భర్తతో గొడవ పడింది.. ఆ కోపంలో రూ.4.5 లక్షలు మింగేసింది
కొలంబియా: ఎంత భర్తతో గొడవ పడితే మాత్రం ఇలా చేస్తారా? అందరి సంగతి ఏమో కానీ, కొలంబియాలో మాత్రం ఓ భార్య చేసిన పని వింతగా ఉంది. భర్తపై కోపంతో ఆమె డబ్బును మింగేసింది. అంతా ఇంతా కాదు.. ఏకంగా రూ.4.5 లక్షల నోట్లు మింగేసింది.
వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ అమెరికాలోని కొలంబియాలో ఓ మహిళ(30) తన భర్తతో గొడవ పడింది. అప్పటికే ఆమె ఇంట్లోని ఎలక్ట్రికల్ గృహోపకరణాలు అమ్మి డబ్బులు దాచి ఉంచింది.
తన భర్తతో కలిసి హాలీడేకి వెళ్లినప్పుడు ఆ డబ్బు ఖర్చుపెట్టాలని అనుకుంది. కానీ ఈ లోపే భర్తతో గొడవ జరిగింది. ఒకలాంటి మానసిక వేదనకు గురైన ఆమె, తన వద్ద ఉన్న డబ్బు ఏం చేయాలో అర్థంకాక మింగేసింది. దాదాపు 7 వేల డాలర్లు అంటే మన భారతీయ కరెన్సీలో రూ.4.5 లక్షలు ఆమె మింగేసింది.
ఆ తరువాత ఆమె ఆసుపత్రి పాలవడం, జరిగినదంతా డాక్టర్లకు వివరించడంతో వారు ఆపరేషన్ చేసి ఆమె కడుపులోంచి ఆ డబ్బును బయటికి తీశారు. జాన్ పౌలో సెరన్నాలోని ఉన్న యూనివర్సిటీ హాస్పిటల్ ఆఫ్ శాంతాండర్ వైద్యులు ఆమెకు ఆపరేషన్ నిర్వహించారు.
ఆమె మింగిన 100 డాలర్ల నోట్లను బయటకు తీశారు. పొట్టలో నోట్లు ఉండల్లా చుట్టుకుపోయి ఉన్నాయని, కొన్ని పేగల్లోకి వెళ్లిపోయాయని, వాటిని జాగ్రత్తగా బయటికి తీశామని డాక్టర్లు పేర్కొన్నారు. అయినా ఇదేం పిచ్చి పని? ఎంత భర్తతో గొడవ వస్తే మాత్రం డబ్బు దాచుకోవడానికి చోటే దొరకలేదా ఈమెకి?