'వీగర్ ముస్లింలపై చైనా ప్రభుత్వానిది మారణహోమం.. కళ్లుమూసుకుని కూర్చోకండి’
జిన్జియాంగ్ ప్రాంతంలోని వీగర్ ముస్లింలపై చైనా "తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనకు" పాల్పడించని, వారిని నిర్బంధంలో ఉంచి హింసింస్తోందని ఐక్యరాజ్య సమితి రిపోర్టులో వెల్లడైంది. దాంతో, అంతర్జాతీయ స్థాయిలో ఆగ్రహం వెల్లడైంది.
అయితే, ఈ నివేదికను చైనా ఖండించింది. ఇందులో ఉన్నదంతా తప్పుడు సమాచారమని, "రాజకీయ లక్ష్యాలను నేరవేర్చే ఉద్దేశంతో" తయారుచేసినదని ఆరోపించింది.
దీనిపై వీగర్స్ ఏమంటున్నారు?
మేం మాట్లాడిన వారంతా ఈ రిపోర్ట్ విడుదలైనందుకు సంతోషం వ్యక్తం చేశారు. నివేదిక రావడం ఆలస్యం కావడంతో, ఇది ఎప్పటికీ బయటకు రాదేమోననే భయపడినట్లు చెప్పారు.
అయితే, ఐక్యరాజ్య సమితి (యూఎన్) నివేదిక ప్రారంభం మాత్రమేనని, తాము అంతర్జాతీయ సమాజం నుంచి ఇంకా ఎక్కువ జోక్యం ఆశిస్తున్నామని నొక్కిచెప్పారు.
ఈ నివేదిక "పెద్ద ఉపశమనమని" ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్కు చెందిన మెహ్రే మెజెన్సోఫ్ అనే వీగర్ మహిళ అన్నారు.
జిన్జియాంగ్లో తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని యూఎన్ రిపోర్ట్ గుర్తించినందుకు సంతోషమని ఆమె అన్నారు.
"ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం", "తీవ్రవాదాన్ని ఎదుర్కోవడం" అనే సాకులు చెప్పి చైనా వీగర్లపై హింసకు పాల్పడుతోందని ఈ నివేదికలో చెప్పడం ఉపశమనమని మెజెన్సోఫ్ అన్నారు. ఆమె భర్త మీర్జాత్ తాహెర్కు అదే జరిగింది.
భార్య మెజెన్సోఫ్తో పాటు ఆస్ట్రేలియా వెళ్లవలసిన తాహెర్ను గత అయిదేళ్లుగా చైనాలోని "ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్" క్యాంప్స్కు పంపడం, బయటకు తీసుకురావడం.. ఇదే జరుగుతోంది. చివరికి, 2021లో వేర్పాటువాద రాజకీయాలకు పాల్పడుతునారన్న ఆరోపణలతో ఆయనకు 25 ఏళ్ల జైలుశిక్ష విధించారు.
- వీగర్ ముస్లిం జాతిని చైనా సమూలంగా తుడిచిపెట్టేస్తోందా? బ్రిటన్ నివేదికలో ఏం బయటపడింది?
- వీగర్ ముస్లింలు: జాతి నిర్మూలన ఆరోపణలు 'విడ్డూరం' అంటున్న చైనా విదేశాంగ మంత్రి
'ఇది మారణహోమం, కానీ, యూఎన్ రిపోర్ట్లో ఆ మాట వాడలేదు'
రహీమా మహ్మూత్ 2000ల నుంచి బ్రిటన్లో నివసిస్తున్నారు. వరల్ద్ వీగర్ కాంగ్రెస్కు యూకే డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఇది వీగర్ హక్కులను ప్రోత్సహించే సంస్థ.
యూఎన్ నివేదికపై వీగర్ల స్పందన "చాలా భావోద్వేగాలతో" నిండి ఉన్నదని, ఒకరకమైన మిశ్రమ స్పందన చూడవచ్చని మహ్మూత్ అన్నారు. ఈ నివేదిక బయటకు వచ్చినందుకు ఉపశమనం, మరోపక్క ఇది మరీ దూరం ప్రయాణించలేదన్న నిరాశ రెండూ ఉన్నాయని ఆమె అన్నారు.
"రిపోర్టులో మారణహోమం అన్న మాట వాడలేదు. వాస్తవంలో అదే జరుగుతోంది. చైనా ప్రభుత్వం మా కమ్యూనిటీకి వ్యతిరేకంగా మారణహోమం సృష్టిస్తోంది. ఈ నివేదిక ప్రచురించడానికి యూఎన్ చాలా సమయం తీసుకుంది. అయిదేళ్లు అంటే చాలా ఆలస్యమైనట్టు. ముఖ్యంగా నాలాంటి బాధలున్న వ్యక్తులకు. ఒక రోజు, ఒక గంట గడవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది మాకు" అన్నారు మహ్మూత్.
బ్రిటన్లోని వ్యాణిజ్యవేత్తలు, రాజకీయ నాయకులు ఆంక్షలు విధించాలని, వీగర్ కార్మికుల చేత బలవంతంగా తయారుచేయిస్తున్న వస్తువులను సరఫరా గొలుసు నుంచి తొలగించాలని మహ్మూత్ పిలుపునిచ్చారు.
"అంతర్జాతీయ సమాజం, ప్రభుత్వాలు ఈ విషయన్ని ఇక ఎంతమాత్రం విస్మరించలేవు. ఇంకా నిర్లక్ష్యం చేస్తే నేరంలో భాగమవుతారు" అని ఆమె అన్నారు.
- ముస్లిం అని తెలిస్తే జైల్లో వేసేస్తున్న చైనా.. మత తీవ్రవాదాన్ని పెంచుతున్నారంటూ వీగర్లపై ఆరోపణ
- భారతదేశంలో ముస్లింల సమస్యల గురించి మనకు అవగాహన ఉందా?
'నివేదికలో రాసినది చేతల్లో కనిపించాలి'
నూరీ టర్కెల్, అమెరికాకు చెందిన వీగర్ న్యాయవాది, యునైటెడ్ స్టేట్స్ కమీషన్ ఆన్ ఇంటర్నేషనల్ రేలిజియస్ ఫ్రీడమ్ చైర్పర్సన్.
అంతర్జాతీయ సమాజం దీన్ని ఇక సహించకూడదని, నివేదికలో రాసినది చేతల్లోకి రావాలని టర్కెల్ అన్నారు.
నివేదిక ఆలస్యం కావడం వల్ల ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని, ఈ సమస్యను పరిష్కరించడంలో యూఎన్ "పూర్తిగా విఫలమైందని" ఆయన అన్నారు.
"ఇది మారణహోమం. మనుషులపై అకృత్యాలివి. న్యాయశాస్త్ర పుస్తకాల్లో రాసిన నిర్వచనాలకు సరిపోయే నేరాలు. యూఎన్ సగం కథ మాత్రమే చెప్పింది. దానివల్ల ఉపయోగం లేదు" అని టర్కెల్ అన్నారు.
యూఎన్ రిపోర్ట్పై బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్ మాట్లాడుతూ, "చైనా చర్యల్లో మార్పు తీసుకురావడానికి, జిన్జియాంగ్లో మానవ హక్కుల ఉల్లంఘకు తక్షణమే స్వస్తి పలకడానికి అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పనిచేస్తామని" అన్నారు.
- చైనాలో వీగర్ ముస్లింలు : మైనారిటీ శిబిరాల్లో చెలరేగిన నిర్బంధ హింస
- చైనాలో వీగర్ ముస్లింలు ఏమైపోతున్నారు?
'ఒక జీవచ్ఛవంలా బతుకుతున్నా'
వీగర్ వర్గానికి చెందిన మముత్జాన్ అబ్దురెహిం గత ఏడేళ్లుగా తన కుటుంబానికి దూరంగా ఉంటున్నారు.
అబ్దురెహిం కుటుంబం మలేసియాలో నివసిస్తున్నప్పుడు, ఆయన భార్య ముహర్రం అబ్లెత్ పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకోవడం కోసం తన ఇద్దరు పిల్లలతో కలిసి జిన్జియాంగ్ వచ్చారు. కానీ, ఆమె పాస్పోర్ట్ను జప్తు చేసి, 2017లో ఆమెను నిర్బంధ శిబిరానికి తరలించారు. పిల్లలు అద్బురెహిం తల్లిదండ్రుల వద్ద ఉన్నారు.
అద్బురెహిం ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. గత అయిదేళ్లుగా తన కుటుంబం నుంచి ఆయనకు ఎలాంటి సమాచారం లేదు.
కుటుంబం లేకుండా "ఒక జీవచ్ఛవంలా" బతుకుతున్నానని అబ్దురెహిం అంటున్నారు.
"నాకెప్పుడూ ఒకటే ఆలోచన.. నా కుటుంబాన్ని ఎలా చేరుకోవాలి, నా భార్యను ఎలా విడిపించుకోవాలి, మొత్తం కుటుంబాన్ని ఎలా ఒకచోట చేర్చాలి. దీని గురించే నిరంతరం ఆలోచిస్తుంటాను" అన్నారాయన.
యూఎన్ నివేదిక ఆహ్వానించదగ్గదని అబ్దురెహిం అన్నారు. రాబోయే రోజుల్లో మానవ హక్కుల మండలి సమావేశాల్లో ఇది "ఒక చర్చగా" నిలుస్తుందని, వివిధ దేశాలు ఈ అంశంలో యూఎన్కు సహకారం అందిస్తాయని ఆశిస్తున్నారు.
అయితే, యూఎన్ నివేదికలో చాలా సున్నితమైన భాష వాడారని, వాటిని నిర్బంధ శిబిరాలని చెప్పలేదని ఆయన అన్నారు.
- రోహింజ్యాలు: భారత్లో శరణార్థులకు ఎలాంటి చట్టాలు ఉన్నాయి... రోహింజ్యాల విషయంలో తాజా వివాదం ఏంటి?
- చైనా 'గూఢచారి' నౌక శ్రీలంక వెళుతోంది.. భారత్ ఎందుకు ఆందోళన చెందుతోంది?
'నిర్బంధంలో ఉన్న వీగర్లందరినీ విడుదల చేయాలి'
రేహాన్ అసత్ అమెరికాలో స్థిరపడిన మానవ హక్కుల లాయర్. ఆయన సోదరుడు ఎక్పర్ అసత్ 2016 నుంచి నిర్బంధ శిబిరంలో ఉన్నారు.
యూఎన్ నివేదికపై రేహాన్ అసత్ స్పందిస్తూ "వీగర్లకు యూఎన్ చేయగలిగిన కనీస సాయం ఇది. గత ఏడేళ్లుగా స్థానిక వీగర్లపై చైనా ప్రభుత్వం జరుపుతున్న అకృత్యాల దృష్ట్యా, ఇది కనీస సహాయం. అయితే, ఇది ప్రారంభం మాత్రమే" అన్నారు.
చైనా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని "యూఎన్ సెక్రటరీ జనరల్ నోటి నుంచి వినాలనుకుంటున్నా" అన్నారామె.
ఈ నివేదిక వచ్చిన వెంటనే యూఎన్ మానవ హక్కుల కమిషనర్గా మిచెల్ బాచెలెట్ పదవి ముగిసింది. దానివల్ల ఈ విషయంలో చర్యలు ముందుకు సాగవని భయాందోళనలు వ్యక్తం చేశారు రేహాన్.
"ఈ నివేదికలో ఇచ్చిన సూచనలు, సలహాలను చైనా ప్రభుత్వం పాటిస్తుందో లేదో పర్యవేక్షించేందుకు యూఎన్ ఒక స్వతంత్ర విచారన కమిటీని ఏర్పాటు చేయాలి" అని రేహాన్ కోరారు. నిర్బంధ శిబిరాల్లో బాధలు పడుతున్న అమాయక ప్రజలందరినీ విడుదల చేయాలని యూఎన్ సూచించిందని చెప్పారు.
"ఏళ్ల తరబడి మా కుటుంబాలు పడుతున్న బాధలకు జవాబుదారీతనం కోరుకుంటున్నాం" అన్నారు.
ఇప్పుడు రిపోర్ట్ విడుదలైంది కాబట్టి తన బర్తతో సహా నిర్బంధంలో ఉన్న వీగర్లందరినీ విడుదల చేయడానికి ప్రాధాన్యం ఇవాలని మెజెన్సోఫ్ అభిప్రాయపడ్డారు.
"ప్రపంచం వెనుక సీటులో కూర్చున్నది చాలు. ఇక ముందుకొచ్చి వీగర్ల బాధలకు స్వస్తి పలకాలి. యూఎన్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి, ఇక ఈ అంశంపై శీతకన్ను వేయలేరు" అన్నారు మెజెన్సోఫ్.
ఇవి కూడా చదవండి:
- పోర్చుగల్లో భారత గర్భిణి ఎలా చనిపోయారు, ఆ దేశ ఆరోగ్య మంత్రి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది?
- మురుగా మఠం అధిపతి స్వామి శివమూర్తిపై లైంగిక వేధింపుల కేసు... అసలేం జరిగింది?
- విక్రాంత్: ఈ విమాన వాహక యుద్ధ నౌకను తయారు చేసేందుకు ఎంత ఖర్చయింది, దీని ప్రత్యేకతలేంటి?
- 'మూత్రాన్ని నోటితో శుభ్రం చేయించేవారు' ... పనిమనిషిని వేధించిన బీజేపీ నేత సీమా పాత్రా ఉదంతం ఎలా వెలుగులోకి వచ్చింది?
- మనీ లాండరింగ్ అంటే ఏంటి? అక్రమంగా సంపాదించిన డబ్బును చట్టబద్ధం ఎలా చేస్తారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)