Citizenship Amendment Act:జెనీవాలో పౌరసత్వ సవరణ చట్టంను సమర్థించిన భారత్
జెనీవా: దేశంలో ఆశ్రయం కోరుతూ ప్రపంచదేశాల నుంచి వచ్చేవారికి భారత్ స్వాగతం పలుకుతుందని ప్రభుత్వం జెనీవాలో పేర్కొంది. కొత్తగా తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టంను భారత్ సమర్థించింది. ప్రజాస్వామ్య పద్ధతి ద్వారానే పౌరసత్వ ప్రక్రియను పూర్తి చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పుకొచ్చింది. జెనీవాలో జరిగిన ప్రపంచ శరణార్థుల సమాఖ్య సమావేశంలో భారత్ తరపున రాజీవ్ కే చందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పాకిస్తాన్పై నిప్పులు చెరిగారు.
మైనార్టీలను అణగదొక్కిన పాక్
పాకిస్తాన్ సొంత దేశంలో ఉన్న మైనార్టీలను అణగదొక్కే ప్రయత్నం చేసిందని అందుకే వారంతా భారత్కు వలస వచ్చారని చెప్పారు. 1947లో పాకిస్తాన్లో మైనార్టీలు 23 శాతం ఉండగా ప్రస్తుతం అక్కడ 3శాతం మంది మాత్రమే ఉన్నారంటే వారు ఏ స్థాయిలో వివక్ష చూపారో అర్థమవుతోందని చందర్ చెప్పారు. అక్కడ మానవహక్కులకు ప్రాధాన్యత లేదని మండిపడ్డారు. ముస్లింయేతర మతస్తులపై కఠినమైన చట్టాలు చేసి వారిని దేశం దాటేలా చేశారని వెల్లడించారు. అంతేకాదు వారిని దూషించడం బలవంతంగా మతమార్పిడులు చేయడం వంటి అరాచక పర్వానికి తెరలేపారని చందర్ ధ్వజమెత్తారు.
ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా పౌరసత్వం
భారత్లో ఆశ్రయం కోరుతూ వచ్చిన ముస్లింయేతర ప్రజలకు తమ ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా భారత పౌరసత్వం కల్పిస్తోందని చెప్పారు. భారత్ గురించి మరొకరు మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఉగ్రవాదంను సొంత గడ్డపైనే ప్రోత్సహిస్తూ తిరిగి భారత్పై బురదజల్లేవారు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదన్నారు చందర్. చందర్ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ మాట్లాడారు.
ఇమ్రాన్ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు
కశ్మీర్లో విధించిన కర్ఫ్యూ, అక్కడ కొత్తగా తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టంతో భారత్లోని లక్షలాది మంది ముస్లింలు భారత్ను వీడి ఇతర దేశాలకు వెళ్లిపోతారనే వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు మరో దేశానికి వెళ్లిపోవడమే కాదు భారత్ పాక్ల మధ్య యుద్ధం కూడా తలెత్తే అవకాశం ఉందని చెప్పారు. ఎక్కువ మంది శరణార్థులను తమ దేశంలో ఉండేందుకు వసతి కల్పించలేమని చెప్పిన ఇమ్రాన్ఖాన్... ప్రపంచ దేశాలు వెంటనే రంగంలోకి దిగి దీనిపై చర్యలకు ఉపక్రమించాలని కోరారు.
భారత్ అంతర్గత విషయాల్లో పాక్ జోక్యమెందుకు..?
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను చందర్ తప్పుబట్టారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ తన దేశం సంగతి, తన దేశ ప్రజల సంగతి చూసుకుంటే బాగుంటుందని చందర్ హితవు పలికారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్ అంతర్గత విషయాల్లో అతిగా జోక్యం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. భారత్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుని విద్వేషాలను రెచ్చగొడుతున్నారని చెప్పారు. శరణార్థుల సమస్యను భారత్ తప్పకుండా పరిష్కరిస్తుందని చెప్పారు.
శరణార్థులకు ఆశ్రయం ఇవ్వడం భారత్ గొప్పదనం
7వ శతాబ్దంలో భారత్కు వలస వచ్చిన జోరాస్ట్రియన్లు లేదా పార్శీలు ఇప్పుడు భారత సమాజంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారని చందర్ గుర్తు చేశారు.16వ శతాబ్దంలో శరణార్థులగా భారత్కు వచ్చిన జ్యూయిస్లు ఇప్పటికీ దక్షిణ భారత్లో నివసిస్తున్నారని చెప్పారు. ఇలా పొరుగు దేశాల నుంచి కూడా చాలా మంది వచ్చారని వారందరికీ పౌరసత్వం కల్పిస్తామని చెప్పారు.