డేంజర్ బెల్స్: 28 లక్షలకు కరోనా మరణాలు: టాప్-4 దేశాల లిస్ట్లో భారత్: 13 కోట్లకు
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కరాళ నృత్యాన్ని కొనసాగిస్తోంది. మరణ మృదంగాన్ని మోగిస్తోంది. కరోనా ధాటికి ప్రపంచం మొత్తం కకావికలమౌతోంది. మరణాల సంఖ్య నిమిష, నిమిషానికీ పెరుగుతూనే పోతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడి కన్నుమూసిన వారి సంఖ్య క్రమంగా 28 లక్షలకు చేరువ అవుతున్నాయి. రాకెట్లా దూసుకెళ్తున్నాయి. అనేక దేశాల్లో పాజిటివ్ కేసులు.. దానికి అనుగుణంగా మరణాలు బెంబేలెత్తిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడంలో, మరణాలకు అడ్డుకట్ట వేయడంలో అగ్రదేశాలు సైతం చేతులు ఎత్తేశాయి. ఈ పరిస్థితుల్లో అనేక దేశాలు లాక్డౌన్లోకి జారిపోతున్నాయి.

28 లక్షలకు చేరువగా కరోనా మరణాలు..
ఇప్పటిదాకా ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి 27,95,633 మంది మరణించారు. పాజిటివ్ కేసులు 12,77,52,956 నమోదు అయ్యాయి. కరోనా మరణాల్లో గానీ, పాజిటివ్ కేసుల సంఖ్యలో గానీ అగ్రరాజ్యం అమెరికా.. అగ్రరాజ్యంగానే ఉంటోంది. అమెరికాలో ఇప్పటిదాకా 5,62,524 మంది చనిపోయారు. పాజిటివ్ కేసుల సంఖ్య మూడు కోట్లను దాటేశాయి. ఇప్పటిదాకా 3,09,62,744 కరోనా కేసులు రికార్డ్ అయ్యాయి. కాలిఫోర్నియా, న్యూయార్క్లల్లో కరోనా మరణాలు 50 వేల మార్క్ను దాటాయి. కాలిఫోర్నియా-58,595, న్యూయార్క్-50,319, టెక్సాస్లో 50 వేలకు చేరువ అయ్యాయి. 48,338 మంది అక్కడ మృతిచెందారు.

రెండో స్థానంలో బ్రెజిల్..
రెండో స్థానంలో బ్రెజిల్ నిలిచింది. ఇప్పటిదాకా 3,12,299 మంది చనిపోయారు. 1,25,34,688 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రెండు లక్షలకు పైగా కరోనా మరణాలు నమోదైన దేశాల జాబితాలో మెక్సికో చేరింది. ఇప్పటిదాకా 2,01,429 మంది మరణించారు. 22,24,767 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా మరణాల రేటు అత్యధికంగా ఉన్న దేశం కూడా ఇదే. బ్రిటన్, ఇటలీలో లక్షమందికి పైగా కరోనా బారిన పడి చనిపోయారు. ఇటలీ-1,07,933, బ్రిటన్-1,26,592 మంది కరోనా కాటుకు బలి అయ్యారు. లక్షకుపైగా మరణాలు నమోదైన దేశాల జాబితాలో అమెరికా, బ్రెజిల్, భారత్, మెక్సికో, బ్రిటన్ తరువాత ఇటలీ చేరింది.

భారత్లోో మళ్లీ కోరలు చాస్తోన్న కరోనా..
భారత్లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంటోంది. కరోనా మరణాలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. అమెరికా, బ్రెజిల్, మెక్సికో తరువాత కరోనా మరణాల్లో భారత్ నిలిచింది. ఆదివారం నాటి బులెటిన్ ప్రకారం.. ఇప్పటిదాకా 1,61,552 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 1,19,71,624కు చేరింది. యాక్టివ్ కేసులు మళ్లీ మొదటికొచ్చాయి. వాటి సంఖ్య 4,86,310కి చేరింది. ఇంకొక్కరోజు దాటితే అయిుదు లక్షల మార్క్ను దాటడం ఖాయమే. మహారాష్ట్రలో అత్యధికంగా రోజువారీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం నాటి బులెటిన్ ప్రకారం 40,414 కొత్త కేసులు నమోదయ్యాయి. 54,181 మంది అక్కడ మరణించారు.

బ్రెజిల్లో కొత్త వేరియంట్..
బ్రెజిల్లో కరోనా తీవ్రత అధకంగా ఉంటోంది. రోజూ వేలమంది అక్కడ మృత్యువాత పడుతున్నారు. ఇప్పుడు నెలకొన్న ఇదే వేగం ఇలాగే కొనసాగితే కరోనా మరణాల్లో అమెరికాను వెనక్కి నెట్టే అవకాశాలు లేకపోలేదు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అక్కడి ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలు ఫలించట్లేదు. మరణాల రేటు అధికంగా ఉంటోంది. బ్రెజిల్లో కనిపించిన కొత్త కరోనా వైరస్ వేరియంట్.. పొరుగునే ఉన్న పెరూలోనూ వ్యాప్తి చెందుతోంది. అమెరికాలో కరోనా కట్టడి చర్యలు కొనసాగుతున్నప్పటికీ.. మరణాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడట్లేదు.












Click it and Unblock the Notifications