Covid-19:అమెరికాలో చేదాటిన పరిస్థితి..లక్షకుపైగా కేసులు,వెంటిలేటర్ల కొరత
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాను కరోనావైరస్ మహమ్మారి వెంటాడుతోంది. అదేదో ఆ దేశంపై పగ పెంచుకున్నట్లుగా ఈ మహ్మమ్మారి అక్కడి ప్రజల ప్రాణాలను తీసేస్తోంది. ఇప్పటికే అమెరికాలో ఈ వ్యాధి బారిన పడి 1600 మంది మృతి చెందగా దాదాపు లక్ష మందికి పైగా కరోనావైరస్ సోకి చికిత్స పొందుతున్నారు. రోజురోజుకూ అమెరికాలో మరణాల సంఖ్య పెరిగిపోతుండటంతో వైద్యులు ఇతర మెడికల్ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అక్కడి మెడికల్ సిబ్బంది ఎందుకు ఆందోళన చెందుతున్నారు..?
అగ్రరాజ్యం అమెరికా... ప్రపంచంలో ఏదేశానికైనా తీరని నష్టం జరిగితే ఆదుకుంటామంటూ ముందుకొచ్చే అగ్రరాజ్యం. కానీ ప్రస్తుతం అగ్రరాజ్యాన్నే మరొక దేశం ఆదుకోవాల్సిన పరిస్థి దాపురించేలా ఉంది. ఇందుకు కారణం కోవిడ్-19. కరోనావైరస్ ధాటికి అక్కడి ప్రజలు పిట్టలు రాలినట్లు రాలుతున్నారు. ఇక చికిత్స కోసం హాస్పిటళ్లు సరిపోవడం లేదు. తగినంత సిబ్బంది కూడా లేదు. కోవిడ్-19 బారిన పడి ఊపిరి తీసుకోలేకపోతున్న వారికోసం అమెరికాలో వెంటిలేటర్లు సైతం తక్కువగా ఉన్నాయి. అంతేకాదు న్యూయార్క్, న్యూ ఓర్లీన్స్, డెట్రాయిట్లాంటి మహానగరాల్లో ఉన్న హాస్పిటల్స్లో మెడిసిన్స్ కొరతతో పాటు ఎక్విప్మెంట్ కొరత కూడా ఏర్పడింది. ఇక శుక్రవారం ఒక్కరోజే 16000గా ఉన్న కోవిడ్-19 బాధితుల సంఖ్య ఒక్కసారిగా 1,02,000కు చేరుకోవడం కలవరపాటుకు గురిచేస్తోంది. ఇక దీంతో ఇన్ఫెక్షన్ సోకిన దేశాలు అయిన చైనా, ఇటలీలను అమెరికా మించిపోయింది.
Recommended Video
ఇక అమెరికాలో ఇప్పటి వరకు 1606 మరణాలు నమోదవగా ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 300 మరణాలు నమోదయ్యాయి. హాస్పిటల్స్లో కోవిడ్-19 పేషెంట్ల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.ఇక వైద్యులకు ఫేస్ మాస్క్ల కొరత ఏర్పడటంతో పేపర్తో తయారు చేసిన మాస్క్లను వినియోగిస్తున్నారు. పరిస్థితి చేదాటి పోతుండటంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. అతిపెద్ద వాహనతయారీ సంస్థ జనరల్ మోటార్స్ను వెంటనే వెంటిలేటర్స్ తయారు చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. ఇలా నేషనల్ ఎమర్జెన్సీ సమయాల్లో పరిశ్రమలపై ఒత్తిడి తీసుకొచ్చే అధికారాలు అమెరికా అధ్యక్షుడికి కలిగి ఉంటాయి. అంటే అప్పటి వరకు సహాయం చేయాలా వద్ద అనేది ఆయా సంస్థల పై ఆధారపడి ఉండగా ఒక్కసారి నేషనల్ ఎమర్జెన్సీ వచ్చిందంటే ఒక అధ్యక్షుడు పలు సంస్థలపై పూర్తి అధికారాలు కలిగి ఉంటారు.