వైట్హౌస్లో దీపావళి: బాలీవుడ్ పాటలకు మిచెల్లీ డ్యాన్స్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌధంలో జరిగిన దీపావళి వేడుకల్లో అమెరికా ప్రథమ మహిళ మిచెల్లీ ఒబామా బాలీవుడ్ పాటలకు నాట్యం చేశారు. శ్వేత సౌధంలో మంగళవారం సాయంత్రం దీపావళి వేడుకలు జరిగాయి. అయితే మిచెల్లీ ఆధ్వర్యంలో జరగడం ఇదే తొలిసారి. వేద మంత్రోచ్ఛనాల మధ్య ఆమె దీపాలు వెలిగించారు.
దీంతో విద్యుత్ కాంతులతో ధగధగలాడే శ్వేత సౌధంలో దీపావళి కాంతులు విరజిమ్మాయి. భారతీయ సంస్కృతికి మూలమైన వేదమంత్రాలు వైట్హౌస్లోని ఈస్ట్ రూమ్లో తొలిసారిగా వినిపించాయి. వైట్ హౌస్లో అధికారికంగా జరిగిన దీపావళి వేడుకల్లో మిచెల్లీ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆమె స్వయంగా దీపాన్ని వెలిగించి దీపావళి ఉత్సవాలను ప్రారంభించారు.
బాలీవుడ్ హిందీ పాటలకు అనుగుణంగా భారత సంతతికి చెందిన చిన్నారులతో కలిసి ఆమె డాన్స్ కూడా చేశారు. మూడేళ్ల క్రితం భారత్ పర్యటనకు ఒబామాతో విచ్చేసిన మిచెల్లీ ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో బాలీవుడ్ డాన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపర్చిన విషయం తెలిసిందే.
భారత్లో పర్యటించిన సమయంలో దీపావళి ప్రాముఖ్యత తెలిసిందని, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఒకచోట కలుసుకుని జరుపుకున్న వేడుకల్లో తాను పాల్గొన్నానని మిచెల్లీ గుర్తు చేసుకున్నారు. అనంతరం ఉత్తర అమెరికాకు చెందిన భారతీయ ఆలయాల కౌన్సిల్ అధ్యక్షురాలు మైథిలీ బసు మిచెల్లీని పూలమాలతో సత్కరించారు.
వైట్హౌస్లో తొలిసారిగా జరిగిన బాలీవుడ్ డాన్స్ మిచెల్లీతోపాటు అందరినీ సంతోషపరిచిందని మైథిలీ పేర్కొన్నారు. వైట్హౌస్లో దీపావళి వేడుకల కోసం భారతీయ సంతతికి చెందిన ప్రముఖ డిజైనర్ నరుమ్ ఖాన్ రూపొందించిన డ్రస్ను మిచెల్లీ ధరించారు. బాలీవుడ్ పాటలకు మిచెల్లీ చేసిన డాన్స్ ఆహూతులను సంభ్రమాశ్చర్యలకు గురిచేసింది.
అఫ్కోర్స్! నేను డాన్స్ చేస్తానని మీకందరికీ తెలుసనుకుంటానని మిచెల్లీ వ్యాఖ్యానించి మరింత ఉత్సాహపరిచారు. అమెరికాలో ఖ్యాతిగాంచిన గోల్డ్స్పాట్ బాండ్ డాన్స్ గ్రూప్ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారిని చూపిస్తూ వాళ్ల మాదిరిగా అంత బాగా చేయలేకపోవచ్చు కానీ, నేను కూడా డాన్స్ చేస్తానని ఆమె వ్యాఖ్యానించారు. 2009లో తొలిసారిగా వైట్హౌస్లో జరిగిన దీపావళి వేడుకల్లో అధ్యక్షుడు బరాక్ ఒబామా పాల్గొన్నారు.