ఇక మూడో ప్రపంచ యుద్ధమే! ఉత్తరకొరియానే మొదలెడుతుంది.. తప్పదు!
ఉత్తర కొరియా జోరుగా క్షిపణి ప్రయోగాలు చేస్తుంటే.. అమెరికాతో బేరసారాల కోసమేనని నిన్నమొన్నటి వరకూ అనుకున్నారు. కానీ ఆ దేశం అసలు ఉద్దేశం మూడు ప్రపంచ యుద్ధానికి తెరతీయడమే అని ఇప్పుడు అనిపిస్తోంది.
Recommended Video
వాషింగ్టన్: ఉత్తర కొరియా జోరుగా క్షిపణి ప్రయోగాలు చేస్తుంటే.. అమెరికాతో బేరసారాల కోసమేనని నిన్నమొన్నటి వరకూ అనుకున్నారు. కానీ ఆ దేశం అసలు ఉద్దేశం మూడు ప్రపంచ యుద్ధానికి తెరతీయడమే అని ఇప్పుడు అనిపిస్తోంది.
అమెరికా ఎన్ని వార్నింగ్ లు ఇచ్చినా ఉత్తరకొరియా తన తీరు మాత్రం మార్చుకోలేదు. తాజాగా జపాన్ మీదుగా క్షిపణి ప్రయోగించి యుద్ధానికి సిద్ధమంటూ సవాలు విసిరింది. ఈ ప్రయోగం దక్షిణ కొరియా, జపాన్లను కూడా కలవరపరుస్తోంది. అటు అమెరికా అధ్యక్షుడి మీదా ఒత్తిడి పెరిగిపోతోంది.
ఇది 'కర్టెన్ రైజర్' మాత్రమే: కిమ్ సంచలన వ్యాఖ్య, సీరియస్ అయిన ఐక్యరాజ్య సమితి
దీని పర్యవసానాలు ఎలా ఉంటాయనే ఆందోళన ఇప్పుడు ప్రపంచదేశాల్లో వ్యక్తమవుతోంది. ఒకవేళ ఉత్తర కొరియా తన మీద క్షిపణి ప్రయోగం చేస్తే బదులుగా అమెరికా తీవ్రంగా స్పందించక మానదు. దక్షిణ కొరియా, జపాన్ సైతం యుద్ధ క్షేత్రంలోకి అడుగుపెడతాయి. ఉత్తర కొరియా పనిపట్టేందుకు సిద్ధమవుతాయి. ఆ ప్రభావం ప్రపంచ దేశాలన్నింటిపైనా పడుతుంది. ఫలితం.. మూడో ప్రపంచ యుద్ధం.. తప్పదు.
ఇదీ ఉత్తరకొరియా చరిత్ర...
రెండో ప్రపంచయుద్ధంలో జపాన్ ఓటమి పాలై లొంగిపోవటంతో అప్పటి వరకూ ఆ దేశం ఆక్రమణలో ఉన్న కొరియా ఉత్తర భాగం రష్యా అజమాయిషీలోకి రాగా, దక్షిణ భాగాన్ని అమెరికా ఆక్రమించాయి. ఈ రెండింటినీ విలీనం చేసే యత్నాలు ఫలించలేదు. 1948 నుంచి ఉత్తర కొరియా, దక్షిణ కొరియా రెండు దేశాలుగా ఏర్పడ్డాయి. ఉత్తర కొరియా రష్యా ప్రభావంతో సోషలిస్టు రాజ్యంగా ఆవిర్భవించగా, దక్షిణ కొరియా అమెరికా ప్రభావంతో పెట్టుబడిదారీ వ్యవస్థను అనుసరించింది. వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా నాయకుడైన కిమ్ సంగ్ రష్యా మద్దతుతో ఉత్తర కొరియా అధ్యక్షుడయ్యాడు. 1994 వరకూ పాలించాడు. దక్షిణ కొరియా అమెరికా, జపాన్ నుంచి లభించిన పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానంతో శరవేగంగా అభివృద్ధి సాధించింది. అదే సమయంలో ఉత్తర కొరియా ప్రపంచదేశాలతో మమేకం కాలేక వెనుకబడిపోయింది.
కిమ్ జాంగ్ కు ఆదినుంచీ యుద్ధ కాంక్షే...
కిమ్ సంగ్ తర్వాత 1994 నుంచి 2012 వరకూ కిమ్ జాంగ్, ఆ తర్వాత ప్రస్తుత కిమ్ జాంగ్ ఉన్ అధ్యక్షులయ్యారు. కిమ్ జాంగ్ ఉన్ అధికారం చేపట్టిన నాటి నుంచి యుద్ధ కాంక్షను ప్రదర్శిస్తూ వచ్చాడు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి అంశాలు అతడి అజెండాలో లేవు. అదే సమయంలో సైన్యాన్ని బలోపేతం చేయడం, ఖండాంతర క్షిపణులను అభివృద్ధి చేయటంపైనే అతడి దృష్టి అంతా. అంతటితో ఆగకుండా అమెరికాను సవాలు చేస్తూ అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్నాడు.
1976 నుంచే మొదలైన క్షిపణి కార్యక్రమం...
ఉత్తర కొరియా తన క్షిపణి అభివృద్ధి కార్యక్రమాన్ని 1976- 81 మధ్య కాలంలో చేపట్టింది. 1984లో మొదటి స్కడ్- బి క్షిపణిని ప్రయోగించి చూసింది. రొడాంగ్ క్షిపణిని 1990లో ప్రయోగించింది. 1998లో వీటిని తన సైన్యంలో చేర్చుకుంది. రొడాంగ్ క్షిపణులకు 1300 కిలోమీటర్లలోని లక్ష్యాలను గురిపెట్టగల సత్తా ఉంది. 2003లో అణు విస్తరణ ఒప్పందం నుంచి ఉత్తరకొరియా బయటికొచ్చేసింది. అప్పటి నుంచి అణ్వాయుధాలను సమకూర్చుకునేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది.
2005 నాటికే అణ్వాయుధ పాటవం...
ఉత్తరకొరియా తన వద్ద అణ్వాయుధాలు ఉన్నట్లు 2005లో ప్రకటించింది. 2006లో మూడు రకాల క్షిపణులను ప్రయోగించింది. ఇందులో ఒకటైన తాపెడాంగ్-2 క్షిపణి సుదూర లక్ష్యాలను ఛేదించగలదు. తద్వారా అమెరికా నగరాలపై దాడి చేయగల శక్తిని సంపాదించుకున్నట్లయింది. అదే ఏడాదిలో అణు పరీక్షలు నిర్వహించింది. 2009లో మరోసారి క్షిపణి ప్రయోగాలు, అణు పరీక్షలు నిర్వహించింది.
కిమ్ జాంగ్ రాకతో పెరిగిన దూకుడు...
ప్రస్తుత అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ 2012లో అధికారంలోకి వచ్చాడు. అప్పటి నుంచి ఉత్తరకొరియా దూకుడు పెరిగింది. 2013లో మూడో అణు పరీక్షలను నిర్వహించింది. నూక్లియర్ రియాక్టర్ను ప్రారంభించింది. 2015 సెప్టెంబరులో అమెరికాపై అణు దాడికి సిద్ధంగా ఉన్నట్లు బెదిరించింది. ఆ మరుసటి ఏడాదిలో హైడ్రోజన్ బాంబును పరీక్షించింది. అయిదోసారి అణు పరీక్షలు నిర్వహించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యశ్రేణి క్షిపణిని ప్రయోగించింది. తర్వాత నెలలోనే 4 ఖండాంతర క్షిపణిలను ప్రయోగించగా అందులో 3 క్షిపణిలు జపాన్కు సమీపంలో కూలిపోయాయి. తాజాగా జపాన్ మీదగా క్షిపణిని ప్రయోగించింది. ఇది జపాన్లోని హొక్కాడై దీవి సమీపంలో సముద్రంలో పడింది. ఈ ఏడాది మొత్తం మీద ఉత్తర కొరియా 14 క్షిపణులను ప్రయోగించింది. దీంతో సమీపంలోని దక్షిణ కొరియా, జపాన్ దేశాలతో పాటు అమెరికా కలవర పాటుకు గురవుతున్నాయి.
సియోల్ నగరమే తొలి టార్గెట్...
ఉత్తరకొరియా సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉన్న నగరం దక్షిణ కొరియా రాజధాని సియోల్. ఆ దేశానికి చెందిన బహుళజాతి సంస్థలైన ఎల్జీ, శాంసంగ్, హ్యూండాయ్ ఇక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో మూడోవంతు వాటా రాజధాని నగరానిదే. భవిష్యత్తులో యుద్ధ మేఘాలు కమ్ముకుంటే.. దక్షిణ కొరియా రాజధాని అయిన సియోల్ నగరమే ఉత్తరకొరియా తొలి టార్గెట్ అవుతుంది. అదేగనుక జరిగితే, దక్షిణ కొరియా ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయిపోతుంది. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ యుద్ధం రాకూడదని దక్షిణ కొరియా భావిస్తోంది. కానీ ఉత్తరకొరియా దూకుడుకు అడ్డుకట్ట వేసే శక్తిమాత్రం ఆ దేశానికి లేదు.
జపాన్ మళ్లీ సైనిక శక్తి అవుతుందా?
రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ అమేయమైన సైనిక శక్తి. కానీ ఆ యుద్ధంలో ఓడిపోవటం జపాన్ సైనిక స్వరూపాన్ని పూర్తిగా మార్చివేసింది. జపాన్ సైన్యంపై అమెరికా ఆంక్షలు అమలయ్యాయి. జపాన్ కూడా సైనికంగా ఎదగాలని అనుకోకుండా అభివృద్ధి బాటలో పయనించింది. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ రంగాల్లో అద్భుత ప్రగతి సాధించింది. అందుకే తన రక్షణ విషయంలో అది అమెరికాపై ఆధారపడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు జపాన్ ఆలోచనల్లో మార్పు వస్తోంది. ఉత్తర కొరియా దూకుడు, చైనాతో విభేదాల కారణంగా తానూ బలమైన సైనిక శక్తి కావాలనుకుంటోంది. మళ్లీ సైన్యాన్ని బలోపేతం చేయాలనే ఆలోచనకు ప్రస్తుత జపాన్ ప్రధాని షింజో అబే సానుకూలంగా ఉన్నారు. జపాన్కు ఉన్న ఆర్థిక, సాంకేతిక సత్తాను పరిగణలోకి తీసుకుంటే బలమైన సైనిక శక్తిగా మారటం పెద్ద కష్టమేం కాదు. ఉత్తర కొరియా వ్యవహారం ముదిరిన పక్షంలో అదే జరుగుతుందని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
చైనా, రష్యా ఎందుకు జోక్యం చేసుకోవు?
చైనా తలుచుకుంటే ఉత్తర కొరియాను అదుపు చేయగలదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎంతో కాలంగా చెబుతున్నారు. కానీ దానికి చైనా నుంచి సానుకూల స్పందన కనిపించటం లేదు. ఇంతకాలం ఉత్తర కొరియాకు అన్నీ తానై చైనా వ్యవహరించటమే దీనికి కారణం. ఆ దేశ వాణిజ్యంలో చైనా వాటా 90 శాతం ఉంది. అన్ని రకాలైన వస్తువులను, ఆయుధాలను చైనా సరఫరా చేస్తోంది. తూర్పు ఆసియాలో అమెరికా ప్రభావం ఇంకా విస్తరించి తనదాకా రాకుండా ఉండాలంటే అడ్డుగా ఉత్తర కొరియా వంటి దేశం ఉండటం అవసరమని చైనా భావిస్తోంది. అందుకే ప్రస్తుత వివాదంలో గుంభనంగా వ్యవహరిస్తోంది. ఉత్తర కొరియాను సృష్టించటంలో అసలు పాత్ర రష్యాదే అయినా తర్వాత కాలంలో ఆ దేశ వ్యవహారాల్లో చైనా క్రియాశీలకంగా మారింది. అయినప్పటికీ చైనాకు ఉన్న భయాలే రష్యాకూ ఉన్నాయి. అందువల్ల ఈ రెండు దేశాలు ఉత్తర కొరియాను కట్టడి చేసేందుకు ప్రయత్నించటం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
రెండో అతిపెద్ద వర్తక భాగస్వామి భారత్!
ఉత్తర కొరియాతో మనదేశానికి బలమైన వర్తక బాంధవ్యం ఉందనే విషయం ఎక్కువమందికి తెలియదు. ఆ దేశంతో వర్తక భాగస్వామ్యం ఉన్న దేశాల్లో మొదటిది చైనా అయితే తర్వాత స్థానం మనదే. మనదేశం నుంచి మందులు, ప్రత్యేకమైన రసాయనాలు, ట్రక్కులు, దుస్తులు, పాలిస్టర్ నూలు, పెట్రోలియం ఉత్పత్తులు పెద్ద సంఖ్యలో ఉత్తరకొరియాకు ఎగుమతి అవుతున్నాయి. అయినప్పటికీ ఉత్తర కొరియా వ్యవహారశైలిని భారతదేశం సమర్థించటం లేదు. అందుకే ఆ మధ్య అమెరికా సైన్యానికి చెందిన ఓ అధికారి భారత్ జోక్యం చేసుకుని ఉత్తరకొరియాకు నచ్చజెప్పే ప్రయత్నం చేయాలని వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతానికి ఈ వివాదంలో తలదూర్చకుండా మన దేశం దూరంగా ఉండిపోయింది.
మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధిస్తారా?
ఈనెల మొదటివారంలో ఉత్తర కొరియాపై ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఆర్థిక ఆంక్షలు విధించింది. దీనివల్ల ఆ దేశానికి తీవ్రమైన ఇబ్బందులు తప్పవు. బొగ్గు, ఇనుప ఖనిజం తదితర ముడిపదార్ధాలు ఉత్తర కొరియా నుంచి చైనా కొనుగోలు చేస్తుంది. చైనా నుంచి అన్ని రకాలైన వస్తువులు ఉత్తర కొరియాలోకి దిగుమతి అవుతాయి. ఆంక్షల ఫలితంగా అవి నిలిచిపోయే అవకాశం ఏర్పడుతుంది. అయినా సరే, వెనక్కి తగ్గకపోగా ఉత్తరకొరియా ఇంకా దూకుడుగానే ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆ దేశంపై మరికొన్ని ఆంక్షలు విధించాలని అమెరికా ఆలోచిస్తోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో ఈ విషయమై చర్చ జరిగే అవకాశం ఉంది.