కోవిడ్: భారత్లో వ్యాక్సీన్లకు అమెరికా అడ్డుపుల్ల.. 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకాలు వేయడం సాధ్యమేనా?
భారతదేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్లో కోవిడ్ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. మే 1 నుంచి 18 ఏళ్లు దాటినవారందరికీ వ్యాక్సీన్ అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఇప్పటికే దేశంలోని ప్రధాన వ్యాక్సీన్ ఉత్పత్తి సంస్థలు జాతీయంగా, అంతర్జాతీయంగా టీకాలు అందించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.
వ్యాక్సీన్ ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు ఫార్మా కంపెనీలకు భారత ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది.
సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ సంస్థలకు వరుసగా రూ.3000 కోట్లు, రూ. 1586 కోట్లు సహాయం అందించింది.
సీరం ఇన్స్టిట్యూట్ కోవిషీల్డ్ వ్యాక్సీన్ తయారు చేస్తుండగా, భారత్ బయోటెక్ కోవాగ్జిన్ తయారు చేస్తోంది.
దేశంలో ఉన్న అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని మార్చిలో టీకా ఎగుమతులను నిలిపివేశారు.
అయినప్పటికీ, కొన్ని దేశాలకు గ్రాంట్ల రూపంలో వ్యాక్సీన్లు అందిస్తున్నారు.
వ్యాక్సీన్ షేరింగ్ పథకంలో భాగంగా ఇతర దేశాలకు సహాయం చేస్తామని భారత ప్రభుత్వం హామీ ఇచ్చింది.
విదేశాల్లో తయారు చేస్తున్న ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సీన్ల దిగుమతికి ఇప్పుడు భారతదేశం ఆమోదం తెలిపింది.
అయితే, ఇండియాలో అత్యవరసర వినియోగానికి అవసరమైన లైసెన్స్ కోసం ఈ వ్యాక్సీన్ల తయారీదారులు ఎవరూ ఇప్పటివరకూ దరఖాస్తు చేయలేదు.
- ఉత్తర్ప్రదేశ్లో కోవిడ్: 'ఎక్కడ చూసినా అంబులెన్సులు, శవాలే... చనిపోయిన వారిని తీసుకెళ్లడానికీ ఎదురుచూడక తప్పడం లేదు’
- కరోనావైరస్ పిల్లలకు సోకితే ఎలా గుర్తించాలి... వారికి పరీక్షలు ఎప్పుడు చేయించాలి
అత్యవసర వినియోగానికి రష్యా వ్యాక్సీన్
దేశంలో అనేక రాష్ట్రాల్లో వ్యాక్సీన్ కొరత కనిపిస్తుండడంతో రష్యాలో తయారవుతున్న స్పుత్నిక్-వి వ్యాక్సీన్ను అత్యవసర వినియోగం కోసం డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా ఆమోదించింది.
ఐదు ఫార్మా కంపెనీలు స్పుత్నిక్-వి వాక్సీన్ తయారుచేస్తాయని, భారతదేశంలో ఏడాదికి 8.5 కోట్ల డోసులను ఉత్పత్తి చేస్తామని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ తెలిపింది.
ఈ సంస్థ స్పుత్నిక్-వి వ్యాక్సీన్ పరిశోధన, అభివృద్ధికి నిధులు సమకూరుస్తోంది.
ఈ వ్యాక్సీన్ను దేశంలోని అవసరాలకు వినియోగించడమే కాక, ఎగుమతి కూడా చేస్తారు. అయితే, ఈ టీకా ఉత్పత్తి ఇంకా ప్రారంభం కాలేదు.
వ్యాక్సీన్ ఉత్పత్తిదారుల కష్టాలు
నోవావాక్స్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్లు ఉత్పత్తి చేస్తున్న సీరం ఇన్స్టిట్యూట్ ముడి పదార్థాల కొరత గురించి మార్చిలోనే హెచ్చరించింది.
దీనికి కారణం అమెరికాలో ముడి పదార్థాల ఎగుమతిపై విధించిన నిషేధమేనని తెలిపింది.
టీకా తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలపై ఎగుమతి నిషేధాన్ని రద్దు చేయాలని గత వారం సీరం ఇన్స్టిట్యూట్ సీఈఓ అడార్ పూనావాలా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు విజ్ఞప్తి చేశారు.
ముడి పదార్థాల కొరత వ్యాక్సీన్ ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తోందని జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సీన్ తయారుచేసే భారతీయ సంస్థ 'బయోలాజికల్ ఈ' ఆందోళన వ్యక్తం చేసింది.
అమెరికా ఎందుకు నిషేధం విధించింది?
అమెరికాలో 1950లలో అమల్లోకి వచ్చిన డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్ (డీపీఏ) ప్రకారం, దేశీయ అవసరాల కోసం ముడి పదార్థాల ఎగుమతిపై నిషేధం విధించవచ్చు.
ఈ చట్టాన్ని అనుసరించి ప్రస్తుతం జో బైడెన్ ఎగుమతులపై నిషేధం విధించారు.
అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా టీకా ఉత్పత్తిపై ప్రభావం చూపుతుందని అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
ఫార్మస్యుటికల్ సప్లయి చైన్ చాలా క్లిష్టమైనదని లివర్పూల్లోని జాన్ మూరెస్ యూనివర్సిటీకి చెందిన వ్యాక్సీన్ నిపుణులు డాక్టర్ సారా షిఫ్లింగ్ అన్నారు.
"మిగతా పరిశ్రమలకన్నా ఇక్కడ భిన్నంగా ఉంటుంది. ఇక్కడ డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు కొత్త సప్లయర్లు డిమాండ్కు తగ్గ సరఫరాలు చేయలేరు. కొత్త సప్లయర్లపై అంత నమ్మకం కూడా ఉండదు.
అంతే కాకుండా, అకస్మాత్తుగా ఒక వస్తువుకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగిపోతే ముడి పదార్థాల కొరత ఏర్పడి తీరుతుంది" అని ఆమె వివరించారు.
- కరోనావైరస్: భారత్, బ్రెజిల్, బ్రిటన్, దక్షిణాఫ్రికాలలోని కొత్త వేరియంట్లు ప్రమాదకరమా?
- కరోనావైరస్: 'రెమెడెసివీర్ మందుల కోసం బ్లాక్ మార్కెట్ వైపు చూడాల్సి వస్తోంది'
టీకా ఉత్పత్తిపై దీని ప్రభావం
ఈ ఏడాది జనవరి నుంచి సీరం ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సీన్ 17.5 కోట్ల డోసులను దేశీయంగా వినియోగించారు. ఎగుమతి కూడా చేశారు.
నెలకు 6-7 కోట్ల డోసులను ఉత్పత్తి చేస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది.
ఇందులో అమెరికాలో అభివృద్ధి చేసిన నోవావాక్స్ డోసులు కూడా ఉన్నాయి. కానీ, వాటిని ఉపయోగించేందుకు ఇండియాలో ఇంకా లైసెన్స్ ఇవ్వలేదు.
ప్రస్తుతం నెలకు 10 కోట్ల డోసులను తయారుచేసే లక్ష్యాన్ని జూన్ వరకూ పొడిగించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాక్సీన్ ప్రోగ్రాం కోవాక్స్లో భాగంగా 20 కోట్ల వ్యాక్సీన్ డోసులను అందిస్తామని సీరం ఇన్స్టిట్యూట్ గత ఏడాది హామీ ఇచ్చింది.
కానీ, ఇప్పటివరకూ కేవలం 3 కోట్ల డోసులను మాత్రమే అందించగలిగింది.
కోవాక్స్ అగ్రిమెంట్లో భాగంగా ఇప్పటివరకు భారత్కు ఒక కోటి డోసుల టీకా లభ్యమైంది.
కోవాక్స్ ఒప్పందం ప్రకారం ఇతర దేశాలకు వ్యాక్సీన్ అందించే బాధ్యత సీరం ఇన్స్టిట్యూట్దేనని గ్లోబల్ వ్యాక్సీన్ అలయన్స్ (గావి) స్పష్టం చేసింది.
కాగా, కోవాక్స్ ఒప్పందంలో పాల్గొన్న దేశాలకు వ్యాక్సీన్ రావడం ఆలస్యం కావొచ్చని గావి హెచ్చరించింది.
ఐక్యరాజ్యసమితి రిపోర్ట్ ప్రకారం, సీరం ఇన్స్టిట్యూట్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ 90 కోట్ల డోసులను, నోవావాక్స్ 14.5 కోట్ల డోసులను అందించేందుకు ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకం చేసింది.
ఇవి కూడా చదవండి:
- కరోనా వైరస్: పిల్లల్లో సులభంగా, వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్త వేరియంట్
- మహిళలు మితిమీరి వ్యాయామం చేస్తే సంతానోత్పత్తి సమస్యలు తప్పవా?
- కరోనావైరస్: జంతువుల నుంచి మనుషులకు సోకింది ఇలాగేనా? శాస్త్రవేత్తల 'డిటెక్టివ్ కథ’
- కుంభమేళాను మీడియా ఎలా చూపిస్తోంది... తబ్లీగీ జమాత్ విషయంలో ఏం చేసింది?
- వాంతులు ఎందుకు వస్తాయి... ప్రయాణాల్లో కడుపు తిప్పినట్లు ఎందుకవుతుంది?
- అఫ్గానిస్తాన్లో 20 ఏళ్లుగా ఉన్న అమెరికా-బ్రిటన్ సేనలు ఏం సాధించాయి?
- కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
- లవ్ జిహాద్: మతాంతర ప్రేమను భయపెడుతున్న భారత చట్టం
- టైటానిక్: ఆనాటి ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆ ఆరుగురు చైనీయులు ఏమయ్యారు... జాతి వివక్ష వారిని వెంటాడిందా?
- జీవితాంతం గుర్తుండిపోవాల్సిన పెళ్లి పెను విషాదాన్ని మిగిల్చింది
- తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్న సిలికాన్ వాలీ సీఈఓ కథ
- అమెరికాతో ఒప్పందం తర్వాత తాలిబన్లు ఏం చేయబోతున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)