కరోనా: వూహాన్లో పేషెంట్లు లేరు.. అమెరికా కకావికలం.. అయినాసరే లాక్డౌన్ ఎత్తివేత..
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 కేసుల సంఖ్య 30 లక్షలకు చేరగా.. కరోనా మహమ్మారి పుట్టినిల్లైన వూహాన్లో మాత్రం గొప్ప ప్రశాంతత నెలకొంది. అక్కడ చిట్టచివరి పేషెంట్ కూడా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిపోవడంతో కేసుల సంఖ్య సున్నాకు చేరిందని చైనా ప్రభుత్వం సగర్వంగా ప్రకటించుకుంది. మరోవైపు మోస్ట్ ఎఫెక్టెడ్ దేశంగా కొనసాగుతోన్న అమెరికాలో కేసులు, మరణాల పరంగా కొత్త రికార్డులు నమోదయ్యాయి. అయినాసరే, పలు రాష్ట్రాలు సాహసోపేతంగా లాక్ డౌన్ ఎత్తేశాయి. బాగా దెబ్బతిన్న స్పెయిన్ కూడా ఆంక్షల్ని పూర్తిగా సడలించేందుకు సిద్ధమైంది.
Recommended Video

వూహాన్లో పేషెంట్లు జీరో..
సాధారణంగా వైరస్ల విషయంలో ‘పేషెంట్ జీరో'(మొట్టమొదట వైరస్ సోకిన వ్యక్తి)కి ప్రాధాన్యం ఉంటుంది. కానీ కరోనా దగ్గరికొచ్చేసరికి ఆ పేషెంట్ జీరో ఎవరో కనిపెట్టకముందే.. వైరస్ పుట్టిన వూహాన్ సిటీలో పేషెంట్ల సంఖ్య జీరోకు చేరింది. చిట్టచివరి పేషెంట్ ను శుక్రవారమే ఇంటికి పంపేశామని జిన్ పింగ్ ప్రభుత్వం ఆదివారం వెల్లడించింది. చైనాలో మొత్తంగా 4,632 మంది చనిపోగా, వూహాన్ మినహా మిగతా ప్రాంతాలన్నీ కలిపి ఇంకా 77,394 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. మరోవైపు..

అమెరికాలో అక్షరాలా 10 లక్షలు..
కరోనా ధాటికి అగ్రదేశం అమెరికా చిగురుటాకులా వణికిపోతున్నది. ఆదివారం నాటికి అక్కడ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో 10లక్షలకు చేరువైంది. అందులో 1.18లక్షల మంది వ్యాధి నుంచి కోలుకోగా, సుమారు 55వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 15వేల మంది క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు. న్యూయార్క్ స్టేట్ లో అతిభారీగా 22వేల మంది కన్నుమూశారు. న్యూజెర్సీలో 6వేలు, మిషిగన్ లో 3300మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవి కాకుండా మరో ఆరు రాష్ట్రాల్లో వెయ్యికిపైగా మరణాలు సంభవించాయి. ఇదిలా ఉంటే..

లాక్డౌన్ ఎత్తివేత..
ఒకదిక్కు కేసుల ఉధృతి పెరుగుతూనే ఉన్నా, వైరస్ వ్యాప్తి తగ్గిందనడానికి ఆధారాలు లేకపోయినా.. పలు రాష్ట్రాలు లాక్ డౌన్ కు మంగళంపాడుతుండటం అమెరికాలో తాజా దృశ్యం. జార్జియా లో ఇప్పటికే నిషేధాలు సడలించగా, ఆదివారం నాటికి కొలరాడో, మిన్నెసొటా, మోంటానా, టెన్నెస్సీ రాష్ట్రాల్లో సైతం దుకాణాలు, వ్యాపార సముదాయాలు తెరుచుకున్నాయి. లాక్ డౌన్ ఎత్తివేత లేదా బిజినెస్ రీఓపెనింగ్ కు సంబంధించి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ , రాష్ట్రాల గవర్నర్లకు మధ్య గొడవలు ఇంకా చల్లారలేదు. ఫెడరల్ సర్కారు వద్దని చెప్పినా, రాష్ట్రాలు తమ నిర్ణయాలతో ముందుకు వెళుతున్నాయి.

సౌదీ లోనూ సడలింపులు..
గల్ఫ్ లో కీలక దేశమైన సౌదీ అరేబియాలో ఆదివారం నుంచి కరోనా కర్ఫ్యూను పాక్షికంగా సడలించారు. మక్కా, మదీనా ప్రాంతాలు తప్ప అన్ని ఊళ్లకు ఆదేశాలు వర్తించేలా కింగ్ సాల్మాన్ ఆదేశాలు జారీ చేసినట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ పేర్కొంది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో కొవిడ్-19 పేషెంట్ల సంఖ్య 17,522గా ఉంది. అక్కడ ఇప్పటివరకు 139 మంది చనిపోయారు. సంస్థలు మూతపడటంతో భారత్ సహా పలు దేశాల వలస కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం నాటి రిలాక్సేషన్లతో కొంత ఉపశమనం లభించినా, వ్యాపార, వాణిజ్యాల పూర్తిగా రీఓపెన్ అయ్యేదాకా గడ్డుపరిస్థితి ఎదుర్కోక తప్పేలా లేదు.

ఇమ్యూనిటీ పాస్పోర్టులు వద్దు..
లాక్ డౌన్ ఎత్తివేతకు సిద్ధపడ్డ ఆయా రాష్ట్రాలు.. విమాన సర్వీసుల్ని పునరుద్ధరించడంలో భాగంగా కొవిడ్-19 నుంచి కోలుకున్నవాళ్లకు ‘ఇమ్యూనిటీ పాస్ పోర్ట్' పేరుతో ప్రయాణాలకు అనుమతించే ప్రక్రియ చేపట్టడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆందోళన వ్యక్తం చేసింది. కొవిడ్-19 నుంచి కోలుకున్నవాళ్లక మళ్లీ వైరస్ సోకదన్న గ్యారంటీ లేదని, అలాంటప్పుడు ఇమ్యూనిటీ సర్టిఫికేట్లు జారీచేయడం కరెక్ట్ కాదని ఆయా దేశాలు, ప్రభుత్వాలను డబ్ల్యూ హెచ్ వో హెచ్చరించింది.












Click it and Unblock the Notifications