అమెరికాకు ఆ ముప్పు తప్పదు.. చైనాలో మళ్లీ గబ్బిలాలు.. గ్లోబల్గా 40 వేల మంది బలి..
ఒక స్వతంత్ర దేశంగా 200 సంత్సరాలకుపైగా చరిత్ర కలిగిన అమెరికాలో.. కేవలం 70 రోజుల వ్యవధిలో పరిస్థితులన్నీ మారిపోయాయి. అన్నింటా అగ్రగామిగా ఉండే అంకుల్ శామ్.. కరోనా విపత్తును ఎదుర్కొంటున్న దేశాల జాబితాలోనూ మొదటి స్థానంలో ఉంది. అందరినీ ఆదుకునే పెద్దన్నే బేలచూపులు చూస్తుండటంతో మిగతాదేశాలు ఉసూరుమంటున్నాయి.

యూఎస్ క్రిటికల్..
మంగళవారం రాత్రి(భారతకాలమానం ప్రకారం) నాటికి అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1.76 లక్షలకు పెరిగింది. 50 రాష్ట్రాల్లో కలిపి మొత్తం 3,500 మంది చనిపోయారు. విచిత్రంగా మిగతా దేశాలకంటే రికవరీ రేటు చాలా తక్కువగా ఉండటం, క్రిటికల్ కేసుల సంఖ్య భారీగా ఉండటంతో రాబోయే రోజుల్లో మరణాల సంఖ్య అమాంతం పెరగొచ్చు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. డాక్టర్లు అంచనా వేసినట్లు లక్షల మంది ప్రాణాలకు ముప్పు తప్పని పరిస్థితి నెలకొనే అవకాశాలున్నాయి.

చైనాలో గబ్బిలాల జోరు..
మహమ్మారి దెబ్బకు ప్రపంచమంతా షట్ డౌన్ అయిపోయింది. విరుగుడు మందు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో అన్ని దేశాల్లోనూ వైరస్ విలయతాండవం కొనసాగుతూనే ఉంది. చైనాలో తగ్గుముఖం పట్టాయనుకున్న కేసులు కాస్తా.. విదేశీ రాకలతో మళ్లీ పెరిగాయి. మరోవైపు కరోనా వైరస్ దేన్నుంచైతే వ్యాపించిందని సైంటిస్టులు భావిస్తున్నారో.. ఆ గబ్బిలాల అమ్మకాలు మళ్లీ జోరందుకున్నాయి. వైరస్ మొట్టమొదటి ఎపిసెంటర్ హుబే ఫ్రావిన్స్ లో జనం మళ్లీ గబ్బిలాలను ఎగబడి కొంటున్నారు.

గ్లోబల్ టోల్..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కు బలైపోయినవారి సంఖ్య 40 వేలు దాటింది. వైరస్ అంతకంతకూ విస్తరిస్తుండటంతో పాజిటివ్ పేషెంట్ల సంఖ్య 8.30లక్షలు దాటింది. అమెరికా, యూరప్ లో రికవరీ రేటు తక్కువగా ఉండటంతో ఆ ఎఫెక్ట్ గ్లోబల్ నంబర్లపై పడింది. ఇప్పటిదాకా కొవిడ్-19 నుంచి కోలుకున్నవారి సంఖ్య 1.75లక్షలుగా ఉంది.

యూరప్ లో ఘోరకలి..
కేసుల సంఖ్యలో అమెరికా తర్వాతి స్థానంలో ఉన్న ఇటలీ.. మరణాల్లో మాత్రం టాప్ లో ఉండటం విషాదకరం. ఇటలీలో ఇప్పటిదాకా 12,500 మంది ప్రాణాలు కోల్పోగా, కేసుల సంఖ్య లక్షకుపైగానే కొనసాగుతున్నది. స్పెయిన్ లో 94వేల కేసులు, 8,200 మరణాలు సంభవించగా, జర్మనీలో వైరస్ అతివేగంగా వ్యాపిస్తూ 690 మందిని బలితీసుకుంది. అక్కడ సుమారు 70 వేల కేసులు నమోదయ్యాయి. ఫ్రాన్స్ లో 3వేల మంది, యూకేలో 1800 మంది చనిపోయారు. ఇక ఇరాన్ లో మంగళవారం కొత్త కేసులేవీ నమోదు కాకపోవడం గమనార్హం. ఆ దేశంలో మొత్తం 2898 మంది చనిపోగా, కేసుల సంఖ్య 44,605గా ఉంది.

ఇండియాలో ఇదీ సీన్..
ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ భవన్ లో వైరస్ వ్యాప్తిని గుర్తించిన తర్వాత.. పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. మంగళవారం రాత్రి నాటికి దేశవ్యాప్తంగా 1614 కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా 47 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా మహారాష్ట్రలో 302 కేసులు నమోదయ్యాయి. కేరళలో మంగళవారం కేవలం 7 మాత్రమే కొత్త కేసులొచ్చాయి. ఏపీలో ఒకేరోజు 21 కేసులతో మొత్తం పాజిటివ్ ల సంఖ్య 44కు పెరిగింది. తెలంగాణలోనూ మర్కజ్ ప్రభావంతో కేసుల సంఖ్య 92కు చేరింది. ఈశాన్యంలో ఒకటి రెండు చిన్నరాష్ట్రాలు తప్ప దేశమంతటా వైరస్ కేసులు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications