'కాప్' చారిత్రక ఆమోదం: భారత్ డిమాండ్లకు ప్రాధాన్యం
ప్యారిస్: భూతాపాన్ని 2 డిగ్రీల కంటే తక్కువ స్థాయికి తగ్గించేందుకు కాప్ సదస్సు ఆమోదం తెలిపింది. భూతాపానికి కళ్లెం వేసేందుకు ప్రపంచ దేశాలు కీలక ముందడుగు వేశాయి. ఈ దిశగా చరిత్రాత్మక ఒప్పందానికి 195 దేశాలు శనివారం ఆమోదముద్ర వేశాయి.
ప్యారిస్లో జరుగుతున్న అంతర్జాతీయ వాతావరణ సదస్సు (కాప్11)లో... పారిశ్రామిక విప్లవానికి ముందునాటితో పోలిస్తే 2100 సంవత్సరం నాటికి భూతాపంలో పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ స్థాయికి పరిమితం చేయాలన్న ప్రతిపాదనకు ప్రపంచదేశాలు అంగీకారం తెలిపాయి.
దీంతో, దాదాపు రెండు వారాలుగా జరుగుతున్న కాప్ సదస్సు విజయవంతమైంది. వాతావరణ మార్పులతో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేలా వర్ధమాన దేశాలకు 2020 నుంచి ఆర్థిక తోడ్పాటును అందించేందుకు ఏటా 100 బిలియన్ డాలర్ల మేర సమకూర్చాలని ఒప్పందం స్పష్టం చేసింది.

2 డిగ్రీల కన్నా తక్కువ లేదా కొన్ని దేశాలు చెబుతున్నట్లుగా 1.5 డిగ్రీల లక్ష్యం భారత్, చైనా వంటి వర్ధమాన దేశాలకు ఆమోదయోగ్యం కాకపోవచ్చని తొలుత భావించారు. 31 పేజీల ఈ ఒప్పంద ముసాయిదాను స్వాగతిస్తున్నట్లు పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు.
ఒప్పందాన్ని చూస్తే... భారత్ లేవనెత్తిన అంశాలకు ప్రాధాన్యం లభించినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. భారత్ లేవనెత్తుతున్న నిలకడైన జీవన విధానాలు, వినియోగ తీరులో నిలకడ, వాతావరణ న్యాయం వంటి అంశాలను ఒప్పందంలోని పీఠికలో చేర్చినట్లు పరిశీలకులు పేర్కొన్నారు.
భారత్ డిమాండ్ చేస్తున్నట్లుగా అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాలకు మధ్య వైరుధ్ద్యాన్ని ముసాయిదాలోని అన్ని అంశాల్లో ప్రస్తావించినట్లు.. ఒప్పందం ఆమోదం పొందేందుకు ముందు జవదేకర్ విలేకరులతో చెప్పారు. వాతావరణ మార్పుల నుంచి ఉపశమనం, వాటికి అనుగుణంగా సర్దుబాటు, ఆర్థిక సాయం, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంచడం వంటి అ్ని అంశాల్లోను దీనిని పేర్కొన్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications