ప్రపంచానికి ఇంటర్నెట్ కట్? కేబుల్స్ తెగిపోతున్నాయ్!
దశాబ్దాల కాలంగా హార్ముజ్ జలసంధి అంటే కేవలం ముడి చమురు రవాణాకు మాత్రమే ప్రపంచం ఒక 'లైఫ్ లైన్'గా భావించేది. కానీ, ఇప్పుడు ఆ జలసంధి పొరల్లో దాగి ఉన్న 'సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుల్స్' (Submarine Cables) ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త ప్రమాద ఘంటికలుగా మారాయి. ఇరాన్ తన వ్యూహాత్మక ఒత్తిడిని పెంచేందుకు ఇప్పుడు ఈ డిజిటల్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.
IRGC అనుబంధ మీడియా సంస్థ 'తస్నిమ్' తాజాగా ప్రచురించిన నివేదిక ఒక హెచ్చరికలా కనిపిస్తోంది. పర్షియన్ గల్ఫ్ గుండా వెళ్లే ఇంటర్నెట్ కేబుల్స్, క్లౌడ్ డేటా సెంటర్ల మ్యాపింగ్ను ఆ సంస్థ బయటపెట్టింది. యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా ఈ సముద్రగర్భ కేబుల్స్ పైనే ఆధారపడి ఉన్నాయి. ఇరాన్ కంటే ఈ దక్షిణ గల్ఫ్ దేశాలే ఈ మార్గాలపై ఎక్కువగా ఆధారపడుతున్నాయని, వీటిని దెబ్బతీస్తే ఆయా దేశాల కమ్యూనికేషన్ నెట్వర్క్ కుప్పకూలుతుందని తస్నిమ్ పరోక్షంగా హెచ్చరించింది.

డేటా హబ్లే టార్గెట్!
కేవలం సముద్రం లోపల ఉండే కేబుల్స్ మాత్రమే కాదు, తీర ప్రాంతాల్లోని 'ల్యాండింగ్ స్టేషన్లు', భారీ డేటా హబ్లను కూడా ఇరాన్ తన ఒత్తిడి కేంద్రాల జాబితాలో చేర్చింది. ముఖ్యంగా యూఏఈ, బహ్రెయిన్లలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) వంటి గ్లోబల్ క్లౌడ్ మౌలిక సదుపాయాల కేంద్రీకరణ ఎక్కువగా ఉంది. వీటిపై ఏమాత్రం దాడి జరిగినా ప్రపంచ వాణిజ్యం, బ్యాంకింగ్, కమ్యూనికేషన్ వ్యవస్థలు స్తంభించిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే బహ్రెయిన్లోని కొన్ని డేటా సెంటర్లపై ఇరాన్ డ్రోన్ దాడులు జరిపినట్లు వస్తున్న వార్తలు ఈ భయాన్ని నిజం చేస్తున్నాయి.
ముగియని అమెరికా దిగ్బంధనం
మరోవైపు, అమెరికా తన పట్టును ఏమాత్రం సడలించడం లేదు. ఇరాన్కు వ్యతిరేకంగా చేపట్టిన ఆర్థిక దిగ్బంధనంలో భాగంగా 31 నౌకలను వెనక్కి తిప్పి పంపినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) ధృవీకరించింది. డొనాల్డ్ ట్రంప్ సర్కారు ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. టెహ్రాన్ చర్చలకు వచ్చి ఒక నిర్ణయాత్మక ఫలితం వచ్చే వరకు ఈ నౌకా దిగ్బంధనం కొనసాగుతుందని అమెరికా స్పష్టం చేసింది. ఈ పరిణామాలు ఇరాన్ను మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయి.
మరమ్మతులు అసాధ్యం!
గతంలో (2024, 2025లో) ఎర్రసముద్రంలో కేబుల్స్ దెబ్బతిన్నప్పుడు వాటిని బాగు చేయడానికి కొన్ని నెలల సమయం పట్టింది. ఇప్పుడు యుద్ధం తీవ్రమైతే, హార్ముజ్ జలసంధిలో కేబుల్స్ తెగిపోతే వాటిని సరిచేసే 'కేబుల్ షిప్స్' అక్కడికి వెళ్లడం దాదాపు అసాధ్యం. ఉద్రిక్తతల మధ్య ఏ నౌక కూడా ఆ ప్రాంతానికి వచ్చే సాహసం చేయదు. దీనివల్ల నెలల తరబడి ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయి, బిలియన్ల కొద్దీ డాలర్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
యుద్ధం అంటే కేవలం తుపాకులు, బాంబులు మాత్రమే కాదు.. ఎదుటి పక్షాన్ని ఆర్థికంగా కోలుకోకుండా దెబ్బతీయడం. ఇప్పుడు ఇరాన్ అదే వ్యూహాన్ని అమలు చేస్తోంది. చమురు సరఫరాను ఆపడం కంటే ఇంటర్నెట్ కేబుల్స్ ను కట్ చేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా తక్షణ ప్రభావం కనిపిస్తుంది. పర్షియన్ గల్ఫ్ లో రేగుతున్న ఈ డిజిటల్ తుఫాను ఎటు దారితీస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications