కోవిడ్-19: ఇటలీలో ఒక్కరోజే 793 మంది మృతి.. మొత్తంగా కరోనావైరస్ మరణాల సంఖ్య ఎంతంటే..?
ఇటలీ: ప్రపంచాన్ని కరోనావైరస్ గడగడలాడిస్తోంది. ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి మాట్లాడుకుంటున్నా వారి మధ్య టాపిక్ కరోనావైరస్ తప్ప మరొకటి ఉండటం లేదు. ఎక్కడో చైనాలో బయటపడి ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తున్న ఈ మహమ్మారి... ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో ప్రాణాలను బలిగొంది. చైనాలో పుట్టినప్పటికీ అక్కడి కంటే ఇతర దేశాల్లో ప్రజలు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక మృతుల సంఖ్యలో ఇటలీ అంతకంతకు పెరిగిపోతోంది. తొలినాళ్లలో మృతుల సంఖ్యలో చైనా అగ్రస్థానంలో నిలవగా ఎక్కడో అట్టడుగు స్థానంలో ఉన్న ఇటలీ ఇప్పుడు అదే మరణాల సంఖ్యలో డ్రాగన్ కంట్రీని వెనక్కు నెట్టి అగ్రస్థానంకు ఎగబాకింది. మొన్న ఒక్కరోజే 600 మందికి పైగా మృతి చెందగా శనివారం ఒక్కరోజు ఆ సంఖ్య మరింత పెరిగింది.
ఇటలీలో కరోనావైరస్ బారిన పడి ఒక్క శనివారం రోజునే 793 మంది మృతి చెందారు. దీంతో కరోనావైరస్ బారిన పడిన వారి సంఖ్య 4,825కు చేరుకుంది. అంటే ఒక్కరోజులోనే 19.6శాతం పెరిగింది. గత నెలలో ప్రారంభమైన మృతుల సంఖ్య ఒక్కసారి పరిశీలిస్తే శనివారం ఒక్కరోజునే మరణించిన వారి మృతుల సంఖ్య అత్యధికంగా ఉంది. గురువారం రోజున మృతుల సంఖ్యలో చైనాను మించిపోయింది ఇటలీ. ఇక కరోనావైరస్ బారిన పడి చికిత్స పొందుతున్న వారి సంఖ్య 53,578కి చేరింది. అంతకుముందు ఈ సంఖ్య 47,021గా ఉన్నింది. అంటే 13.9శాతం మేరా పెరిగినట్లు ఇటలీ ఆరోగ్యశాఖ పేర్కొంది.
ఇక ఇటలీలో లంబార్డీ అనే ప్రాంతంలో కరోనావైరస్కు సంబంధించి అత్యధిక మరణాలు నమోదయ్యాయి. ఆ ఒక్క ప్రాంతం నుంచే 3095 మంది కరోనావైరస్ సోకి మృతి చెందారు. మరో 25,515 మంది హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 6072 మంది పూర్తిగా కోలుకున్నారు. అంతకుముందు అంటే శుక్రవారం నాటికి కోలుకున్న వారి సంఖ్య 5,129గా ఉంది. 2857 మందికి ఇంటెన్సివ్ కేర్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
ఇటలీలో కరోనావైరస్ మహమ్మారి బారిన పడి మృతి చెందిన వారికి అంత్యక్రియలు పూర్తిచేసేందుకు అక్కడి స్థానిక స్మశానవాటికల్లో చోటు లభించడం లేదు. దీంతో మృతదేహాలను శవపేటికలోనే ఉంచి అక్కడ ఉన్న చర్చీల్లో ఉంచుతున్నారు. రోజుకు 40 మృతదేహాలను మాత్రమే ఖననం చేసేందుకు వెసులుబాటు ఉండటంతో చర్చీల్లో మృతదేహాలు కలిగిఉన్న శవపేటికలు పేర్కొని పోతున్నాయి. చర్చీలన్నీ శవపేటికలతో దర్శనమిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఇటలీలో కరోనావైరస్ ఏస్థాయిలో విజృంభిస్తుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.