కరోనా ఎఫెక్ట్: యూరప్ నుంచి వచ్చే ప్రయాణికులపై బ్యాన్, 30 రోజుల నిషేధం విధించిన పెద్దన్న..
కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చాపకింద నీరులా వైరస్ ప్రబలడంతో ఆయా దేశాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అమెరికా కూడా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. వైరస్ ఎక్కువగా ప్రబలుతోన్న యూరప్ నుంచి 30 రోజుల పాటు పర్యాటకులను అనుమతించబోమని అమెరికా స్పష్టంచేసింది. ఇప్పటికే అగ్రరాజ్యంలో వైరస్ సోకి 37 మంది ప్రాణాలు కోల్పోగా.. 1,015 మంది కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో విదేశాల నుంచి వచ్చేవారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నది.
Recommended Video
యూరప్ నుంచి వచ్చే అన్నిదేశాలపై నిషేధం విధించిన అమెరికా.. తమతో సన్నిహితంగా మెలిగే బ్రిటన్కు మాత్రం మినహాయింపు ఇచ్చింది. కొత్త నిబంధన శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు వైట్హౌస్లో మీడియాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు. అయితే అమెరికా తిరిగి వచ్చే ప్రయాణికులు.. స్రీన్ టెస్ట్లు రెండు, మూడు ఆపై ఎక్కువ సార్లు చేయించుకొని, కరోనా వైరస్ నెగిటివ్ వచ్చిన వారిని అనుమతిస్తామని పేర్కొన్నారు.
కరోనా వైరస్ నివారించడంలో యూరొపియన్ యూనియన్ విఫలమైందని ట్రంప్ ఆరోపించారు. వైరస్ ప్రబలుతోన్న తగిన జాగ్రత్తలు మాత్రం తీసుకోలేదని చెప్పారు. కరోనా వైరస్.. ఆర్థిక మాంద్యం కాదని, ఆరోగ్యానికి సంబంధించినది అని పేర్కొన్నారు. తాత్కాలికంగా ఉంటుందని, కానీ దానిని సమూలంగా నివారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వైరస్ను నిర్మూలించేందుకు ప్రభుత్వం శాయశక్తుల ప్రయత్నిస్తోందని.. ఇందుకోసం పెట్టుబడిదారుల సాయం కూడా తీసుకుంటామని ట్రంప్ స్పష్టంచేశారు.