మేము డేటా చోరీ చేసే దొంగలమా?: యాప్స్ నిషేధంపై తీవ్రంగా స్పందిస్తోన్న చైనా: భారత చర్యపై
బీజింగ్: చైనాలో తయారైన యాప్స్ల వినియోగాన్ని నిషేధిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని డ్రాగన్ కంట్రీ తీవ్రంగా పరిగణిస్తోంది. భారత చర్య తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీన్ని తాము తీవ్రమైన చర్యగా భావిస్తున్నామని స్పష్టం చేసింది. ఇప్పటిదాకా చైనాకు చెందిన కంపెనీలకు వందల కోట్ల రూపాయల విలువ చేసే పలు కాంట్రాక్టు పనులను భారత్ రద్దు చేసినప్పటికీ.. స్పందించలేదు చైనా. యాప్స్ నిషేధంపై మాత్రం తక్షణమే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
సరిహద్దు వివాదాల నేపథ్యంలో భారత్-చైనా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటూ వస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా- చైనాలో తయారైన యాప్స్ వినియోగాన్ని రద్దు చేసింది భారత్. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. స్మార్ట్ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకున్న టిక్టాక్, యూసీ బ్రౌజర్స్ వంటి 59 యాప్స్ ఒక్క దెబ్బకు ఎందుకూ కొరగాకుండా పోయాయి. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మరుసటి రోజే చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది.
భారత చర్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఝావో లీజియన్ అన్నారు. ఈ అంశాన్ని అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈ యాప్స్ ద్వారా భారతీయుల డేటాను తాము చోరీ చేస్తామంటూ భారత్ పేర్కొనడం సరికాదని అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలు, ఆయా దేశాల ప్రభుత్వాల నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా తమ వ్యాపార కార్యకలాపాలను కొనసాగించాలని ఆదేశాలను జారీ చేశామని చెప్పారు. దానికి అనుగుణంగానే తమ దేశ సంస్థలు యాప్స్లను రూపొందించారని అన్నారు.
చైనా సహా అంతర్జాతీయ పెట్టుబడిదారుల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత భారత్పై ఉందని, అయినప్పటికీ.. దాన్ని విస్మరించిందని ఝావో లీజియన్ వ్యాఖ్యానించారు. డేటాను చోరీ చేస్తామంటూ తమపై ఆరోపణలను చేయడం, ఆ కారణంతో తమ దేశానికి చెందిన యాప్స్ను నిషేధించడం సరికాదని తమ ప్రభుత్వం అభిప్రాయపడుతోందని వెల్లడించారు. దీనికి సమాధానం చెప్పాల్సిన, సరైన కారణాన్ని చూపాల్సిన బాధ్యత భారత్పై ఉందని ఝావో వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిగణిస్తోందని అన్నారు.