అమెరికాకు చెక్ పెట్టేందుకు డ్రాగన్ తాజా ప్లాన్-మధ్య ఆసియా అభివృద్ధి పేరుతో..!
అంతర్జాతీయంగా అమెరికాతో ఎదురవుతున్న వాణిజ్య పోటీకి తోడు మధ్య ఆసియాలో తన జోరుకు అడ్డుకట్ట వేసేందుకు ఆ దేశం చేస్తున్న ప్రయత్నాలకు చెక్ పెట్టేందుకు చైనా సిద్ధమవుతోంది. ఇందుకోసం చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ఓ భారీ ప్లాన్ విడుదల చేశారు. ఇందులో మధ్య ఆసియాను మౌలిక సౌకర్యాలు అభివృద్ధి చేయడంతో పాటు బయటి శక్తుల జోక్యం నివారించేలా పలు ప్రణాళికలు ప్రకటించారు.
మధ్య ఆసియాలో మౌలిక సౌకర్యాలను భారీ ఎత్తున అభివృద్ధి చేయడం ద్వారా ఈ ప్రాంతంపై పట్టు సాధించడమే లక్ష్యంగా చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ఈ ప్రణాళిక విడుదల చేశారు. ఐదు మధ్య ఆసియా దేశాలైన కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్థాన్లతో అభివృద్ధి వ్యూహాలను సమన్వయం చేసేందుకు చైనా సిద్ధంగా ఉందని, మొత్తం ఆరు దేశాల ఆధునీకరణను ప్రోత్సహించేందుకు సంయుక్తంగా కృషి చేస్తుందని చైనా-మధ్య ఆసియా సదస్సులో ప్రసంగించిన జిన్ పింగ్ వెల్లడించారు. ప్రపంచానికి స్థిరమైన, సుసంపన్నమైన, సామరస్యపూర్వకమైన, మెరుగ్గా అనుసంధానించిన మధ్య ఆసియా అవసరమని పేర్కొన్నారు.

అదే సమయంలో ఈ ఆరు దేశాలు తమ అంతర్గత వ్యవహారాల్లో బాహ్య జోక్యాన్ని వ్యతిరేకించాలని, విప్లవాలను ప్రేరేపించే ప్రయత్నాలను వ్యతిరేకించాలని నిర్ణయించాయి. అలాగే ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదానికి వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ విధానం అనుసరించాలని జిన్ పింగ్ తెలిపారు. చైనా.. మధ్య ఆసియా దేశాలు తమ చట్టాల అమలు, భద్రత, రక్షణ సామర్థ్య నిర్మాణాన్ని మెరుగుపరచడంలో సహాయపడటానికి సిద్ధంగా ఉందని జిన్ పింగ్ హామీ ఇచ్చారు. చారిత్రాత్మక సిల్క్ రోడ్ నగరం జియాన్లో జరిగిన రెండు రోజుల శిఖరాగ్ర సమావేశాన్ని చైనా ప్రాంతీయ దౌత్య విజయంగా చైనా మీడియా
అభివర్ణించింది.
ఈ సందర్భంగా కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ నేతలు చైనాకు మద్దతు ఇస్తూ ద్వైపాక్షిక సహకారం అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు. చైనా తాజా ప్రయత్నాలు మధ్య ఆసియాలో ఇతర దేశాలపై ఒత్తిడి తెస్తున్నారంటూ అమెరికా చేస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టినట్లవుతుంది. ఉక్రెయిన్ యుద్ధంలో బిజీగా ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లేకుండా చైనా గడ్డపై ఐదుగురు దేశాధినేతలను జిన్ పింగ్ సమీకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications