Coronavirus: వైద్య విధాన మూలాల్లోకి చైనా.. 3000 ఏళ్ల కిందటి చికిత్స: 1523 మంది మృతి
బీజింగ్: ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడిన చైనా పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. కరోనా వైరస్ బారిన పడి మరణిస్తోన్న వారి సంఖ్యకు అడ్డుకట్ట పడట్లేదు. ఆ వైరస్ సోకిన వారి సంఖ్య కూడా అడ్డు, అదుపు లేకుండా పెరిగిపోతూనే వస్తోంది. చైనాలో వైరస్ ఆచూకీ వెలుగులోకి వచ్చినప్పటి నుంచీ శనివారం నాటికి 1523 మంది దాని బారిన పడిన మరణించారు. మరో 66,500 మందిలో వైరస్ లక్షణాలు కనిపించాయి. వారందరికీ చికిత్స అందిస్తున్నారు.
వైరస్ను ఢీ కొట్టడానికి వైద్య మూలాల్లోకి..
కరోనా వైరస్కు అడ్డుకట్ట వేయడానికి చైనా ప్రభుత్వం వైద్య విధానాన్ని సమూలంగా మార్చేయాలని నిర్ణయించుకుంది. వైద్య విధాన మూలాల్లోకి వెళ్లనుంది. ఈ వైరస్ను నియంత్రించడంలో భాగంగా- చైనా సంప్రదయ మందులు, వైద్య విధానాలను అనుసరిస్తోంది. దీనికోసం ఇప్పటికే కొంతమంది సంప్రదాయ వైద్యులను బరిలోకి దింపింది. వుహాన్ సిటీ సహా హ్యుబే ప్రావిన్స్లోని కొన్ని ఆసుపత్రుల్లో ఈ తరహా వైద్య విధానాన్ని ఆరంభించింది.
ప్రాచీన, ఆధునిక వైద్య విధానాన్ని మేళవించి..
దీనికోసం 3000 సంవత్సరాల కిందటి వైద్య విధానానికి సంబంధించిన నైపుణ్యం గల వారు, సంప్రదయ వైద్యుల సహకారాన్ని తీసుకుంటున్నామని చైనా వైద్య, ఆరోగ్యమంత్రిత్వ శాఖ అధికారి, హ్యుబే ప్రావిన్స్ కొత్త హెల్త్ కమిషనర్ ఛైర్మన్ వాంగ్ హెషెంగ్ తెలిపారు. చైనా సంప్రదాయ వైద్య విధానం, మందులను మేళవించి, ఆధునిక పద్ధతుల్లో కరోనా రోగులకు చికిత్సను అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దీని ఫలితాలు ఏమిటనేది ఇంకా తెలియరావాల్సి ఉందని అన్నారు.
2200 మందితో ప్రత్యేక బృందాలు..
తమ దేశంలో ప్రాచీన వైద్య విధానాలను అనుసరిస్తూ చికిత్స అందించే వారు మొత్తం 2200 మంది ఉన్నట్లు గుర్తించామని వాంగ్ హెషెంగ్ తెలిపారు. వారందర్నీ ప్రత్యేక బృందాలుగా హ్యుబే ప్రావిన్స్కు తరలించినట్లు చెప్పారు. వుహాన్ సిటీ సహా హ్యుబెే ప్రావిన్స్లోని కొన్ని ఆసుపత్రుల్లో వైద్య చికిత్సల్లో విస్తృంతగా పాల్గొంటున్నారని అన్నారు. ప్రాచీన, ఆధునిక విధానాలను మేళవించి చికిత్స చేస్తున్నామని, కొంత సానుకూల వాతావరణం కనిపిస్తోందని చెప్పారు.
అన్ని ప్రావిన్స్లల్లోనూ వైరస్ జాడలు..
తమ దేశంలోని అన్ని ప్రావిన్స్లల్లోనూ కరోనా వైరస్ విస్తరించిందని వాంగ్ హెషెంగ్ స్పష్టం చేశారు. అన్ని ఆసుపత్రులు, వైద్య శిబిరాల్లో రోగులకు అత్యవసర విధానంలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. అయినప్పటికీ.. మరణాల సంఖ్య ఆందోళనకరంగా పెరిగిపోతోందని అన్నారు. శనివారం సాయంత్రానికి 1523 మంది మరణించారని, 66,500 మందిలో వైరస్ లక్షణాలు కనిపించాయని తెలిపారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకట్ట వేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు.