కరోనా వైరస్ నివారణకు ఆయన చెప్పింది కరెక్ట్: పారాసిటమాల్ వాడొచ్చు..గైడ్లైన్స్ కూడా: డబ్ల్యూహెచ్ఓ
జెనీవా: ప్రాణాంతక కరోనా వైరస్ చికిత్సలో భాగంగా పారాసిటమాల్ మాత్రలను వినియోగించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. ప్రస్తుతం వాడుతోన్న ఇబుప్రొఫెన్ టాబ్లెట్ల కంటే కూడా పారాసిటమాల్ మాత్రలు మరింత ప్రభావశీలంగా పని చేస్తాయని స్పష్టం చేసింది. కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు కనిపించిన పేషంట్లకు అందిస్తోన్న వైద్య చికిత్సల్లో పారాసిటమాల్ మాత్రలను చేర్చేలా త్వరలోనే మార్గదర్శకాలను జారీ చేస్తామని పేర్కొంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాల్లో కూడా ఈ విషయాన్ని చేర్చుతామని డబ్ల్యూహెచ్ఓ అధికార ప్రతినిధి క్రిస్టియన్ లిండ్మెయిర్ తెలిపారు.
ఇబుప్రొఫెన్ కంటే.. పారాసిటమాల్ బెటర్.. క్రిస్టియన్ లిండ్మెయిర్
దీనిపై ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. డబ్ల్యూహెచ్ఓ అధికార ప్రతినిధి క్రిస్టియన్ లిండ్మెయిర్ పేరును ఉటంకిస్తూ ఈ కథనాన్ని రాసుకొచ్చింది. కరోనా వైరస్ చికత్సలో ప్రస్తుతం వినియోగిస్తోన్న ఇబుప్రొఫెన్ టాబ్లెట్ల కంటే పారాసిటమాల్ వినియోగం వల్లే ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి స్పష్టం చేసినట్లు తన కథనంలో పేర్కొంది. సొంతంగా వైద్య చికిత్సను తీసుకుంటున్న కరోనా వైరస్ పేషెంట్లు ఇబుప్రొఫెన్కు బదులుగా పారాసిటమాల్ను వాడాలని కూడా స్పష్టం చేసినట్లు ప్రచురించింది.
ఫ్రాన్స్ మంత్రి ప్రకటనకు సమర్థన..
ఇంతకుముందు- కరోనా వైరస్ చికిత్స కోసం పారాసిటమాల్ మాత్రలను తప్పనిసరిగా వినియోగించాలని ఫ్రాన్స్ మంత్రి ఒలివర్ వెరన్ వెల్లడించారు. కరోనా వైరస్ సోకిన వారికి దగ్గు, జ్వరం, జలుబు లక్షణాలు కనిపిస్తాయనే విషయం తెలిసిందే. సాధారణ జ్వరానికి వినియోగంచే పారాసిటమాల్ను కరోనా జ్వరం సోకిన వారికి కూడా వాడొచ్చని ఒలివర్ వెరన్ తెలిపారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వివాదాన్ని కూడా రేకెత్తించింది. మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సాధారణ పారాసిటమాల్ను వాడొచ్చని చెప్పడం సరికాదంటూ విమర్శలు చెలరేగాయి.
ఇబుప్రొఫెన్ వాడకంపై మెడికల్ జర్నల్ ఏం చెబుతోంది?
ఈ వివాదానికి, చర్చకు తెర దించింది డబ్ల్యూహెచ్ఓ. ఒలివయర్ వెరన్ ప్రకటనను సమర్థించింది. ఇబుప్రొఫెన్ కంటే పారాసిటమాల్ను వినియోగించడం వల్ల మరింత ప్రభావం కనిపిస్తోందని క్రిస్టియన్ లిండ్మెయిర్ తెలిపారు. త్వరలోనే తాము ఈ అంశాన్ని కరోనా వైరస్ చికిత్సకు సంబంధించిన మార్గదర్శకాల్లో చేర్చుతామని స్పష్టం చేసింది. ఇబుప్రొఫెన్ వల్ల కరోనా వైరస్ మరింత బలోపేతం చేయడానికి కూడా అవకాశం ఉన్నట్లు టాప్ మెడికల్ జర్నల్ `ద లాన్సెట్` సైతం ధృవీకరించినట్లు తేలింది. పారాసిటమాల్ను వినియోగించాలని తాము అధికారికంగా ఓ ప్రకటన చేస్తామని క్రిస్టియన్ వెల్లడించారు.
Recommended Video
ఏపీలో కూడా విమర్శల దుమారం
కరోనా వైరస్ జ్వరానికి పారాసిటమాల్ మాత్రలను వాడొచ్చని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్ది రోజుల కిందటే వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద దుమారమే చెలరేగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు, సోషల్ మీడియా విభాగం కార్యకర్తలు వైఎస్ జగన్ వ్యాఖ్యలను తప్పు పట్టారు. పారాసిటమాల్తో కర్నా వైరస్ను ఎలా నియంత్రించగలరంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ఎద్దేవా చేశారు. తాజాగా- ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం పారాసిటమాల్ ద్వారా కరోనా వైరస్కు చికిత్స అందించవచ్చని ధృవీకరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.