హార్ట్ టచింగ్ : కరోనా ఎఫెక్ట్.. ఇదీ ఓ డాక్టర్ భార్య ఆవేదన..
కరోనా వైరస్ మానవ సంబంధాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. తల్లుల నుంచి బిడ్డలను,భార్యల నుంచి భర్తలను వేరుచేయాల్సిన అనివార్య స్థితిని కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో మనసులను కలచివేసే కథనాలు వెలుగుచూస్తున్నాయి. ఇటీవల క్వారెంటైన్లో ఉంచిన ఓ చిన్నారి.. గ్లాస్ విండోలో నుంచి చూస్తూ తన తండ్రిని హగ్ కోరగా.. అతను కంటతడి పెట్టుకున్న వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో కరోనా వైరస్ కారణంగా వైద్యుడైన తన భర్తను కుటుంబం ఎంతగా మిస్ అవుతుందో చెబుతూ ఓ మహిళ ట్విట్టర్లో హార్ట్ టచింగ్ పోస్ట్ పెట్టింది.
ఆమె భర్త ఓ డాక్టర్..
అమెరికాకు చెందిన రాచెల్ పాట్జర్ అనే మహిళ.. ఫిజీషియన్గా పనిచేస్తున్న తన భర్త కరోనా వైరస్ పేషెంట్లకు ఎంత నిబద్దతతో వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తున్నారో చెప్పుకొచ్చింది. తమకు ముగ్గురు సంతానం అని.. ఇటీవలే ఓ బేబీకి జన్మనిచ్చానని తెలిపింది. అయితే కరోనా పేషెంట్లను ట్రీట్ చేస్తున్న కారణంగా.. తన భర్త కొన్ని వారాలుగా ఇంటికి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అతనికి కూడా వైరస్ సోకే అవకాశం ఉన్నందునా.. తమ అపార్ట్మెంట్లోని గ్యారేజ్లో అతన్ని ఐసోలేట్ చేసినట్టు తెలిపింది.

డాక్టర్లు ఇంత కష్టపడుతుంటే.. కొంతమంది..
కుటుంబాలను సైతం వదిలి.. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా డాక్టర్లు వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తున్నారని తెలిపింది. ఇటీవలే పుట్టిన తమ బిడ్డను తన భర్త ఇప్పటివరకు కనీసం తాకలేకపోయాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఓవైపు డాక్టర్లు,హెల్త్ కేర్ సిబ్బంది కరోనా వైరస్ నియంత్రణ కోసం ఇంత చేస్తుంటే.. కొంతమంది ప్రజలు మాత్రం అసలేమీ పట్టనట్టు బార్లకు వెళ్లడం.. గుంపుగుంపులుగా చేరి కార్యక్రమాలు నిర్వహించుకోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రజలు ఇప్పటికైనా కరోనా వైరస్ను తీవ్రంగా పరిగణించాలని.. హెల్త్ కేర్ సిబ్బంది పట్ల వారు కృతజ్ఞతతో ఉండాలని పేర్కొన్నారు. రాచెల్ చేసిన ఈ ట్వీట్ ప్రపంచవ్యాప్తంగా వైరల్గా మారింది.
డాక్టర్లు,హెల్త్ కేర్ సిబ్బందికి కృతజ్ఞతలు చెబుతున్న నెటిజెన్స్
రాచెల్ పోస్టుపై నెటిజెన్స్ పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. వైరస్ సోకుతుందని తెలిసినా వృత్తి ధర్మాన్ని బాధ్యతగా నిర్వహిస్తూ త్యాగాలకు సైతం సిద్దపడుతున్న డాక్టర్లు,హెల్త్ కేర్ సిబ్బందికి ధన్యవాదాలు చెబుతున్నారు. ఇంతటి క్లిష్ట సమయంలో వారి సేవలే మానవాళిని రక్షిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. ప్రజలు ఇప్పటికైనా నిర్లక్ష్య వైఖరిని విడనాడి.. ప్రభుత్వాలు,డాక్టర్లు చెబుతున్న సలహాలు సూచనలు పాటించాలని కోరుతున్నారు. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 2,03,841 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 8231 మంది మృత్యువాతపడ్డారు. కొత్త కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది.












Click it and Unblock the Notifications