చైనా అపర కుబేరుడు మిస్సింగ్: రెండు నెలలుగా అడ్రస్ లేని అలీబాబా ఫౌండర్: ఆ రోజు ఏం జరిగింది?
బీజింగ్: జాక్ మా.. పరిచయం అక్కర్లేని పేరు. చైనాకు చెందిన ఈ అపర కుబేరుడు రెండు నెలలుగా కనిపించట్లేదు. ఏమయ్యారో తెలియదు. ఎక్కడున్నారో అంతకంటే తెలియట్లేదు. జాక్ మా ఏమయ్యారు? ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తోన్న ప్రశ్నలు ఇవి. ఇ-కామర్స్ దిగ్గజ సంస్థ అలీబాబా, యాంట్ గ్రూప్ వ్యవస్థాపకుడిగా, బిలియనీర్గా ఓటమి ఎరుగని పారిశ్రామికవేత్తగా రోజూ వార్తల్లోకి ఎక్కే ఆయన రెండునెలల నుంచీ అదృశ్యం అయ్యారు. ఆయన ఆనుపానులు కూడా తెలియరావట్లేదు. ప్రపంచ ఆర్థిక రంగాన్ని కుదుపులకు గురి చేస్తున్నాయి ఈ ప్రశ్నలు.
బిజినెస్ హీరోస్ కార్యక్రమానకీ గైర్హాజర్..
ఆఫ్రికా బిజినెస్ హీరోస్ అనే సొంత టెలివిజన్ టాలెంట్ షోనకు జాక్ మా తరచూ హాజరవుతుంటారు. స్థానిక ఛానల్లో టెలికాస్ట్ అవుతుంటుందీ షో. వ్యాపార రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగిన వారి గురించి.. వారు ఎదిగిన క్రమం గురించి వివరించే ప్రోగ్రామ్ ఇది. దీన్ని జాక్ మా సొంతంగా నిర్వహిస్తున్నారు. న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఈ టెలివిజన్ షోనకు కూడా జాక్ మా హాజరు కాలేదు. ఆయన స్థానంలో అలీబాబా సంస్థ ప్రతినిధి ఒకరు ఇందులో పాల్గొన్నారు. దీనితో జాక్ మా ఏమయ్యారనే ప్రశ్న తలెత్తింది. అది కాస్తా దావానలంలా చుట్టేసింది.
జిన్పింగ్ ప్రభుత్వంతో వివాదాలు..
చైనా అధినేత గ్ఝి జిన్పింగ్ ప్రభుత్వం-అలీబాబా కంపెనీ మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. యాంట్ గ్రూప్, అలీబాబా కంపెనీలపై చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం నిఘా ఉంచింది. యాంట్ గ్రూప్ ఆఫ్ కంపెనీలపై విచారణ కొనసాగుతోంది. చైనా రెగ్యులేటరీల ఆదేశాల మేరకు దర్యాప్తు సాగుతోంది. ఈ పరిణామాల మధ్య జాక్ మా అదృశ్యం కావడం అలజడి రేపుతోంది. రోజూ వార్తల్లో నిలిచే వ్యక్తి.. ప్రపంచ వాణిజ్య రంగాన్ని శాసించే స్థాయికి చేరుకున్న ఓ దిగ్గజ పారిశ్రామికవేత్త.. రెండు నెలలుగా కనిపించకపోవడం కలకలానికి దారి తీసింది.
అక్టోబర్ 24వ తేదీన ఏం జరిగింది?
కిందటి నెల అక్టోబర్ 24వ తేదీన జాక్ మా.. షాంఘైలో నిర్వహించిన ఓ సెమినార్లో ప్రసంగించారు. చైనా రెగ్యలేటరీ వ్యవస్థలను జాక్ మా తన ప్రసంగం సునిశితంగా విమర్శించారు. చైనా రెగ్యులేటరీ వ్యవస్థ, బ్యాంకింగ్ విధానాలు ఏ మాత్రం వాణిజ్యానికి అనుకూలంగా లేవని, వాటిని సరళీకరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. `ఓల్డ్ పీపుల్స్ క్లబ్` ఆయన విమర్శలను సంధించారు. కొత్తతరానికి ప్రతిబింబించేలా ఆర్థిక విధానాలు, బ్యాంకింగ్ వ్యవస్థలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. ఈ ప్రసంగం తరువాతే.. ఆయనకు సమస్యలు చుట్టుముట్టాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
Recommended Video
ఈ రెండు నెలల కాలంలో 11 బిలియన్లు ఆవిరి..
జాక్ మా కనిపించకుండా పోయిన ఈ రెండు నెలల వ్యవధిలో యాంట్ గ్రూప్ ఆఫ్ కంపెనీలు 11 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవి చూశాయి. భారత కరెన్సీతో పోల్చుకుంటే దీని విలువ 80 వేల కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. అక్టోబర్ 24వ తేదీన తన ప్రసంగం తరువాత.. ఆయనకు అన్నీ ఎదురుదెబ్బలే తగిలాయనేది విశ్లేషకుల అంచనా. జాక్ మా కంపెనీలపై ప్రభుత్వం నిఘా ఉంచడం, ఆజమాయిషీని చలాయించడానికి ప్రయత్నించడం వంటి పరిణామాల మధ్య ఆయన కనిపించకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.