భయంకరమైన వరదలు: మహోగ్ర రూపం దాల్చిన నదుల్లా వీధులు, 78 మంది మృతి(వీడియో)
బ్రెసిలియా: బ్రెజిల్లో భారీ వర్షాల కారణంగా వరద బీభత్సం సృష్టిస్తోంది. పర్వత ప్రాంతమైన రియోడిజనీరో రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా భారీవర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల ధాటికి బ్రెజిల్లోని పెట్రోపోలీస్ నగరంలోని వీధులు నదులను తలపిస్తున్నాయి. ఈ వరదల్లో చిక్కుకుని మృతిచెందినవారి సంఖ్య 78కి చేరింది.
భయంకరంగా విరుచుకుపడిన వరదలు
వరదనీటి ధాటికి చాలావరకు ఇళ్లు ధ్వసంమయ్యాయి. తుపాన్ ప్రభావం వల్ల రియో డి జనీరోకు ఉత్తరాన ఉన్న హిల్స్లోని పెట్రోపోలీస్ నగరంపై వరదనీరు భయంకరంగా విరుచుకుపడింది. ఈ వరదల్లో పలువురు కొట్టుకుపోయారు. అగ్నిమాపక సిబ్బంది, వాలంటీర్ల సాయంతో బురదలో కూరుకుపోయిన మృతదేహాలను వెలికితీస్తున్నారు.
వరద బాధితులను సహాయ శిబిరాలకు తరలించి ఆహారం, నీళ్లు, దుస్తులు, ఫేస్ మాస్కులు అందిస్తున్నారు.
వరదలోనే కొట్టుకుపోయిన మనషులు, జంతువులు, వాహనాలు
భారీగా ప్రవహిస్తన్న వరదనీటిలో పదుల సంఖ్యలో మనుషులతోపాటు వందలాది కార్లు, చెట్లు, పశువులు కొట్టుకుపోయాయి. పెట్రోపోలిస్ నగరంలో కేవలం 3 గంటల్లో 258 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని స్థానిక మేయర్ ఆఫీసు ఒక ప్రకటనలో వెల్లడించింది. డిసెంబరు నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బ్రెజిల్ అతలాకుతలమైంది. గత నెలలో కుండపోత వర్షం, భారీ వరదల వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఆగ్నేయ బ్రెజిల్లో 28 మంది వరదల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.
వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 78 మంది మృతి
ఇప్పటి వరకు వరదల్లో చిక్కుకుని మరణించిన వారి సంఖ్య 78కి చేరుకుందని గవర్నర్ క్లాడియో కాస్ట్రో వెల్లడించారు. పెట్రోపోలిస్ నగరంలో మంగళవారం భారీ వరదలు ముంచెత్తాయి. దాదాపు 400 మంది నిరాశ్రయులయ్యారని తెలిపారు. శిధిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసినట్టు గవర్నర్ కాస్ట్రో తెలిపారు. మరో 21 మందిని సురక్షితంగా వెలికితీసినట్టు చెప్పారు. బురదతో కూడిన వరదనీటిలో చిక్కుకున్న అనేకమంది సాయం కోసం గట్టిగా కేకలు వేశారని, కానీ, వారిని కాపాడుకోలేకపోయానని రోసిలీన్ వర్జిలియో (49) అనే మహిళ కన్నీటిపర్యంతమైంది. వరదల కారణంగా మరణించినవారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు, మరో రెండ్రోజులు
పెట్రోపోలిస్ అనేది ఒక మాజీ బ్రెజిలియన్ చక్రవర్తి పేరు. జర్మన్-ప్రభావిత సముద్రతీర మహానగరానికి ఎగువన ఉన్న పర్వతాలలో ఉంది. దాదాపు రెండు శతాబ్దాలుగా పర్యాటకులకు ఆశ్రయంగా మారింది. రానురాను ఈ పర్వత ప్రాంతం దెబ్బతినడంతో ఇటీవలి దశాబ్దాలలో భారీ విపత్తులను ఎదుర్కొంటోంది. ఇప్పటివరకూ సంభవించిన విపత్తుల్లో 900 మందికిపైగా మరణించారు. ఈ పర్వత ప్రాంతమైన పెట్రోపోలిస్ నగరంలో తరచూ కొండచరియలు విరిగిపడి అనేక మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు గతంలోనూ జరిగాయి. ఈ ప్రమాదాలను తగ్గించడానికి అక్కడి ప్రభుత్వం ఒక ప్రణాళికను చేపట్టినట్టు గవర్నర్ తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురిశాయని పెట్రోపోలిస్ సివిల్ డిఫెన్స్ అథారిటీ తెలిపింది. మరో రెండు మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications