పాక్ ఆర్మీ చీఫ్గా షరీఫ్ రిటైర్మెంట్: చెప్పి మరీ అభిమాని ఆత్మహత్య
పాకిస్థాన్ ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ రిటైర్మెంట్ను తట్టుకోలేక ఓ అభిమాని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ రిటైర్మెంట్ను తట్టుకోలేక ఓ అభిమాని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం అతడి పదవీ కాలాన్ని పెంచకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన రహీల్ వీరాభిమాని లుత్ఫ్ అమిమ్ షిబ్లి(64) విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లుత్ఫ్ గతంలో కరాచీ పోర్ట్ ట్రస్ట్(కేటీపీ)లో ప్రోగ్రెసివ్ వర్కర్స్ యూనియన్కు చైర్మన్గా వ్యవహరించారు.
రహీల్ పదవీ కాలాన్ని పొడిగించకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ నవంబరు 1న కరాచీ ప్రెస్ క్లబ్(కేపీసీ) ఎదుట ఆందోళనకు దిగాడు. రహీల్ షరీఫ్ ఓ దూత అని, తాను అతడి అభిమానినని పేర్కొన్న లుత్ఫ్ ఉగ్రవాదం నుంచి దేశాన్ని రక్షించగలిగే దమ్ము ఆయనకు మాత్రమే ఉందని తెలిపాడు.

అయితే, నవంబరు 27న ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్(ఐఎస్పీఆర్) రహీల్ రిటైర్మెంట్ను ప్రకటించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన లుత్ఫ్ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు వైద్యులు తెలిపారు. ఆత్మహత్యకు ముందు లుత్ఫ్ తన భార్యకు రాసిన లేఖలో తన అంత్యక్రియల ప్రార్థనలు కరాచీ ప్రెస్క్లబ్ ఎదుట నిర్వహించాలని కోరడం గమనార్హం. లుత్ప్ మరణంతో ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.












Click it and Unblock the Notifications