కరోనా విలయం: చైనాతో అమెరికా కటీఫ్.. వ్యాక్సిన్ రీసెర్చ్ను హ్యాక్ చేశారా? భారత్ పొరుగన మరో కలకలం
కరోనా మహమ్మారి విలయానికి కారణం చైనాయే అని పదే పదే ఆరోపిస్తోన్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనానికి తెరలేపారు. ఇప్పటికే చైనా ఈక్వీటీ మార్కెట్లలో పెట్టాలని నిర్ణయించిన భారీ పెట్టుబడుల్ని నిలిపేసిన ఆయన.. రాబోయే రోజుల్లో వాణిజ్య ఒప్పందాన్ని కూడా మార్చేస్తానని, ఆపై చైనాకు పూర్తిగా కటీఫ్ చెబుతానని హెచ్చరించారు. కరోనా విషయంలో తాను ముందు నుంచి చెబుతున్నదే నిజమైందని ట్రంప్ చెప్పుకొచ్చారు.
Recommended Video

చైనా సప్లై చైన్ తెగాల్సిందే..
కరోనా విలయానికి చైనానే కారణమని నేను ముందు నుంచీ చేస్తోన్న వాదన నిజమేనని ఇప్పుడు నిరూపణ అయింది. చైనా నుంచి ప్రపంచం నలుమూలలకు సప్లై చైన్ కొనసాగుతోంది. అందులో ఏ ఒక్క చోట ఇబ్బంది ఏర్పడినా భూగోళం మొత్తం ఎఫెక్ట్ అవుతోందడానికి కరోనా విలయమే ఉదాహరణ. కాబట్టి చైనా సప్లై చైన్ ను మనం తెంచుకోవాలి. అమెరికాలో తయారరైన వస్తువులకే ప్రాధాన్యమిస్తూ దేశంలోపలే కొత్త సప్లై చైన్ ఏర్పాటయ్యేలా చూసుకోవాలి. కరోనా తర్వాత వాణిజ్య ఒప్పందాన్ని సమూలంగా మార్చేస్తాం. చైనాతో బంధాలను పూర్తిగా తెంచుకునే దిశగా ఆలోచిస్తాం. ఈ విషయంలో జిన్ పింగ్ తో మాట్లాడే ఉద్దేశం అసలేలేదు''అని ట్రంప్ స్పష్టం చేశారు.

తగ్గని తీవ్రత.. అయినా రీఓపెనింగ్..
అమెరికాలో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. గురువారం ఒక్కరేజే కొత్తగా 7వేల పైచిలుకు కేసులు, 300కుపైగా మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 14.4లక్షలకు, మరణాల సంఖ్య 86వేలకు పెరిగింది. వైరస్ వ్యాప్తి ఉధృతి తగ్గనప్పటికీ దేశంలో అన్ని వ్యవస్థల రీఓపెనింగ్ కు ప్రెసిడెంట్ ట్రంప్ పిలుపునివ్వడం గమనార్హం. తాజాగా పెన్సిల్వేనియాలో పర్యటించిన ఆయన.. ఆయా రాష్ట్రాల్లో అమలులో ఉన్న ఆంక్షలను వెంటనే తొలగించాల్సిందిగా గవర్నర్లకు పిలుపునిచ్చారు. వ్యాపార, వాణిజ్యాలతోపాటు స్కూళ్లు, కాలేజీలు కూడా తెరవాల్సిన అవసరముందన్నారు.

వ్యాక్సిన్ రీసెర్చ్ను హ్యాక్ చేశారా?
కరోనాకు సంబంధించి చైనాపై గుర్రుమీదున్న అమెరికా మరో సంచలన ఆరోపణ చేసింది. ఈసారి ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఎఫ్బీఐ) తరఫున ప్రకటన వెలువడటం గమనార్హం. అమెరికాలో కరోనా వ్యాక్సిన్ పరిశోధనకు సంబంధించి సమాచారాన్ని హ్యాక్ చేసేందుకు చైనా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందంటూ ఎఫ్బీఐ సైబర్ సెక్యూరిటీ విభాగం ఒక ప్రకటన చేసింది. యూఎస్ రీసెర్చర్లను టార్గెట్ చేసుకుని, చైనీస్ హ్యాకర్లు సైబర్ దాడులు చేస్తున్నారని తెలిపింది. కాగా, చైనా మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. ఆధారాలు లేకుండా ఇతర దేశాలపై అభాండాలు మోపడం అమెరికాకు కొత్తేమీ కాదని చైనా అధికార ప్రతినిధులు అన్నారు.

అటు రష్యా.. ఇటు బంగ్లాలో కలకలం..
మొన్నటిదాకా సేఫ్ గా కనిపించిన రష్యాలో 10 రోజుల్లోనే వైరస్ విపరీతంగా విస్తరించింది. రోజుకు కనీసం 10 వేలకు తగ్గకుండా అక్కడ కొత్త కేసులు నమోదవుతున్నాయి. గురువారం నాటికి రష్యాలో మొత్తం కేసుల సంఖ్య 2.52లక్షలకు పెరిగినా, మరణాల రేటు చాలా తక్కువగా ఉండటం గమనార్హం. ఇప్పటిదాకా అక్కడ 2,305 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్ పొరుగునే ఉన్న బంగ్లాదేశ్ లో తాజాగా తీవ్ర కలకలం మొదలైంది. అక్కడి రొహింగ్యాల క్యాంపులో గురువారం తొలి కేసు నమోదైంది. క్యాంపుల్లో వైరస్ వ్యాప్తి చెందితే అరికట్టలేమని అధికారులు భయపడుతున్నారు. బంగ్లాదేశ్ లో ఇప్పటిదాకా 18,863 కేసులు నమోదుకాగా, 283 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్ లో గురువారం రాత్రి నాటికి కేసుల సంఖ్య 81వేలుకు చేరింది. మరణాలు 2500దాటాయి.












Click it and Unblock the Notifications