సరిహద్దులో ఉద్రిక్తత: చైనా రక్తసేకరణ, 'ఏ క్షణమైనా యుద్ధం?'
భారత్ - చైనా సరిహద్దులోని ట్రై జంక్షన్ వద్ద ఉద్రిక్తతకు కారణమైన డ్రాగన్ కంట్రీ యుద్ధానికి సన్నద్ధమవుతోందా? అనే చర్చ సాగుతోంది. ఇప్పటికే పలుమార్లు భారత్కు హెచ్చరికలు జారీ చేసింది.
బీజింగ్: భారత్ - చైనా సరిహద్దులోని ట్రై జంక్షన్ వద్ద ఉద్రిక్తతకు కారణమైన డ్రాగన్ కంట్రీ యుద్ధానికి సన్నద్ధమవుతోందా? అనే చర్చ సాగుతోంది. ఇప్పటికే పలుమార్లు భారత్కు హెచ్చరికలు జారీ చేసింది.
మాకేం తెలియదే, ఇండియా కూడా అలాగే ఉండాలి: చైనా వ్యాఖ్య
చైనా సైన్యం రక్త సేకరణ
తాజాగా, చైనా సైన్యం రక్తాన్ని సేకరిస్తోందని వార్తలు వస్తున్నాయి. భారత్ - చైనా మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చర్యలు ఆసక్తికరంగా మారాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతున్న నేపథ్యంలో ఓ ఆసుపత్రిలో బ్లడ్ డొనేషన్ క్యాంపును పునఃప్రారంభించినట్లు తెలుస్తోంది.
డొక్లామ్ సమీపంలో..
ప్రభుత్వ ఆధ్వర్యంలోని గ్లోబల్ టైమ్స్ కథనం ప్రకారం.. హూనన్ ప్రావిన్స్ రాజధాని చాంగ్షాలోని ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని పునః ప్రారంభించారు. ఈ శిబిరం డోక్లామ్ ప్రాంతానికి సమీపంలోనే ఉంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్ఏ) ఆదేశాల మేరకు రక్తాన్ని సేకరిస్తున్నారు.
రక్త వినియోగ నియంత్రణ
అంతేకాకుండా వివిధ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో రక్త వినియోగాన్ని నియంత్రించారని తెలుస్తోంది. హ్యూబే ప్రావిన్స్, గ్వాంగ్జి, జువాంగ్ అటానమస్ ప్రాంతాలలోని ఆసుపత్రుల్లో రక్త వినియోగంపై ఆంక్షలు విధించారని తెలుస్తోంది.
ఏ క్షణమైనా యుద్ధమే?
డోక్లాం వివాదం నేపథ్యంలో భారత్-చైనాల మధ్య ఏ క్షణాన్నైనా యుద్ధం మొదలయ్యే అవకాశం ఉందని విదేశీ మీడియా కోడై కూస్తోంది. సిక్కిం సరిహద్దులో నెలకొన్న సమస్యకు కారణం మీరంటే, మీరని వాదులాడుకుంటున్నాయి తప్పితే సమస్య పరిష్కారానికి ఇరు దేశాలు చొరవ చూపడం లేదని ది వాషింగ్టన్ పోస్ట్ పత్రిక పేర్కొంది.
భారత్-చైనా రెచ్చగొట్టుకుంటున్నాయని
భారత్, చైనాలు రెండూ పరస్పరం రెచ్చగొట్టుకుంటూ సమస్యను మరింత జఠిలంగా మార్చుకుంటున్నాయని సదరు పత్రిక ఆరోపించింది. ఈ విషయంలో ఇరు దేశాల సైనికుల మధ్య చిన్నపాటి గొడవలు కూడా జరుగుతున్నాయని పేర్కొంది. ఫలితంగా సైనికుల మధ్య కాల్పులతో యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.
గత 50 ఏళ్లకు భిన్నంగా
గత యాభై ఏళ్లుగా సరిహద్దు ప్రశాంతంగా ఉందని, ఒక్క తుపాకి గుండు కూడా పేలలేదని, కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందని ఆ పత్రిక పేర్కొంది. గత మూడు దశాబ్దాలతో పోలిస్తే ప్రస్తుతం ఇరు దేశాల మధ్య చాలా క్లిష్టమైన పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొంది.