాన్ కూడా దూర దూరమే. తూర్పు చైనా సముద్రంలోని కొన్ని వివాదాస్పద దీవుల విషయంలో చైనా వైఖరి నచ్చని జపాన్ ఇంతకాలం ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదు. కానీ తాజాగా ఈ రెండు దేశాలు తమ వైఖరి మార్చుకున్నాయి. బీజింగ్లో చైనా నిర్వహిస్తున్న బీఆర్ఎఫ్ సదస్సుకు హాజరు కావాలని నిర్ణయించుకున్నాయి.
చైనా వైఖరిపట్ల న్యూఢిల్లీ గుర్రు
దీనికి తోడు భారత్కు సంబంధించిన అంశాలపై అంతర్జాతీయ వేదికలపై చైనా అనుసరించిన విధానంపై న్యూఢిల్లీ గుర్రుగా ఉంది. ఎన్ఎస్జీ (నూక్లియర్ సప్లయర్స్ గ్రూప్)లో భారత సభ్యత్వానికి చైనా అడ్డుపుల్ల వేసింది. పాక్కు చెందిన తీవ్రవాది మసూద్ అజహర్పై నిషేధం విషయంలోనూ ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో చైనా అభ్యంతరాలు లేవనెత్తింది. ఎన్ఎస్జీలో సభ్యత్వానికి అడ్డుచెప్పవద్దని స్వయానా ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో చెప్పినా ఫలితం లేకపోయింది. వీటి దృష్ట్యా చైనాలో జరిగే ఈ సదస్సుకు భారతదేశం వెళ్లడం లేదు.
ఇలా రూపుదిద్దుకుందీ సిల్క్ రోడ్డు
దాదాపు రెండువేల సంవత్సరాల క్రితం చైనా రాజ్య ప్రతినిధి ఝాంగ్ కియాన్ చైనాను మధ్య ఆసియా, అరబ్ దేశాలతో కలుపుతూ ఒక రోడ్డు మార్గాన్ని ఆవిష్కరించారు. అదే సిల్క్ రోడ్డు. చైనా నుంచి పట్టు ఎగుమతి చేయటానికి అది దోహదపడింది. దానివల్ల దాదాపు ఒక శతాబ్దకాలం పాటు సిల్క్ రోడ్డు మార్గంలో ఉన్న దేశాలన్నీ ఆర్థికంగా లాభపడ్డాయి.
నాలుగేళ్ల క్రితం పాత సిల్క్ రోడ్డు పునరుద్ధరణకు ప్రతిపాదన
ప్రస్తుత చైనా అధ్యక్షుడు జిన్పింగ్ 2013లో అధికారంలోకి వచ్చిన తర్వాత సిల్క్ రోడ్డు పునరుద్ధరణ ప్రాజెక్టును ప్రతిపాదించారు. అదే వన్ బెల్ట్- వన్ రోడ్ (ఓబీఓఆర్). ఇదేదో ఒక రహదారి మాత్రమే కాదు. ఆసియాను ఐరోపా, ఆఫ్రికా ఖండాలతో అనుసంధానం చేసే బృహత్తర పధకం. ఇందులో భాగంగా వివిధ దేశాల్లో రహదార్లు, నౌకాశ్రయాలు, రైలుమార్గాలు, విద్యుత్ కేంద్రాలు, ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టులు నిర్మిస్తారు. వాటిని వెన్నంటే పారిశ్రామిక పార్కులు, భారీ తయారీ కర్మాగారాలు ఏర్పాటు అవుతాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్ధిని సాధించటానికి, మాంద్యాన్ని అధిగమించటానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని చైనా ఇతర దేశాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తోంది.
ప్రపంచ వాణిజ్యంలో కీలక పాత్రే లక్ష్యం
వాస్తవానికి ఓఆర్బీఆర్ ద్వారా ప్రపంచ వర్తకంలో క్రియాశీలకమైన పాత్ర పోషించాలన్నదే చైనా ఆలోచన. ఇందులో భాగమైన సీపీఈసీ ద్వారా పాకిస్థాన్లోని గ్వాదర్పోర్టు నుంచి అరేబియా సముద్రంమీదుగా ఐరోపా, గల్ఫ్, ఆఫ్రికా దేశాలకు తన వస్తువులను సులువుగా ఎగుమతి చేసే అవకాశం దక్కుతుందని చైనా భావిస్తోంది.
రూ.52 లక్షల కోట్ల పెట్టుబడులు!
ఏ పనిచేసినా చైనా గొప్పగానే చేస్తోంది. వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్టు కూడా ఇంతే. ఈ అతిపెద్ద మౌలిక వసతుల ప్రాజెక్టుపై వచ్చే ఐదేళ్లలో రూ. 52 లక్షల కోట్లు (800 బిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు చైనా అధికార వర్గాల కథనం. ఇప్పటివరకూ 60 బిలియన్ డాలర్లు ఖర్చుచేసింది. చైనా- పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ) ఇందులో భాగంగా చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు. దీని కోసం 45 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తుందని చైనా భావిస్తోంది. ఇందులో అధిక భాగం అప్పుగా ఇస్తుంది. కొంతమేరకు చైనా కంపెనీల పెట్టుబడులు ఉంటాయి. గత ఏడాది చివరి నాటికి వన్ బెల్ట్- వన్ రోడ్ ప్రాజెక్టులకు చైనా డెవలప్మెంట్ బ్యాంకు, ఎక్స్పోర్ట్- ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ చైనా 110 బిలియన్ డాలర్ల రుణాలు సమకూర్చాయి. పలుదేశాలతో చైనా 900 బిలియన్ యువాన్ల కరెన్సీమార్పిడి ఒప్పందాలు కుదుర్చుకున్నది.
సిల్క్ రోడ్డు నిర్మాణ నిధులు ఇలా
14.50 బిలియన్ల డాలర్ల నిధులు ప్రత్యేకంగా సిల్క్ రోడ్డు నిర్మాణానికి చేపట్టారు. చైనా డెవలప్ మెంట్ బ్యాంక్ నుంచి 250 బిలియన్ల యువాన్లు, చైనా ఎక్స్ పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాక్ నుంచి 130 బిలియన్ల యువాన్లు, న్యూ సిల్క్ నిర్మాణంలో పాల్గొనే దేశాల నుంచి 60 బిలియన్ల సాయం లభిస్తుంది.












Click it and Unblock the Notifications