వానరాల్లో మానవ మెదడు జన్యువులు మనిషి తెలివితేటలపై చైనా సైంటిస్టుల పరిశోధన
బీజింగ్ : మనిషి కోతి నుంచి పుట్టాడంటారు. మానవ పరిణామక్రమంలో వానరం నుంచి వచ్చిన నరుడు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాడు. సరికొత్త ఆవిష్కరణలతో అద్బుతాలు సృష్టిస్తున్నాడు. మనిషి ఇంతగా అభివృద్ధి చెందుతున్నా కోతులు మాత్రం అలాగే ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో మనిషి తెలివితేటలకు కారణాలు కనుగొనేందుకు చైనా సైంటిస్టులు కొత్త పరిశోధనలు తెరతీశారు.
మా ఊరి పేరు మార్చండి మహాప్రభో!
వానరంలో మనిషి మెదడు జన్యువు
చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్స్ సైంటిస్టులు మనిషి మెదడులోని జన్యువుల్ని కోతుల్లో ప్రవేశపెట్టి తెలివితేటలు, జ్ఞాపకశక్తిపై పరిశోధనలు చేస్తున్నారు. ఈ విషయాన్ని బీజింగ్ నేషనల్ సైన్స్ రివ్యూ జర్నల్ ప్రచురించింది. జర్నల్ కథనం ప్రకారం మానవ మెదడులో కీలక పాత్ర పోషించే ఎంసీపీహెచ్ 1 అనే జన్యువును 11 రీసన్ జాతి కోతుల్లో ప్రవేశపెట్టారు. అమెరికాకు చెందిన నార్త్ కరోలినా యూనివర్సిటీ సైంటిస్టుల సహకారంతో చైనా కున్మింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జువాలజీ, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ ప్రయోగంలో పాలు పంచుకుంటోంది.
మనిషి తెలివితేటలపై అధ్యయనం
రీసన్ జాతికి చెందిన 11 కోతుల గర్భంలో ఉన్న పిండాలలో ఎంసీపీహెచ్ 1 జన్యువును వైరస్ ద్వారా ప్రవేశపెట్టారు. అయితే 11 వానరాలు జన్మనిచ్చిన పిల్లల్లో ఆరు చనిపోగా.. ప్రస్తుతం బతికున్న ఐదింటిపై ప్రయోగాలు చేస్తున్నారు. ఆ కోతుల్లో జ్ఞాపకశక్తి, రంగులు, ఆకారాల గుర్తింపు తదితర అంశాలపై పరీక్షలు జరుపుతున్నాయి. ఇందుకోసం ఎమ్మారై స్కానింగ్, మెమరీ టెస్ట్లు నిర్వహించి ఫలితాలను విశ్లేషిస్తున్నారు.
ప్రయోగాలపై విమర్శలు
కోతులపై చేస్తున్న ప్రయోగాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని చైనా సైంటిస్టులు చెబుతున్నారు. అయితే వారు నిర్వహిస్తున్న పరీక్షలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి చర్యలు నైతికతను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే సైంటిస్టులు మాత్రం సమాజ శ్రేయస్సుకు పరిశోధనలు ఉపయోగపడతాయని అంటున్నారు.